ప్రభుత్వానికి వ్యవసాయ శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక
తెలంగాణ రాష్ట్రంలోని మూసీనది పరీవాహకంలో కలుషిత జలాలతో పండించిన పంట ఉత్పత్తులు ప్రమాదకరంగా మారుతున్నందున ఆహార పంటల సాగును నిలిపివేసి ప్రత్యామ్నాయంగా పూలసాగును చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించారు. మూసీ నదిలో క్యాన్సర్ కారక ఆర్సెనిక్, క్రోమియం, కాపర్, నికెల్, లెడ్ వంటి రసాయనాలుండగా.. ఆ నీటితో పండించే పంట ఉత్పత్తుల్లో భారలోహాలున్నట్లు ఇప్పటికే అధ్యయనాల్లో వెల్లడైంది. మురికినీటితో సాగు చేయడంవల్ల వ్యవసాయ భూములు పంటలకు పనికిరాకుండా పోతున్నాయని గుర్తించారు. ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు మూసీ పరీవాహకంలోని పలు గ్రామాల్లో పర్యటించి అక్కడి పంటల పరిస్థితులను అధ్యయనం చేశారు. ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమం కింద అన్నదాతలతో మాట్లాడి, ప్రజాభిప్రాయాలను తెలుసుకుని నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు.
అధ్యయన అంశాలివి.. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని 81 గ్రామాల్లో పంటల సాగు జరుగుతోంది. ఇక్కడి రైతుల్లో ఎక్కువ మంది మూసీ నీటిని ఉపయోగిస్తుండగా.. 30 శాతం మంది వరకు బోర్ల కింద సాగు చేస్తున్నారు. వరి, జొన్న, బత్తాయి, కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నారు. తాము పర్యటించిన ప్రాంతాల్లో కలుషిత మూసీ నీటితో పంటలు సాగవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వరి, ఇతర ఆహారపంటలు, కూరగాయలు, ఆకుకూరలను సాగుచేయవద్దని, పండ్ల తోటలను పెంచవద్దని రైతులను కోరారు. ఇక్కడి గడ్డిని పశువులు మేస్తే అవి అనారోగ్యం బారిన పడతాయన్నారు. మూసీ నీటిని శుద్ధి చేస్తేనే ఈ భూములు పంటల సాగుకు అనుకూలంగా మారతాయన్నారు. అప్పటివరకు రైతులు భూములను వదులుకునే పరిస్థితి లేనందున.. అక్కడ పూల సాగును చేపట్టాలని, వాటివల్ల రైతులకు ఆదాయం వస్తుందని, ప్రజలకు ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు నివేదికలో పేర్కొన్నారు.
వరి కంటే చిరుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న పంటల సాగు లాభదాయకమని జనరల్ నేచర్ కమ్యూనికేషన్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలో మార్పులు, వర్షాభావం, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో వరి ఉత్పత్తి ప్రభావితం అవుతోందని.. ఇది భవిష్యత్తులో ఆహారభద్రతకు సమస్యగా మారే ప్రమాదమున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించింది. వరి నుంచి ఇతర పంటలకు మారిన అన్నదాతలు 11% లాభాలు గడించినట్లు అధ్యయనం వెల్లడించింది. వరి, జొన్న, చిరుధాన్యాలు, మొక్కజొన్నలకు సంబంధించిన గణాంకాలను ఇక్రిశాట్ నుంచి పొందినట్లు పేర్కొంది. అధ్యయన బృందంలో భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొ. అశ్విని ఛాత్రే తదితరులున్నారు.
