రెండు ఉల్లిగడ్డలు, ఒక ఎల్లిపాయ (వెల్లుల్లి). కొంచెం జీలకర్ర, ఎండుకారంతో చేస్తే, ఇది ఉల్లిగడ్డ కారం అయితది.
ముందుగా ఉల్లిగడ్డలను పొట్టు తీసి ముక్కలుగా కోసి, అందులో పొట్టు తీసిన ఎల్లిపాయలను వేసి, తగినంత కారం, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. ఎండు కారానికి బదులుగా, పచ్చిమిర్చి కూడా వాడవచ్చు. అవసరమైన వారు పోపు పెట్టుకోవచ్చు. పోపు లేకపోయినా రుచికరంగానే ఉంటుంది. ఒంట్లో నలతగా ఉన్నప్పుడు, ఏది తినాలని అనిపియ్యనప్పుడు, ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటది. ఇంట్లో కూరగాయ లేనప్పుడు, రెండు నిమిషాల్లో అయిపోతుంది. పచ్చి నూనె కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఈ కారాన్ని పేలాలలో, సలాడ్లలో, అన్నంలో, రొట్టెల్లో, దేంట్లో అయినా కలిపి తినొచ్చు. అన్నిటిలోకి కలిసిపోతుంది.
రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
సహజ జీవ నియంత్రణ కారకాలుగా, జీవ ఎరువులుగా వీటిని ఉపయోగిస్తారు. వీటిని నేల ద్వారా వ్యాపించే శిలీంధ్ర వ్యాధికారకాలను అణచివేయటానికి, వేర్ల పెరుగుదలను మెరుగుపరచటానికి, పంట దిగుబడులను పెంచడానికి, నేలలోని పోషకాలను కరిగించడానికి ఉపయోగిస్తారు.
తయారీకి కావలసిన పదార్థాలు : ట్రైకోడెర్మావిరిడె మదర్ కల్చర్, సూడోమోనాస్ మదర్కల్చర్, బెల్లం – 20 గ్రా.; ఈస్టు – 5 గ్రా.; ప్రెజర్కుక్కర్ – 10 లేదా 15 లీటర్లది; స్టీలు డబ్బాలు మూతగలవి; స్పిరిట్ లేదా డెటాల్, గ్యాస్ స్టవ్, ప్లాస్టిక్ బాటిల్స్ – 1 లేదా 2 లీటర్లవి.
తయారీ విధానం : ప్రెజర్కుక్కర్లో శుభ్రపరచిన స్టీలు డబ్బాని పెట్టి డబ్బా చుట్టూ అంగుళం మేర ఖాళీ ఉండునట్లు చూడాలి. ఈ స్టీలు డబ్బాలు 4 లేదా 8 లేదా 12 లీటర్ల పరిమాణంలో ఉండాలి. ఎంపిక చేసుకున్న కుక్కర్ పరిమాణాన్ని బట్టి డబ్బాల ఎంపిక ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టీలు డబ్బాలో సూచించిన పరిమాణంలో నీరు, బెల్లం, ఈస్టు తీసుకోవాలి. నాలుగు లీటర్ల నీరు తీసుకున్నట్లయితే 80 గ్రా. బెల్లం, 20 గ్రా. ఈస్టు కలపాలి. డబ్బా మూతని బిగుతుగా బిగించి పెట్టాలి. కుక్కర్లో కూడా నీరు పోసి, మూత పెట్టి పైన విజిల్ పెట్టి స్టవ్ మీద వేడి చేయాలి. మొదటి విజిల్ సుమారు గంట తర్వాత వస్తుంది. తొలి విజల్ వచ్చిన మరో 40 నిమిషాలపాటు వేడి చేయాలి. బెల్లం నీరు మరిగి సూక్ష్మజీవుల రహితంగా మారుతుంది. స్టవ్ ఆపివేసి కుక్కర్ని దించి గది వాతావరణంలో చల్లబడిన తర్వాత స్టీల్ డబ్బాలోని బెల్లం ద్రావణాన్ని సీసాల్లో మూడవ వంతు వరకు నింపి దూదితో చేసిన ప్లగ్లు (బిరడాలు) పెట్టాలి. మార్కర్తో సూడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడె వంటి లేబిల్స్ని సిద్ధం చేసుకోవాలి. సీసాలకు లేబిల్స్ అతికించిన తర్వాత ఆయా సీసాల్లో ఆయా శిలీంద్రం, బాక్టీరియా మదర్ కల్చర్ని ఒక చెంచా చొప్పున కలిపి బిరడా పెట్టుకోవాలి. ఒక వారం రోజుల వరకు ప్రతి రోజు సీసాలను ఊపుకోవాలి.
