ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన కౌలు ధరలు

ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది రబీ ఇంకా పూర్తిగా ముగియక ముందే పొలాలు కౌలుకు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న పొలాలైతే ఎకరాకు రూ.40 వేలు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. మిరప సాగు అనుకూలించడమే దీనికి కారణం. ఈ ఏడాది వాతావరణంలో మార్పు కారణంగా జనవరి నుంచి మిరపలో నల్లతామర ప్రభావం తగ్గింది. తోటలు ఏపుగా పెరిగాయి. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి లభిస్తోంది. అక్కడక్కడా ఎకరాకు 40-50 క్వింటాళ్లు వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. మిరప ధరలు క్రమంగా పెరుగుతూ సగటున క్వింటాలు రూ.20 వేలకు చేరాయి. పెట్టుబడులు పోగా కొంతైనా మిగులుతుందని, అప్పుల నుంచి ఎంతోకొంత బయటపడతామనే ఆశ రైతుల్లో ఉంది. విత్తన మొక్కజొన్న రైతులకూ అధిక దిగుబడులే వచ్చాయి. అందుకే వచ్చే ఖరీఫ్, రబీల్లో ఈ రెండు పంటల సాగుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా పల్నాడు జిల్లాలో ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. వచ్చే ఏడాది కూడా మిరప సాగు పెరుగుతుందని అంచనా. గురజాల, పెదకూరపాడు, మాచర్ల, చిలకలూరిపేటతో పాటు గుంటూరు జిల్లా తాడికొండ తదితర నియోజకవర్గాల్లో సాగు అధికం. గురజాల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ముందే చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం ప్రాంతంలో బోర్ల కింద ఉన్న భూములకు ఎకరా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు పలుకుతోంది.
“ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిరప సాగు కొన్నేళ్లుగా పెరిగింది. హంద్రీ-నీవా, తుంగభద్ర హైలెవల్ కెనాల్ పరిధిలో మిరప విస్తృతంగా పండిస్తున్నారు. వచ్చే ఏడాది మళ్లీ మిరప వేసేందుకు పొలాలను కౌలుకు తీసుకుంటున్నారు. ఎకరాకు రూ. 40వేల నుంచి రూ.45వేల మధ్య చెల్లించేలా కౌలుకు తీసుకుంటున్నారు.

Read More

వెయ్యి కాయలకు రూ.24 వేలు పలికిన పచ్చి కొబ్బరి కాయలు

మూడు రోజుల క్రితం వరకు వెయ్యి కాయల ధర రూ.22 వేలు ఉండగా ఇప్పుడు రూ.23 వేల నుంచి రూ.24 వేలకు చేరింది. కోనసీమ మార్కెట్‌ చరిత్రలో ఇది అరుదైన రికార్డుగా చెబుతున్నారు. ప్రాంతాలను బట్టి కొందరు వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాయల పరిమాణం, నాణ్యత, బరువును బట్టి కొన్ని ప్రాంతాల్లో వెయ్యి పచ్చి కాయలు రూ.25 వేలకు చేరువలో ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలలో కాయల పరిమాణం ఆశాజనకంగా ఉంటుంది. దీంతో వర్తకులు రైతుల వద్ద నుంచి ఇప్పుడే పెద్దఎత్తున కొని నిల్వ చేసుకుంటున్నారు. రానున్న దసరాకు మంచి ధర వస్తుందని ఆశిస్తున్నారు. దిగుబడులు సన్నగిల్లాయి. గతంలో ఎక రాకు వెయ్యి కాయలు వస్తే ఇప్పుడు సగానికి తగ్గిపోయి కొరత ఏర్పడింది. దీంతో రోజుల వ్యవధిలోనే ధరలో పెరుగుదల కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు ఎగుమతులు జోరందుకున్నాయి.

Read More