ఖరీఫ్లో కరవు పరిస్థితుల కారణంగా 5 జిల్లాల పరిధిలో 1.06 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కరవు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ. 151.77 కోట్ల సాయం అందించాలని కోరింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి పెరిన్దేవి నేతృత్వంలోని అధికారుల బృందం బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పర్యటించింది. వారు అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లోని రైతులతో మాట్లాడి.. పంటనష్టం తీరును తెలుసుకున్నారు. అనంతరం గురువారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూశాఖ (భూములు, విపత్తుల నిర్వహణ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా వారికి కరవు పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. ఉపశమన చర్యలు చేపట్టాం కరవు ప్రభావంతో పత్తి, జొన్న, వేరుశనగ, కంది, శనగ, మొక్కజొన్న తదితర 14 రకాల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు. ‘రూ. 16.67 కోట్లతో 80% రాయితీపై విత్తనాలు, రూ.55.47కోట్లతో పశుగ్రాస విత్తనాలు అందించాం. 60% రాయితీపై చాప్కట్టర్లు ఇచ్చాం. పశువైద్యశాలలకు మందులు సరఫరా చేశాం’ అని ఆయన పేర్కొన్నారు. కరవు నష్టంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రైతులను ఆదుకునేలా చూస్తాం కరవు ప్రభావ ప్రాంతాల్లో రైతులతో మాట్లాడి.. వాస్తవ నష్టాన్ని తెలుసుకున్నామని పెరిన్దేవి చెప్పారు. ‘కేంద్రానికి త్వరితగతిన నివేదిక ఇస్తాం. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకునేలా చూస్తాం’ అని హామీ ఇచ్చారు.
కరవు జిల్లాలు : కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు పంట నష్టం : 1.06 లక్షల హెక్టార్లు నష్టపోయిన రైతులు : 1.44 లక్షలు ఉత్పత్తి నష్టం : రూ.240 కోట్లు
రంగాలవారీగా కేంద్రాన్ని కోరిన సాయం రంగం సాయం (రూ. కోట్లలో) వ్యవసాయం (పెట్టుబడి రాయితీ) 90.63 పశుసంవర్థక శాఖ 55.47 గ్రామీణ నీటి సరఫరా 0.78 పట్టణ నీటిసరఫరా 4.89 మొత్తం 151.77
ఆంధ్రప్రదేశ్లో 26కి గాను 20కి పైగా జిల్లాల్లో కరువు విపరీతంగా ఉంది. నిండిన జలాశయాలు లేనిచోట, తెలంగాణాలో కూడా వర్షాలు లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరులేక కాలువ నీటితో పంటలు పెట్టలేదు. వర్షాకాలపు పంటలు పండక రైతులు బాగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో నవంబర్ (స్వాతి కడరోజులు, విశాఖ, అనూరాధ కార్తెలు)లో వివిధ పంటలలో చేయవలసిన పనుల గురించి…
కొత్తిమీర/ధనియాలు: అధిక ధనియాలు మరియు కొత్తిమీర దిగుబడులు సాధించడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు విత్తుట వాతావరణ రీత్యా అనుకూలం. ఒత్తుగా ఉన్న మొక్కలను పీకి కొత్తిమీరగా అమ్మవచ్చు. బిపి, షుగరు, మూత్ర పిండాల రోగాలు, కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గడానికి మంచిదని కొత్తిమీర వినియోగం అన్ని కాలాలలోనూ పెరుగుతున్నది. ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మంచి విత్తనదిగుబడికి అనుకూలమైన రకాలు: హిస్సార్ సురభి, గుజరాత్ ధనియా, సింపోస్-33, ధనియాల ధరలు మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి.
జొన్న: ఇప్పుడు జొన్న తినే వాళ్లు పెరుగుతున్నారు. సరిపడినంత పంట మార్కెట్లో లేక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాదు రీటైల్ మార్కెట్లలో మంచి క్వాలిటీ జొన్న పిండి ధర కిలోకు రూ. 90. పూర్వం జొన్న రకాలు తక్కువ దిగుబడినిచ్చేవి (10-12 క్వి/ఎ.). ఇప్పుడు 20-25 క్వి/ఎ. అంతకంటే ఎక్కువ దిగుబడి నిచ్చే రకాలు అందుబాటులోకొచ్చాయి. ఉదా: పర్భనిశక్తి (ఐ.సి.ఎస్.ఆర్-14001): గింజ దిగుబడి నీటి ఆధారంగా 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి/ఎ. రెండు తెలుగు రాష్ట్రాలలోను, మహారాష్ట్రలోనూ పండించవచ్చు. ఐరన్, జింకు, ప్రోటీన్లు ఎక్కువ. తెల్లగింజ రకం. చలికాలం/యాసంగిలో (నవంబర్లో కూడా) విత్తవచ్చు. నీటి సౌకర్యముండాలి. ఐ.సి.ఎస్.హెచ్-14002: హైబ్రిడ్. తెల్లగింజ. చలికాలం/యాసంగిలో విత్తవచ్చు. నీటి ఆధారంగా గింజ దిగుబడి 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి/ఎ. నీటి ఆధారంతో ఈ నెలలో విత్తవచ్చు. ఐరన్, జింక్ ఎక్కువ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహారాష్ట్రలోనూ విత్తుటకుపయోగం. చొప్ప దిగుబడి కూడా ఎక్కువ. ఎన్.టి.జె-5: గింజ దిగుబడి నల్ల నేలల్లో 20-25 క్వి/ఎ. తేలిక నేలల్లో 14-16 క్వి/ఎ. జొన్న మద్ధతు ధర: హైబ్రిడ్: రూ. 3180/క్వి. మల్దండి: రూ. 3225/క్వి. జొన్నను నీటి సౌకర్యంతో ఈనెలలో విత్తవచ్చు.