వాటి మదర్ కల్చర్లను వ్యవసాయ పరిశోధనా స్థానాల నుండి పొందవచ్చు. ఒకసారి మదర్ కల్చర్ని సేకరించుకుంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత 6 నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయి.
పెరుగుతున్న జనాభా, నేల క్షీణత, అస్థిర వాతావరణం ఈ మూడు ఒత్తిళ్లు నేటి ప్రపంచ వ్యవసాయాన్ని చుట్టుముట్టాయి. లోతైన నాగలి దుక్కి మీద ఆధారపడిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నేల కోతకు, పోషకాల నష్టానికి కారణమవుతున్నాయని దశాబ్దాలుగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో, 1970లలో అమెరికాలో మొదలై బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా వంటి దేశాలకు విస్తరించిన పరిరక్షణ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. 1970లో కేవలం 10 లక్షల హెక్టార్లలో ఉన్న పరిరక్షణ వ్యవసాయం విస్తీర్ణం, 2019 నాటికి 102 దేశాల్లో సుమారు 20.5 కోట్ల హెక్టార్లకు (ప్రపంచ సాగుభూమిలో దాదాపు 15%) పెరిగింది.
పరిరక్షణ వ్యవసాయం అనేది ఒకే ఒక్క పద్ధతి కాదు ఇది మూడు అంశాల సమీకృత వ్యవస్థ: (1) కనీస యాంత్రిక నేల కదలిక, (2) పంట అవశేషాలు లేదా కవర్ పంటల ద్వారా నేలపై శాశ్వత సేంద్రియ కవచం, (3) పంట మార్పిడి లేదా అంతర పంటల ద్వారా జీవవైవిధ్యం.
తక్కువ కదలిక నేల కణాల నిర్మాణాన్ని కాపాడితే, ఉపరితల అవశేషాలు వర్షపు దెబ్బ నుండి, తేమ నష్టం నుండి ఆ నిర్మాణాన్ని కాపాడతాయి. పంట మార్పిడి జీవ కార్యకలాపాలను పునరుద్ధరించి, చీడపీడల చక్రాలను విచ్ఛిన్నం చేస్తుంది.
నేల ఆరోగ్యంపై ప్రభావం
పరిరక్షణ వ్యవసాయం వల్ల కలిగే జీవశాస్త్రపరమైన మార్పులు అత్యంత స్థిరంగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ ప్రకారం, అవశేషాల నిలుపుదలతో కూడిన సున్నా-దుక్కి పద్ధతి పై 20 సెం.మీ నేలలో సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశిని 37% పెంచుతుంది (శిలీంధ్రాలలో 31%, బ్యాక్టీరియాలో 11% పెరుగుదల). ఇండో-గంగా మైదానాల్లో ఆరేళ్ల అధ్యయనంలో సున్నా-దుక్కి పద్ధతి ఎగువ 15 సెం.మీ నేలలో హెక్టారుకు సుమారు 2 టన్నుల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేసినట్లు తేలింది. అయితే ఈ కర్బన నిల్వ లోతును బట్టి మారుతుంది 60 సెం.మీ లోతు వరకు కొలిచినప్పుడు సాంప్రదాయ, సున్నా-దుక్కి పద్ధతుల మధ్య తేడా గణనీయంగా తగ్గిపోతుందని మరో అధ్యయనం హెచ్చరిస్తోంది. మృత్తిక స్థూల సాంద్రత విషయంలో మాత్రం సాహిత్యంలో నిజమైన భిన్నాభిప్రాయం ఉంది కొన్ని అధ్యయనాలు స్వల్ప పెరుగుదలను, మరికొన్ని తగ్గుదలను నివేదిస్తున్నాయి.
చిత్రం 1: పరిరక్షణ వ్యవసాయపు మూడు మూలస్తంభాలు పరస్పరం బలపరుచుకునే ఒక సమీకృత వ్యవస్థ.
