ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఉచిత పశువైద్య శిబిరాలు

ఎన్‌టిఆర్‌ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు ఈ నెల 19వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పశువులు, లేగ దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నిర్మూలన మందులు ఉచితంగా వేస్తారని చెప్పారు. గొర్రెలకు బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లల్లో కొక్కెర తెగులు నివారణకు టీకాలు వేయనున్నట్టు పేర్కొన్నారు. అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలను నిర్వహించి మందులు ఇవ్వనున్నట్టు వివరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మద్దు హనుమంతరావు, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్‌.వి. నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

సాగు పరికరాలు అద్దెకు

రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గేలా సాగుకు అవసరమైన పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. డ్వాక్రా మహిళా రైతులతో (వారి కుటుంబ సభ్యులు)కూడిన ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 520 ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీవో) ఉండగా వాటి పరిధిలో తొలి విడతగా 300 సీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధకశాఖల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

60 కోట్లు కేటాయింపు
జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద సీహెచ్‌సీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 60 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. సీహెచ్‌సీల ఏర్పాటుకు ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.20 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.

రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలే అందుబాటులో ఉంచుతారు
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎఫ్‌పీవో పరిధిలో 1500 నుంచి 2 వేల మంది సన్నచిన్నకారు రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇవి మండలానికి ఒకటి చొప్పున ఉన్నాయి. రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలను కొని సీహెచ్‌సీల్లో ఉంచుతారు. రైతులకు ఈ పరికరాలను బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు అద్దెకిస్తారు. సీహెచ్‌సీల నిర్వహణను ఎఫ్‌పీవోనే చూస్తుంది. వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాటి నిర్వహణకే వెచ్చిస్తారు.

Read More

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ‘పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలి’

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పశుపోషకులంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్‌ టి. దామోదర్‌ నాయుడు తెలిపారు. ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు. ‘పశువులు సహా ఇతర జీవాల షెడ్లను పొడిగా ఉంచి వాటి చుట్టూ బ్లీచింగ్‌ పౌడర్‌ వంటివి చల్లాలి. ఈ కాలంలో సంభవించే వ్యాధుల నుంచి వాటిని రక్షించుకుంటూ ప్రభుత్వం ఉచితంగా అందించే నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలను వేయించాలి. లేగదూడలకు వెచ్చని వాతావరణం కల్పించాలి. పశువులకు సురక్షిత నీటిని అందించాలి. తడిసిన దాణా పెట్టకూడదు. పశువులకు అనారోగ్య లక్షణాలు కనిపించినా లేదా చనిపోయినా సమీప పశువైద్యశాలలో తప్పకుండా తెలియజేయాలి’ అని దామోదర్‌ వివరించారు.

Read More
  • 1
  • 2