జిల్లాలవారీగా జొన్నకొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తెలంగాణా రాష్ట్రంలోరూ.1,100 కోట్లతో జిల్లాలవారీగా జొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తామని మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు మరో రూ.1,800 కోట్లతో అదనంగా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ.. “యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు 16.13 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం ఉత్పత్తి 42.87 లక్షల టన్నులకు చేరింది. మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే రూ.4,172.94 కోట్లతో 12.85 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. మరో 6.53 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో 4.03 లక్షల ఎకరాల్లో 4.03 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తి అయింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లతో కొనుగోళ్లు చేపడతాం. ఆదిలాబాద్ జిల్లాలో 26, సంగారెడ్డి జిల్లాలో 10, కామారెడ్డి జిల్లాలో 43, మెదక్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. దీంతోపాటు 10,175 టన్నుల పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తాం” అని వెల్లడించారు.

Read More

నూనెగింజలు, ఆయిల్‌పామ్‌ పంటలే లాభదాయకం

తెలంగాణలో రైతులు నూనె గింజలు, ఆయిల్‌పామ్‌ పంటలను అత్యధికంగా సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ప్రభుత్వపరంగా రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని తెలిపారు. జాతీయ నూనె గింజల పథకం కింద రూ.46.14 కోట్లతో 2025-26కి గాను మేలిమిరకం వేరుసెనగ విత్తనాల ఉచిత పంపిణీని మంగళవారం సచివాలయం నుంచి ప్రారంభించారు. ‘ఇతర పంటల కంటే నూనెగింజలు, ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. సాగును పెంచేందుకు వీలుగా 38,434 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయించాం. నూనెగింజల పంటలకు యూరియా వాడకాన్ని తగ్గించి, సమతుల ఎరువుల వాడకాన్ని అలవర్చుకోవాలి’ అని తుమ్మల సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, సంచాలకుడు గోపి తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రధానమంత్రి ధనధాన్యయోజన కింద తెలంగాణ నుంచి జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, జనగామ జిల్లాల ఎంపిక

వ్యవసాయపరంగా తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేసి అక్కడ ఉత్పత్తి పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద తెలంగాణ నుంచి ఎంపికైన జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, జనగామ జిల్లాలకు ఐఏఎస్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న పౌసుమి బసుకు జోగులాంబ గద్వాల, మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న నీతూ కుమారి ప్రసాద్‌కు నాగర్‌కర్నూల్‌ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ తెలంగాణ కేడర్‌ అధికారులు. కేంద్ర సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న బిహార్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి రమణకుమార్‌కు నారాయణపేట, హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న ఏజీఎంయూటీ కేడర్‌ అధికారిణి సుష్మాచౌహాన్‌కు జనగామ జిల్లా బాధ్యతలు అప్పగించారు.  ఈ పథకం క్రింద పంట మార్పిడిని ప్రోత్సహించడంతో పాటు సాగునీటి వసతిని, దిగుబడుల నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తారు. రైతులకు రుణాలు అందిస్తారు. మొత్తం ఆరేళ్లకాలంలో ఈ పథకం కింద రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తారు. తద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నది అంచనా. ఈ నెల నుంచే ఈ పథకం అమల్లోకి రానుంది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల పరిధిలోని 36 పథకాలను సమ్మిళితం చేసి దీని కింద అమలుచేస్తారు.
Read More