దిగుబడి, ఆర్థిక అంశాలు మెటా-విశ్లేషణ ప్రకారం, సున్నా-దుక్కి పద్ధతి సగటున 5.1% దిగుబడి తగ్గుదలకు దారితీస్తుంది. కానీ ఇది పంట, వాతావరణం మేరకు చాలా తేడాగా ఉంటుంది నూనెగింజలు, పత్తి, పప్పుధాన్యాలలో తగ్గుదల లేదు; మొక్కజొన్న, వరిలో ఎక్కువ తగ్గుదల (సుమారు 7.5%) కనిపించింది. పొడి వాతావరణాలలో వర్షాధార పంటలకు సున్నా-దుక్కి పద్ధతి సాంప్రదాయ పద్ధతితో సమానంగా లేదా మెరుగ్గా పనిచేస్తుంది. మలావిలో జరిగిన క్షేత్ర అధ్యయనాల్లో పరిరక్షణ వ్యవసాయ ఆధారిత మొక్కజొన్న పంట దిగుబడిని 22 – 31%, రైతు ఆదాయాన్ని 50 – 83% పెంచడంతో పాటు హెక్టారుకు 28–39 పని దినాల శ్రమను తగ్గించాయి. పంట మార్పిడి, సరైన పొషకాల యాజమాన్యం లేకుండా పరిరక్షణ వ్యవసాయం పూర్తి ప్రయోజనాలు అందించదని గమనించాలి.
వాతావరణ స్థితిస్థాపకత, కర్బన నిల్వ ఉత్తర చైనా మైదానంలో జరిగిన ఎనిమిదేళ్ల వేడెక్కింపు ప్రయోగంలో, పరిరక్షణ వ్యవసాయం పద్ధతిలో నేల చల్లగా, తేమగా ఉండి, శీతాకాల గోధుమ దిగుబడి వేడెక్కింపు వల్ల 9.3% పెరిగింది. ఈ ప్రయోజనం సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత బలపడటం గమనార్హం ఇది స్థిరమైన, కాలానుగుణంగా పెరిగే ప్రయోజనమని సూచిస్తుంది. అదేవిధంగా, నో-టిల్ మరియు తగ్గిన దుక్కి పద్ధతులు నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలను సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే సుమారు 11% తగ్గిస్తాయని ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ తెలిపింది, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కలుపు యాజమాన్యం, ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికత నేల కదలిక తగ్గించడం వల్ల దుక్కి ఆధారిత కలుపు నియంత్రణ తొలగిపోతుంది కాబట్టి, విత్తడం, ఎరువులు, కలుపు/చీడ నియంత్రణ వంటి పనులను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడే జిపిఎస్-ఆధారిత యంత్రాలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్లు , జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, వేరియబుల్-రేట్ టెక్నాలజీ వంటి ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. అవశేషాల కవచం వల్ల నేలపై కలుపు మొక్కలను గుర్తించడం కష్టతరం కావడంతో, డ్రోన్ చిత్రాల ఆధారంగా కృతిమ మేధస్సు (ఏ ఐ/ఎం ఎల్/డి ఎల్) సాయంతో కలుపు మ్యాపింగ్, స్థల-ఆధారిత హెర్బిసైడ్ ప్రయోగం వంటి పద్ధతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే యంత్రాలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం చిన్న, సన్నకారు రైతులకు ఈ సాంకేతికతలను చేరువ చేయడంలో పెద్ద అడ్డంకిగా మిగిలిపోయింది.
చిత్రం 2: ఖచ్చితమైన వ్యవసాయం మరియు కలుపు యాజమాన్యం. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ మరియు కృతిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కలుపు మొక్కలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం మరియు లక్షిత ప్రాంతాల్లో మాత్రమే నియంత్రణ చర్యలను చేపట్టే విధానాన్ని ఈ వైజ్ఞానిక చిత్రపటం వివరిస్తుంది. ఇది చిన్న రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి మరియు సాంకేతిక సవాళ్లను కూడా సూచిస్తుంది
సవాళ్లు, స్వీకరణలో అడ్డంకులు పంట అవశేషాలను పశువుల మేతకు వాడాల్సిన అవసరం, యంత్రాలు-రుణాల లభ్యత, లింగ ఆధారిత అసమానతలు, విస్తరణ సేవల కొరత ఇవన్నీ ముఖ్యంగా చిన్నకారు, వర్షాధార రైతాంగంలో పరిరక్షణ వ్యవసాయం స్వీకరణను నెమ్మదిస్తున్నాయి. అదేవిధంగా, నేల కర్బన కొలత లోతు, నత్రజని ఆక్సైడ్ కొలత విధానాలలో ప్రామాణికత లేకపోవడం వంటి పద్దతిపరమైన అసమానతలు ఈ రంగంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన పరిశోధన అంతరాలుగా మిగిలాయి.
