యానిమల్ హాస్టల్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. స్థలం.. సమయం లేని వారి పశువులను ఈ హాస్టళ్లల్లో పెట్టి ఆలనాపాలన వారే చూసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రాథమికంగా రాష్ట్రంలో నియోజకవర్గానికో హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక్కో హాస్టల్ అరెకరం స్థలంలో ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఇందులో 20-25 పశువులు పట్టేలా నిర్మాణం చేపడతారు. మిగిలిన స్థలంలో గడ్డి అభివృద్ధి చేస్తారు. నిర్మాణానికి రూ. 10లక్షల నిధులు ఉపాధిహామీ నుంచి విడుదల చేస్తారు. ఇవన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. కొద్ది రోజులు నిర్వహించిన తర్వాత పాడి రైతులంతా సంఘాలుగా ఏర్పడి ఇలాంటి హాస్టళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సొంత స్థలం ఉంటే సరే లేదంటే ప్రభుత్వమే స్థలం సమకూరుస్తుంది. షెడ్డు నిర్మాణానికి సైతంఉపాధి హామీ నుంచి నిధులు సమకూర్చేలా అధికారులు సమాలోచన చేస్తున్నారు. గ్రామాల్లో ఆసక్తి ఉన్నవారు తమ పశువులను అక్కడికి తరలిస్తే వాటికి దాణా, గడ్డి, నీరు అన్నీ నిర్వాహకులు చూసుకుంటారు. ఉదయం సాయంత్రం వెళితే యజమానుల ముందే పాలు పితికి అప్పగిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహణక అయ్యే ఖర్చు యజమానులు చెల్లించాల్సి ఉంటుంది.