మొక్కజొన్న: అత్యధిక దిగుబడులు సాధించాలంటే విత్తడానికి అనుకూలమైన సమయం అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు. ఈ సమయంలో విత్తడానికి సిఫారస్ చేయబడిన ప్రైవేటు హైబ్రిడ్లు: 100-120 రోజులవి: 900 ఎం. గోల్డ్, ఎన్.కె-6240. 90-100 రోజులవి: కోహినూర్, ప్రభల్. 90 రోజులలోపువి: పయనీర్-3342, ఎం.ఎం.హెచ్-133. తీపిమొక్కజొన్న కాంపోజిట్లు (రైతు పండించిన విత్తనాలను తిరిగి విత్తుకోవచ్చు): ప్రియ, మాధురి, విన్ఆరంజ్, అల్మోరా. తీపిమొక్కజొన్న హైబ్రిడ్లు (రైతు పండించిన విత్తనాలు తిరిగి విత్తితే దిగుబడి బాగా పడిపోతుంది): షుగర్-75, బ్రైట్ జీన్. తీపిమొక్కజొన్న గింజలలో చక్కెర 20-24 శాతం ఉంటుంది. బేబీకార్న్కు అనువైన కాంపోజిట్లు: మాధురి తీపి మొక్కజొన్న, హిమ్-129, హిమ్-123, వి.ఎల్-42. బేబికార్న్కు అనువైన హైబ్రిడ్లు: హిమ్-128, ప్రకాశ్, హెచ్.ఎం-4. పేలాల రకాలు: అంబర్ పాప్కార్న్, పెర్ల్ పాప్కార్న్, వి.ఎల్. అల్మోరా పాప్కార్న్. క్వాలిటీ ప్రోటీన్ రకాలు: ఇందులో రెట్టింపు లైసిన్ మరియు ట్రిప్టోఫిన్ అనే అమైనోఆమ్లాలుంటాయి. అంబర్శక్తి, హెచ్.క్యు.పి.ఎం-7, వివేక్ క్యు.పి.ఎం-9. పశుగ్రాస రకాలు: ఎ.పి.ఎఫ్.ఎం-8, గంగ-5, విజయ కాంపోజిట్. వరిమాగాణుల్లో మొక్కజొన్న: దుక్కి దున్నే ఖర్చు మిగులుతుంది. నెలరోజుల పంటకాలం కలిసొస్తుంది. బరువైన తేమను నిలుపుకొనే నేలల్లోనే ఈ పద్ధతి పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుండి జనవరి మొదటి వారం వరకు, రాయలసీమ, తెలంగాణలలో నవంబరు నుండి డిశంబరు వరకు విత్తవచ్చు. ఆ తర్వాత విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. మొక్కజొన్న మద్ధతు ధర: రూ. 2090/క్వి.