ముగింపు పరిరక్షణ వ్యవసాయం నేల సూక్ష్మజీవుల ఆరోగ్యం, ఇంధన-శ్రమ ఆదా, నిర్దిష్ట పరిస్థితులలో దిగుబడి స్థిరత్వం వంటి నిజమైన ప్రయోజనాలను అందిస్తుందని ఈ సమీక్ష స్పష్టం చేస్తుంది. అయితే బల్క్ డెన్సిటీ, పరాగసంపర్క కీటకాలపై ప్రభావం వంటి అంశాల్లో సాహిత్యంలో ఇప్పటికీ నిజమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తులో పరిరక్షణ వ్యవసాయం ను కేవలం ఒక స్థిర ప్యాకేజీగా కాకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమర్చుకోగల సమీకృత వ్యవస్థగా, ఖచ్చితమైన సాంకేతికతతో మేళవించి అభివృద్ధి చేయడం ద్వారానే స్థిరమైన వ్యవసాయ లక్ష్యాలను చేరుకోవచ్చు.
ఇతర వివరముల కొరకు , ఈమెయిల్ మరియు ఫోన్: jcharleswesley@gmail.com, +91 8331816872, చార్లెస్ వెస్లీ జె., పిహెచ్.డి స్కాలర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. తిరుమలైకుమార్ ఆర్., అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. సరవణన్ ఎస్., ప్రొఫెసర్, వి.ఐ.టి, వెల్లూరు.
చార్లెస్ వెస్లీ జె¹, తిరుమలైకుమార్ ఆర్², సరవణన్ ఎస్³* ¹, ²&³ వి ఐ టి స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రోనమీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లూరు, తమిళనాడు, భారతదేశం.
సాధారణ నామం : కస్టర్డ్ యాపిల్ శాస్త్రీయ నామం : అనోనా స్క్వామోసా కుటుంబం: అనోనేసి
సీతాఫలం పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మెట్ట భూముల్లో సాగు చేయవచ్చు. సీతాఫలం పండ్లు కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, రాగి, పీచుపదార్థం, తక్కువ కొవ్వు కలిగి ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను సమకూరుస్తాయి. సీతాఫలం ఆకులు, గింజలు మరియు ఇతర భాగాల్లో ‘అనోనైన’ అనే పదార్థం ఉండటం వలన చేదు గుణం కలిగి ఉంటుంది. అందుకే సీతాఫలం ఆకులను పశువులు, మేకలు తినవు. ఆకులు, గింజల నుండి తీసిన రసంలో కీటకనాశిని లక్షణాలున్నాయి.
సీతాఫలం ఆకు కషాయం : 500 గ్రా. సీతాఫలం ఆకులను 2 లీ. నీటిలో ఉడికించాలి. ఒక లీటరు ద్రావణం మిగిలే వరకు ఉడికించాలి. ఈ ద్రావణాన్ని వడపోసి 10 15 లీ. నీటిలో కలిపి పురుగులు సోకిన మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేసి పేనుబంక, సుడిదోమ, గొంగళిపురుగులు, డైమండ్ బ్యాక్ మాత్, పచ్చదోమ, పచ్ౘ్నల్లి పురుగులను నివారించవచ్చు.
వివిధ ఆకుల కషాయం : వేపాకు1 కి., కానుగ 1 కి., బిల్వం 1కి., విషముష్టి 1/2 కి., వావిలాకు 1 కి., తంగేడు 1 కి., సీతాఫలం 1/2 కి., పిచ్చి తులసి 1 కి., పుదీనా 1/2 కి., పాలకొడిస 1/2కి., కొత్తిమీర 1/2కి., నేరేడు 1 కి., నేలవేము 1/2 కి., యూకలిప్టస్ 1 కి., అత్తాకోడలు ఆకు 1 కి., ఈ ఆకులలో ఏవైనా 5 రకాల ఆకులను పైన చెప్పిన మోతాదులో తీసుకుని 10 లీ. నీటిలో అరగంట సేపు బాగా ఉడికించి, ఉడుకుతున్న ఈ ద్రావణాన్ని కర్రతో మధ్య మధ్య కలుపుతూ, కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. కషాయానికి 100 గ్రా. సబ్బుపొడి లేదా 500 గ్రా. కుంకుడు రసం కలిపి, ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి సాయంత్రం వేళ పంటపై పిచికారి చేయాలి.
