34.60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము

ప్రస్తుత ఖరీఫ్‌లో 34.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది గతేడాది కంటే ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నులు అదనం అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 5.59 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.8,206 కోట్లు చెల్లించాం. రైతులు నష్టపోకుండా మద్దతుధర అందించాం. ఎన్టీఆర్‌ భరోసా కింద రూ.50 వేల కోట్లు పింఛన్ల కింద ప్రజలకు అందజేశాం. ప్రస్తుతం పెద్దఎత్తున రోడ్లు నిర్మిస్తున్నాం. ఇందుకోసం తాజాగా రూ.2,500 కోట్లు కేటాయించాం. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పల్లె పండగ కార్యక్రమాన్ని చేపట్టి, పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. డేటా లేక్‌ ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నాం. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది’ అని మనోహర్‌ వివరించారు.

Read More

సాగు పరికరాలు అద్దెకు

రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గేలా సాగుకు అవసరమైన పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. డ్వాక్రా మహిళా రైతులతో (వారి కుటుంబ సభ్యులు)కూడిన ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 520 ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీవో) ఉండగా వాటి పరిధిలో తొలి విడతగా 300 సీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధకశాఖల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

60 కోట్లు కేటాయింపు
జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద సీహెచ్‌సీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 60 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. సీహెచ్‌సీల ఏర్పాటుకు ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.20 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.

రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలే అందుబాటులో ఉంచుతారు
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎఫ్‌పీవో పరిధిలో 1500 నుంచి 2 వేల మంది సన్నచిన్నకారు రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇవి మండలానికి ఒకటి చొప్పున ఉన్నాయి. రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలను కొని సీహెచ్‌సీల్లో ఉంచుతారు. రైతులకు ఈ పరికరాలను బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు అద్దెకిస్తారు. సీహెచ్‌సీల నిర్వహణను ఎఫ్‌పీవోనే చూస్తుంది. వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాటి నిర్వహణకే వెచ్చిస్తారు.

Read More