పసుపు పంటకు నిజామాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌

కేంద్రం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. కానీ రైతుకు న్యాయమైన ధర అందడం లేదు. పక్కనే వున్న మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్‌లో ధర ఎక్కువగా వస్తుంది. ఇక్కడ పండే పసుపులో కుర్కుమిన్‌ శాతం తక్కువగా వుంది. దీనికి కారణం కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనం అందుబాటులో లేకపోవడం. కేరళ ఏరోడ్‌ అనే విత్తనంలో కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమిలో నుండి పసుపు తవ్వడం, ఉడకపెట్టడం, పాలిష్‌ చేయడంలో యంత్రపరికరాలు అవసరం. ఆధునిక యంత్రాలు అందించడంలో కేంద్రానిదే బాధ్యత ఉంటుంది కాబట్టి వచ్చే సీజన్‌కు ముందే కేంద్రం చొరవతీసుకోవాలని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులకోసం పనిచేయాలని, కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనాన్ని అందించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌కు కూడా సూచించామని రైతు కమీషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్‌ సభ్యులు భవానీరెడ్డి, భూమి సునీల్‌ పాల్గొన్నారు.

Read More

పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ

వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార మరియు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలని తేది. 13.11.2024 నాడు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు అనేది పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష అని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర పసుపు రైతుల ప్రయోజనాలపై సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాలలో నిజామాబాద్‌ ప్రధానమైనది. నిజామాబాద్‌ పసుపు రైతులు గత 10 సంవత్సరాల నుంచి పసుపు మద్ధతు ధర కోసం మరియు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నారని మంత్రి చెప్పారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పసుపు రైతులను బలోపేతం చేయడం కొరకు, పసుపు సాగు విస్తీర్ణం పెంచడానికి మరియు పసుపు అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి, ఎగుమతి అవకాశాలు పెంచడానికి, పసుపు రైతులు కోరుకుంటున్నట్లుగా రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసినట్లయితే పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో 3,300 ఎకరాలలో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయని, అందులో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (1757 ఎకరాలలో) మరియు ఖమ్మం జిల్లా (696 ఎకరాలలో)ల నుండే 75 శాతం కొబ్బరితోటలు సాగులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఈ జిల్లాలలోని కొబ్బరి రైతులు కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అక్కడ కొబ్బరితోటల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, అందుకోసం భద్రాద్రి కొత్తగూడెంలో ప్రత్యేకంగా రీజనల్‌ కోకోనట్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని లేఖ ద్వారా కోరడం జరిగింది.
కోకోనట్‌ బోర్డు ద్వారా రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు అంతరపంటలు, మిశ్రమ పంటల విషయంలో, చీడ పీడల నివారణలో తగిన సాంకేతిక సలహాలు అందించడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా కొబ్బరి రైతులలో నిర్వహణపరమైన మెళుకువలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా విలువ ఆధారిత ఉత్పత్తులు, నాణ్యమైన కొబ్బరి మొలకలను మరియు నూతన వంగడాలను రైతులకు అందించడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు.
అలాగే తెలంగాణలో ఇప్పటివరకు 91,200 హెక్టార్లలో పామ్‌ ఆయిల్‌ సాగు చేస్తున్నారని, ప్రతి సంవత్సరం 40,000 హెక్టార్లలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలోనే పామ్‌ ఆయిల్‌ సాగులో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రిసెర్చీ అనేది మాత్రమే దేశంలో ఆయిల్‌ పామ్‌ పై పరిశోధనలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల పామ్‌ ఆయిల్‌ రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్‌ పామ్‌ తోటల విస్తీర్ణం పెరుగుతున్నందున, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రాంతీయ ఆయిల్‌ పామ్‌ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పామ్‌ ఆయిల్‌ రంగంలో రైతులకు అవసరమైన శాస్త్రీయ, సాంకేతిక సలహాలు, సూచనలు అందించాలని వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు.

Read More