ఈ కషాయం అనేక పంటలనాశించే రసం పీల్చే పురుగులు, పెద్ద దశలోనున్న లద్దె పురుగులు, శనగపచ్చ పురుగులు, ఆకులనుతినే గొంగళిపురుగులపై బాగా పనిచేస్తుంది.
దశపర్ణి కషాయం : వేప ఆకులు 5కి., నల్లేరు ఆకులు 2కి., అరిస్టాలోకియా ఆకులు 2కి., బొప్పాయి ఆకులు 2కి., సీతాఫలం ఆకులు 2 కి., కానుగ ఆకులు 2 కి., ఆముదం ఆకులు 2 కి., గన్నేరు ఆకులు 2 కి., జిల్లేడు ఆకులు 2 కి., టైనోస్పోరా కార్డిఫోలియా ఆకులు 2 కి., పచ్చి మిరప కాయల పేస్టు 2 కి., వెల్లుల్లి పేస్టు 2కి., ఆవుపేడ 3 కి., ఆవు మూత్రం 5 లీ.
వీటినన్నింటినీ నూరి 200 లీ. నీటిలో కలిపి ఒక నెల రోజులు పులియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి మూడుసార్లు కలియతిప్పాలి. నెల రోజుల తర్వాత వడపోయాలి. ఈ కషాయాన్ని 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. ఈ కషాయాన్ని ఒక ఎకరం పొలంలో ఫాగింగ్ మెషిన్తో చల్లి తామర పురుగులు, ఆకుముడత పురుగు, లీఫ్ హాపర్స్ని నివారించవచ్చు.
సీతాఫలం విత్తన నూనె కషాయం : పచ్చి కాయల నుండి గింజలను తీసి గ్రైండర్లో వేసి నూనె తీయాలి. ఒక భాగం నూనెని 20 భాగాల నీటిలో కలిపి డైమండ్ బ్యాక్మాత్ ఆశించిన పంటపై పిచికారి చేయాలి.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
ఈ వ్యాధిని మూతివాపు, మూతిపుండ్లు, పూతరోగం మొదలగు పేర్లతో వివిధ ప్రాంతాలలో వ్యవహరిస్తారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న గొర్రెలలో నాలుక నీలిరంగుకు మారుతుంది. కావున ఈ వ్యాధిని నీలిరంగు వ్యాధి అని వ్యవహరిస్తారు.
వ్యాధి ఎలా వస్తుంది? ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. దోమకాటు వలన ఈ క్రిములు గొర్రె శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. వర్షాకాలంలో వ్యాధి క్రిముల అభివృద్ధికి మరియు అవి విస్తరింపచేసే దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది.
వ్యాధి లక్షణాలు:
వ్యాధి సోకిన గొర్రెలలో జ్వరం ఎక్కువగా ఉంటుంది.
క్రమేణా జ్వరం ఉన్న గొర్రెలకు చొంగ కారుతూ, పెదవులు మరియు చిగుళ్ళు వాచి, పెదవుల లోపలి భాగం ఎర్రబడి, చిన్న చిన్న గుల్లలు ఏర్పడతాయి.
వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెలలో ఈ వ్యాధి కాళ్ళకు కూడా పాకుతుంది. గిట్టల మొదటి భాగం వాచి, గిట్టల మధ్య ఎర్రగా ఉంటుంది. కావున గొర్రెలు సరిగా నడవలేక మేత సమయంలో వెనుకపడతాయి.
వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుకు మారుతుంది. మరియు మెడ వంకర పోతుంది.
వ్యాధి తీవ్రతను బట్టి 5Ð6 రోజులు మేత మేయక, నీరు త్రాగకపోవుట వలన గొర్రెలు నీరసించి చివరికి చనిపోతాయి.
వ్యాధిని ఎలా నివారించాలి?
వ్యాధి నివారణ టీకాల ఉత్పత్తికి ప్రస్తుతము పరిశోధనలు చివరి దశలో ఉన్నాయి.
వర్షాకాలంలో కొట్టం, పరిసర ప్రాంతాలలో ఈగలు, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
రోజుకు రెండు పర్యాయాలు వేపాకుతో పొగ వేసిన యెడల దోమలను నివారించవచ్చు.
చికిత్స:
వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యుని సంప్రదించి, యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడడం ద్వారా వ్యాధిగ్రస్తమైన గొర్రెలు చనిపోకుండా కాపాడుకోవచ్చు.