శనగ: ఈ పంట మద్ధతు ధర రూ. 5335/క్వి. మద్ధతు ధర కంటే, మార్కెట్ ధర అధికంగా ఉంది. ఈ పంట అధిక దిగుబడికి ఆంధ్రప్రదేశ్లో అక్టోబరు 15 నుండి నవంబరు 15 లోగా విత్తాలి. తెలంగాణాలో అక్టోబరు మొదటి నుండి నవంబరు 15 లోగా విత్తాలి. అత్యధిక దిగుబడులనిచ్చే ఎండుతెగులును తట్టుకునే రకాలు: నంద్యాలగ్రామ్-857 (ఎన్.బిఇ.జి-857): దేశవాళీరకం. దిగుబడి 1-2 నీటి తడులతో 12-14 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. 90-105 రోజుల పంట. తమిళనాడు, కర్ణాటకల్లో కూడా సాగు చేయడానికి అనుకూలం. నంద్యాల గ్రామ్-452 (ఎన్.బిఇ.జి.-452): దేశవాళి రకం. దిగుబడి 1-2 నీటి తడులతో 10-12 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. ధీర (ఎన్.బిఇ.జి-47): దేశవాళీ రకం. 90-105 రోజులు. దిగుబడి 1-2 నీటి తడులతో 10-12 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. యంత్రంతో కోయడానికి అనుకూలం. నంద్యాల గ్రామ్-119 (ఎన్.బిఇ.జి-119): కాబూలీ రకం. లావు గింజ. 90-100 రోజులు. దిగుబడి 1-2 నీటి తడులతో 10 క్వి/ఎ. వర్షాధారంగా 6-8 క్వి/ఎ.
పెసర: వరి తర్వాత వేసే పెసర పంటను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: టి.ఎం-96-2: గింజ లావుగా మెరుస్తూ ఉంటుంది. అధిక తేమను బూడిద తెగులును తట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అనుకూలం. డబ్లు.జి.జి.-37(ఏకశిల): తెలంగాణకు అనుకూలం. గింజలు పచ్చగా మెరుస్తుంటాయి. ఎల్లోమొజాయిక్ తెగులును తట్టుకుంటాయి. దిగుబడి 5-6 క్వి/ఎ. ఎల్.జి.జి-407: ఆంధ్రప్రదేశ్కు అనుకూలం. మెరుపుగింజ. మధ్యస్థలావుగింజ. పల్లాకు, నల్లమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది. బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి: 5- క్వి/ఎ. పెసర మద్దతు ధర: రూ. 8558/క్వి.
మినుము: వరి తర్వాత పంట పెట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ నెలలో మినుము విత్తవచ్చు. అనుకూలమైన పల్లాకు తెగులును తట్టుకునే మధ్యస్థ లావు గింజ గల పాలిష్ రకాలు: టి.బి.జి-104: దిగుబడి: 8-9 క్వి/ఎ. 70-75 రోజులు. జి.బి.జి-1: దిగుబడి: 8-9 క్వి/ఎ. 70-75 రోజులు. మినుము మద్ధతు ధర రూ. 6950/క్వి. మార్కెట్ ధర మద్ధతు ధర కంటే ఎక్కువగా ఉంది.
వరి: సన్నబియ్యానికి భారతదేశంలోను, ప్రపంచమంతా మస్తు గిరాకీ ఉంది. ఎంత పండించినా మంచి రేటుకు అమ్ముకునేందుకు అవకాశమున్నా ఉపయోగించుకోవడం లేదు. ఉదాహరణకు అమెరికాలో సన్నబియ్యం రెండు రెట్లు ఎక్కువ ధర పెట్టినా సూపర్ మార్కెట్లలో సరిగా దొరకడం లేదు. కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు బియ్యాన్ని పంచుదామంటే వారికి బియ్యం లభ్యం కాలేదు. తెలంగాణలో బియ్యం నిల్వలు మూలుగుతున్నాయి. దీనికదనంగా ఖరీఫ్ పంట చేతికొస్తున్నది. దాన్ని ప్రొక్యూర్ చేసి నిల్వ చేయడానికి స్థలం