రాజస్థాన్‌ పశుసంసవర్ధక శాఖతోపాటు గోధామం నిర్వాహకులు స్వామి రాజేంద్రదాస్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని డీగ్‌ జిల్లాలో గల శ్రీ జడ్‌ఖోర్‌ గోధామంలో బుధవారం గోపాష్టమి పూజలు మొదలయ్యాయి. సూర్యోదయంతో గంటల మోతలు, శంఖ నాదాలు, ఆవుల అరుపులతో ఆ ప్రాంగణం మార్మోగింది. అందంగా అలంకరించిన గోశాల వద్ద భక్తులు హారతి పళ్లేలతో ‘జై గోమాత’, ‘జై గోపాల్‌’ అంటూ నినదించారు. గోధామంలోని 10 వేల ఆవులకు ఏక కాలంలో పూజలు జరిగాయి. ఇందులో 9 వేల గోవులు స్మగ్లర్ల నుంచి రక్షించి గోధామంలో ఆశ్రయం కల్పించినవి కావడం విశేషం. పవిత్ర గోమాత ‘సురభి’ దర్శనంతో మొదలైన వేడుకల్లో భక్తులు వేలాది ఆవుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గోరక్షా సంకల్పం పేరుతో అందరూ ప్రమాణం చేశారు.