నోటిలోని పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేటు ద్రావణంలో కడిగి జింక్ పౌడర్ నీటితో రుద్దాలి. గిట్టల మధ్య ఉన్న పుండ్లను కడిగి హిమాక్స్, నీమ్లెంట్ వంటి ఆయింట్మెంటులు పూయాలి.
మామిడి పిందెలను కొన్నిటిని, నీళ్లలో వేసి కొద్దిగా నాననిచ్చి, పిందెల మీద గట్టిపడి ఉన్న సొనను కడగాలి. కడిగిన మామిడి పిందెలను శుభ్రంగా గుడ్డతో తుడవాలి.
ఏ మాత్రం తేమ లేకుండా, నీడకు ఆరబెట్టాలి. నీటి తేమ ఉంటే, పచ్చడి నిల్వ ఉండదు, బూజు పడుతుంది.
ఉప్పు తగినంత లేకపోయినా, నిల్వ పచ్చడి బూజు పడుతుంది.
పిందెలను కత్తితో నాలుగు ముక్కలు కోసుకోవాలి. ముక్కల్లో ఉన్న జీడిని తీసెయ్యాలి. అప్పటికి ఇంకా పిందెల్లో పిక్క గట్టి పడదు. పిక్క పొయ్యని పిందెలను, మామిడి రోటి పచ్చడి చేసుకోవచ్చు. లేదా ముదిరితే, కండను కోసుకుని, పిక్కను జీడిని తీసేసి, పచ్చడి చేసుకోవచ్చు.
మనకు లభించిన మామిడి పిందెలను బట్టి చేసుకోవాలి. మార్కెట్లో కూడా దొరుకుతాయి.
ఒక రకం మామిడి మొక్కలు, సంవత్సరం పొడవునా పూత పిందె వచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని మిద్దెతోట, పెరటితోట సేద్యంలో చక్కగా పెంచుకోవచ్చు. (మామిడి జీడిని కూడా ఎండబెట్టి పొడి చేసుకొని వాడుతారు అని, నేలకొండపల్లి ప్రకృతి వైద్యుడు ఒకరు చెప్పారు)
జీడి తీసిన మామిడి పిందె ముక్కలకు తగినంత ఉప్పు, కారం, ఆవపొడి, కొద్దిగా మెంతిపొడిని కలపాలి.
తగినన్ని వెల్లుల్లి పాయలను, జీలకర్రను కూడా మెత్తగా నూరి ముక్కల్లో కలపాలి. ఇక్కడి వరకు, ఇది మామిడి బద్దల పచ్చడి పద్ధతి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని రోట్లో వేసి మెత్తగా నూరి, కొద్దిగా గానుగ నూనె పోసుకుని, సీసాలోకి ఎత్తుకోవాలి.
బయట వాతావరణంలో కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి బూజు పట్టింది అంటే, ఉప్పు తక్కువ అవడం వలన కానీ, తడి తగలడం వలన కానీ అవుతుంది. జాడి లేదా సీసా నుండి నిల్వ పచ్చడిని స్పూన్తో తీసేటప్పుడు, మన చేతి వ్రేళ్లకు కూడా ఏ మాత్రం తేమ ఉండకూడదు.
వేడివేడి అన్నం మీద, మామిడి పిందెల రోటి పచ్చడి వేసుకొని, కాస్తా గానుగ నూనె లేదా నెయ్యి వేసి తింటే, ఆవ ఘాటుతో ఎంతో రుచికరంగా ఉంటుంది.
ఇందులోని దినుసుల్లో ఎవరి అభిరుచి ప్రకారం వారు, స్వల్ప మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉప్పు మాత్రం తగినంత ఉండాలి. వంటలకు కొత్తవారు కూడా ట్రై చెయ్యవచ్చు. మొదట ఉప్పు తక్కువగా వేసి, రుబ్బిన తరువాత రుచి చూసుకుని, అవసరం ఉంటే, మరింత కలుపుకోవాలి.
మామిడి పిందెలతో వేపని, ఉడికించని, నిల్వ రోటి ‘పచ్చి పచ్చడి’ తయ్యారు!
మామిడి పిందెలు కుటుంబం అవసరాలకు మించి, చెట్ల నుండి రాలుతున్నప్పుడు, ఇలా నిల్వ పచ్చడి పెట్టి అమ్మవచ్చు.
రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
ఈ మిశ్రమం సూక్ష్మక్రిములకు, వానపాములకు ఆహారంగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు దోహదపడుతుంది.
మోతాదు : ఎకరానికి 50 లీటర్లు
కావలసిన పదార్థాలు : ఆవుపేడ : 25 కిలోలు; నీరు : 50 లీటర్లు; కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలు : 20 కిలోలు.