దొరకడం కష్టయ్యే పరిస్థితులు. ఈ విరుద్ధ పరిస్థితులన్నీ సులభంగా అధిగమించవచ్చు. రైతులు ఇంకొంత ఎక్కువ ఆదాయం పొందడానికి, ప్రపంచ మరియు భారతదేశ ప్రజలకు మంచి బియ్యం సులభంగా అనుకూలమైన ధరల్లో లభించేందుకు, రాజకీయ నాయకుల ఆలోచనా విధానంలో మార్పులు రావాలి. సన్నబియ్యాన్ని పండించడాన్ని బాగా ప్రోత్సహించాలి. ఎక్కడికయినా పంపించుకునే హక్కు రైతులకు, ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. మన దేశ స్ట్రాటజిక్ అవసరాలకు మించి ఉన్న సరుకునంతా ఎగుమతి చేసుకోవడానికి ఫ్రీగా పర్మిషన్ ఉండాలి. రైతులు, వినియోగదారులు దీనివలన లాభపడతారు. వీలయినంతవరకు కంట్రోల్స్ తీసివేయడం మంచిదని నా అభిప్రాయం. విదేశీ మారక ద్రవ్యం కూడా ఎక్కువగా సంపాదించవచ్చు. ఖరీఫ్ పంట కోతలు నవంబరులో ఎక్కువగా ఉంటాయి. వరి తయారైన వెంటనే కోసి, తుపాన్ల వలన కలిగే నష్టాల నుండి కాపాడాలి. వరి మద్ధతు ధర సాధారణ రకాలకు రూ 2185/క్వి. ఏ గ్రేడ్ రకాలకు రూ. 2203/క్వి. వర్షాభావ పరిస్థితుల వలన రిజర్వాయర్లలో నీరులేనిచోట, రబీలో వరి పంట వేయలేకపోతే ఆరుతడి పంటలు కూరగాయలు, పూలు, పశుగ్రాసాలు పండించాలి. చలికాలం/యాసంగిలో, అత్యధిక దిగుబడికి డిశంబరు రెండవ పక్షం నుండి, జనవరి మొదటి వారంలోపు వరినారు పోయడం అనుకూలం. చలికాలపు పంట కడథలో నీటి లభ్యత కష్టమయ్యే పరిస్థితులుంటేగాని, రబీ పంట తర్వాత అపరాలు, కూరగాయలు పండించాలంటే గాని నవంబరులో నారు పోయవచ్చు. ఈ నారు చలి తీవ్రత వలన మెల్లగా ఎదుగుతుంది. పంటకాలం 10-12 రోజులు ఎక్కువవుతుంది. దిగుబడి కూడా సుమారు 15 శాతం వరకు తగ్గుతుంది. మీ ప్రాంతంలో పండించగల్గిన మంచి ధర వచ్చే సన్నగింజ రకాలను సాగు చేసి మంచి ధరల కోసం ప్రభుత్వాలపై ఆధారపడడం తగ్గించుకోండి.
గోధుమ: రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నవంబరు 15 లోగా విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: రవ్వకు: ఎం.ఏ.సి.ఎస్-2846. 120-130 రోజులు. దిగుబడి: 12 క్వి/ఎ. చపాతీకి: ఎం.ఏ.సి.ఎస్-2496. 110-125 రోజులు. దిగుబడి: 15 క్వి/ఎ. బ్రెడ్ తయారీకి: డి.డబ్ల్యు.ఆర్-162. 126-134 రోజులు. దిగుబడి: 15 క్వి./ఎ.
రాగి: ఆంధ్రప్రదేశ్లో రబీ పంటగా నవంబరు-డిశంబరు నెలల్లో విత్తవచ్చు. నారు పెంచి కూడా నాటవచ్చు. రాగి మద్ధతు ధర: రూ. 3846/క్వి. అన్ని కాలాలలోను (ఖరీఫ్, రబీ, వేసవి) పండించడానికి అనుకూలంగా ఉండి, అగ్గితెగులును తట్టుకుని, అధిక దిగుబడినిచ్చే రకాలు: ఇంద్రావతి: 14-15 క్వి/ఎ. పాముపొడ తెగులును కూడా తట్టుకుంటుంది. కాల్షియం, ఐరన్, జింక్ ఎక్కువ. 115-120 రోజుల పంట. సువర్ణముఖి: 14-15 క్వి/ఎ. 105-110 రోజులు. పంట చివరి థలో వచ్చు బెట్టను తట్టుకుంటుంది. వరి మాగాణుల్లోనూ సాగుకు అనుకూలం. తిరుమల: 14-15 క్వి/ఎ. 115-120 రోజులు. గింజ నాణ్యత ఎక్కువ. చొప్ప దిగుబడి కూడా ఎక్కువ.
