భారీఎత్తున చిరుధాన్యాల సాగును దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. వాటి శుద్ధి.. వినియోగ విస్తరణ ద్వారా రైతుల ఆదాయం పెంపుదలకు కృషి చేస్తామని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్)ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “గ్రామీణ ఉపాధిని సృష్టించడం లక్ష్యంగా ఈ రంగానికి చేయూతనిస్తాం. చిరుధాన్యాల ఆధారిత అంకురాలు, పరిశ్రమల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి” అని సూచించారు. ఐఐఎంఆర్ సంచాలకురాలు తారా సత్యవతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.