తయారు చేయు విధానం: ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో నీరు, ఆవుపేడ కలిపి నాలుగు రోజులు మురగబెట్టాలి. కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలను ఒక డ్రమ్ములో వేసి మూతబెడితే 4 రోజులలో కుళ్ళిపోతాయి. వీటిని అదే రోజున మెత్తగా పిసికి, ఆవుపేడ, నీళ్ళు కలిపిన డ్రమ్ములో వేసి కలియ పెట్టాలి. ఆపైన మూత వదులుగా పెట్టి, మరుసటి రోజున ఈ మిశ్రమాన్ని కర్రతో కలిపి డ్రమ్ముపై మూతపెట్టాలి. 10 రోజులలో మిశ్రమం తయారవుతుంది. 11వ రోజున ఈ మిశ్రమాన్ని వడబోసి, సుమారు 50 లీటర్లు ఒక ఎకరం పొలంలో నీటిద్వారా గాని, లేదా కళ్ళాపిలా గాని నేలపై చల్లాలి.
అడవి సీతాఫలం అనోనేసి కుటుంబంలోని ఒక పూల మొక్క. ఈ మొక్కని సెనెగల్ నుండి సేకరించారు. ఇది ఒక పొద లేదా చిన్న చెట్టు. ఈ మొక్క 2 నుండి 6 మీ. ఎత్తు పెరుగుతుంది. బెరడు నున్నగా లేదా గరుకుగా గ్రే సిల్వర్ లేదా గ్రే బ్రౌన్ రంగులో ఉంటుంది. కొత్త కొమ్మలు మందమైన గ్రే, గోధుమ రంగు లేదా పసుపు రంగుతొడుగు కలిగి ఉంటుంది. తర్వాత వయసుతో పాటు ఊడిపోతుంది. ఆకులు ఆకుపచ్చ లేదా నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుపై వైపున నూగు ఉండదు. అడుగువైపున నూగు ఉంటుంది. పూవ్వు 3 సెం.మీ. వ్యాసం కలిగి ఉండి 2 సెం.మీ. కాడపై ఏర్పడతాయి. కాయలు అనేక కలిసిపోయిన మెత్తని, ఉబ్బెత్తు 2.5-5.0 సెం.మీ. అండాకారం లేదా గుండ్రని పుష్పపు గర్భకోశాలు కలిగి ఉంటాయి.
సాధారణ నామం : వన్యసీతాఫలం / ఆఫ్రికన్ సీతాఫలం శాస్త్రీయ నామం : అనోనాసెనెగలెన్సిస్ కుటుంబం: అనోనేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
పండులోని తెల్లని గుజ్జు ఆహ్లాదకరమైన అనాస పండు వాసనలో ఆప్రికాట్ రుచి కలిగి ఉంటుంది.
ఆకులను కొన్నిసార్లు కూరగా వండుకుని తింటారు. పూలను సుగంధద్రవ్యంగా ఉపయోగిస్తారు.
విచ్చుకోని పూల మొగ్గలను సూపులో ఉపయోగించుతారు.
మొక్క బెరడుని డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, పాముకాటు, పళ్ళనొప్పి, శ్వాసకోశ అంటువ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
అనేక మొక్క భాగాలను కలిపి చర్మ వ్యాధులు, క్షయ వల్ల కలిగే సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
అడవి సీతాఫలం గింజలు, బెరడుని పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.
రిపబ్లిక్ ఆఫ్ బెనిన్లో వన్య సీతాఫలం తాజా ఆకులను కోళ్ళగూళ్ళలో పరచి అవి ఎండే వరకు ఉంచుతారు. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేసి ఫ్లీస్, నల్లులను నివారిస్తారు.
వన్యసీతాఫలంలో టానిన్లు, ఫ్లేవనాయిడ్స్, సపానిన్స్, ఆల్కలాయిడ్స్, గ్లెåకోసైడ్లు, స్టీరాయిడ్లు, ఆవిరైపోయే నూనెలు, యాంథోసయనిన్స్ వంటి రసాయనాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్, ప్లాటినం, క్రోమియం వంటి ఖనిజాలతో పాటు ఆస్కార్బిక్ యాసిడ్, అమినో యాసిడ్లు కూడా ఉంటాయి. అందువలన అది ఒక ముఖ్య పోషక మూలం. దీని కాండం బెరడులో ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉంటుంది. కాంగో అనే శాస్త్రవేత్త ఈ మొక్క ఆకులు, కాండం బెరడు, వేరు బెరడు, ఎపికార్ప్, మీసోకార్ప్లో ఎసెన్షియల్ ఆయిల్ని కనుగొన్నారు. దీని భాగాల నుండి వేరు చేసిన రసాయనాలు యాంటి మైక్రోబియల్ లక్షణాలు కూడా కలిగి ఉన్నాయి.