ప్రత్తి: నవంబరులో మార్కెట్కు ఎక్కువగా వస్తుంది. ప్రత్తి మద్దతు ధర మీడియమ్ స్టేపుల్ రూ. 6620/క్వి. లాంగ్ స్టేపుల్ రూ. 7020/క్వి. పంట ఖర్చులు పెరుగుతున్నందున ఈ ధరతో రైతులు సంతృప్తి చెందడం లేదు. మార్కెట్ ధరలు కూడా 7000-8000 మధ్యనే ఉన్నాయి. ఇప్పటికే రైతులు ప్రత్తి పండించడం తగ్గించారు. ధరలు బాగుంటేనే వచ్చే సీజన్లో ప్రత్తిని ఎక్కువగా సాగు చేస్తారు. లేకుంటే విస్తీర్ణాన్ని తగ్గించే అవకాశముంది. దిగుబడి తగ్గవచ్చు. దిగుమతి చేసుకున్న ప్రత్తి ట్రాన్స్పోర్టు ఖర్చులు కలుపుకుంటే, మన రైతులకిచ్చే దానికంటే ధర బాగా ఎక్కువవుతుంది. అందువలన మద్ధతు ధర పెంచి మన రైతులకు మేలు చేసి దేశ అవసరాలకు కావలసినంత ప్రత్తి ఇక్కడే పండించుకునేటట్లు చేయాలి. పంట ఎక్కువగా పండితే ఎగుమతి చేయాలి.
కంది: నవంబర్ నెలలో ఈ పంటపై ముఖ్యంగా మారుకా మచ్చల పురుగు, కాయతొలుచు పురుగు, కాయఈగ ఆశించే అవకాశముంది. తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కంది మద్ధతు ధర: రూ. 7000/క్వి.
బఠాణి: ఈ పంటను నవంబరు 15 వరకు విత్తి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణ రకాల కంటే దాదాపు రెట్టింపు గింజ దిగుబడినిచ్చే రకం: పంత్ అనుపమ (ఐ.పి-3), కాయకు 7 గింజలు. పచ్చికాయ దిగుబడి: 100క్వి/ఎ.
కీరదోస: కీరదోసను సాలాడ్గా వాడడం ఎక్కువయినందున చలికాలంలో కూడా ధర తగ్గడం లేదు. పాలీహౌస్లలో ఈ పంట సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు.
పూలు: కార్తీక సోమవారాలలోను, కార్తీక పౌర్ణమిరోజు నోములు, పూజలున్నందున పూలకు మంచి గిరాకీ ఉంటుంది. దీపావళికి కూడా పూల వినియోగమెక్కువ. పూజలెక్కువగా ఉండే రోజులకు 2-3 రోజుల ముందునుండే పూలను కొని ప్రిజ్లలో పెట్టుకునే అలవాటుంటుంది. దీనిని గమనించి పూలను తెంపడం, మార్కెట్కు తరలించడం పండుగకు 2-3 రోజుల నుండి పండుగ రోజులోపల పూర్తి చేయాలి. ధరలు అప్పుడే ఎక్కువగా ఉంటాయి.
పశుగ్రాస పంటలు: ఈ నెలలో విత్తదగిన పశుగ్రాస పంటలు: మొక్కజొన్న, జొన్న, జనుము, లూసర్న్, ఓట్స్్, అలసంద, పిల్లిపెసర.
గెనుసుగడ్డ/చిలగడదుంప: నవంబరులో తీగలను నాటవచ్చు.
పూలు: పాలీహౌస్లలో కార్నేషన్, గులాబీ సాగు ఈనెలలో చేపట్టవచ్చు. గులాబీ, మల్లె, జెర్బెరా, చామంతి పూల మొక్కలను ఈ నెలలో నాటవచ్చు.
మిరప: రబీ పంటగా అక్టోబరు, నవంబరు నెలల్లో నారుపోసి, 6 వారాల నారును నాటవచ్చు. మంచి రకాలు: ఎల్.సి.ఏ-625, ఎల్.సి.ఏ-620, ఎల్.సి.ఏ-436, ఎల్.సి.ఏ-424, కాశీఅభ.
విలువలు – రైతు ప్రజా సంఘాలు: ప్రజాజీవితంలో విలువలను పెంచి ప్రజల అభివృద్ధి రాజకీయాలకతీతంగా జరిపేందుకు సహాయపడగల రైతు ప్రజా సంఘాల ఏర్పాటుకు సహకరిద్దాం. నీతి, న్యాయం, ధర్మం, నిలబెట్టాలంటే అభివృద్ధిలో అందరూ కులమతాలకతీతంగా ఉత్సాహంగా పాల్గొనేందుకు రైతు ప్రజాసంఘాలను అన్ని ఆవాస ప్రాంతాల్లో ప్రోత్సహిద్దాం.