వన్య సీతాఫలం బెరడు, ఆకు పొడి, ద్రావణం మిరియాల పంటనాశించే వేరు బుడిపె నులి పురుగు (మెలాయిడోగైన్ ఇన్కాగ్నిట)ల సంఖ్యను తగ్గించాయి (అగాఒ, ఫావోల్, 2015).
వన్య సీతాఫలం ఎండు ఆకులను ధాన్యం గింజలకు కలిపి నిల్వ సమయంలో ఆశించే పురుగులను నివారించవచ్చు. (థాకర్, 2002).
వన్యసీతాఫలం ద్రావణం కొన్ని జీవ చర్య మిశ్రమాలను కలిగి ఉండి, కీటక నాశక మరియు యాంటీ ఫీడెంట్ చర్యలతో నిల్వ ధాన్యంలో ఆశించే రెడ్ ఫ్లోర్ బీటిల్ (ట్రైబోలియం కాస్టానియం)ని అరికట్టింది (ఒసెని, అతని అనుచరులు, 2013).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
కొద్దిగా ముదిరిన వంకాయలు ఆరు తీసుకుని కడిగి, తడి లేకుండా తుడిచి, చిన్న చిన్నముక్కలుగా కోసుకోవాలి.
ఈ ముక్కలకు కొంచెం పసుపు, తగినంత ఉప్పు కలపండి.
శుభ్రంచేసిన చింతపండు నిమ్మకాయంత తీసుకుని, వంకాయ ముక్కల మధ్యలో పెట్టి మూత పెట్టండి. ఒక పూట అయిన తర్వాత మూత తీసి, చింతపండు విడిగా తీసి, దానికి తగినంత కారం, ఇష్టమయితే వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీలో బరకగా చేసుకోవాలి.
ఇప్పుడు వంకాయలను గట్టిగా పిసికి వచ్చిన రసానికి ఈ గుజ్జు కలిపి, వంకాయ ముక్కలకు బాగా కలిసే లాగ చేయాలి. చిన్నగిన్నెడు గానుగ నూనెను, ఈ మిశ్రమంలో వేసి కలపాలి. నాలుగైదు గంటలు వూరిన తరువాత, కమ్మటి నెయ్యితోగాని, నూనెతో గాని వేసుకుని, వేడి అన్నంతో తింటే బాగుంటుంది.
రచన: సుబ్బలక్ష్మి మంచికంటి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
ఇది నేలసారాన్ని మెరుగుపరచి, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను వృద్ధిచేస్తుంది. మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. సేంద్రియ మరియు సహజ వ్యవసాయానికి ఇది చాలా అనువైనది.
మోతాదు: ఎకరాకు 200 లీటర్లు సాగు నీరు ద్వారా గానీ, భూమిపైన గాని చల్లాలి.
కావలసిన పదార్థాలు : ఆవుపేడ: 10 కేజీలు; ఆవు నెయ్యి : 250 గ్రాములు; తేనె / నల్లబెల్లం : 500 గ్రాములు.
తయారు చేయు విధానం: ముందుగా ఆవుపేడ మట్టి కుండలో వేసి పావుకిలో ఆవునెయ్యి వేసి సుమారు 2 గంటలు బాగా కలిపి తర్వాత తేనె లేక బెల్లపు నీరు (అరకేజి బెల్లంకు అర లీటరు నీరు) పోసి 2 గంటలు ఆవుపేడను బాగా పిసుకుతూ కలపాలి. తర్వాత నీటిలో కళ్ళాపిలాజేసి 200 లీటర్ల డ్రమ్ములో పోసి డ్రమ్మునిండా నీరు పోస్తూ కలుపుతుండాలి. డ్రమ్ము నింపిన తర్వాత మిశ్రమాన్ని సుమారు 3 లేక 4 గంటలు కర్రతో త్రిప్పి ఆ తర్వాత ఎకరం పొలంలో కళ్ళాపిలా చిమ్మడం గాని లేక పారుతున్న నీటిలో పోస్తూ గాని భూమికివ్వాలి.