తెలంగాణలో మూడు కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ శివారు మగ్దుంనగర్‌, వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం అప్పాయిపల్లి, నిజామాబాద్‌ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రస్తుత (2025-26) విద్యా సంవత్సరంలో 30 నుంచి 60 సీట్లతో వీటిని ప్రారంభించాలని, ఆ తర్వాత సంవత్సరం నుంచి సీట్ల సంఖ్యను 120కు పెంచాలని సూచించింది. ఈ మూడు కళాశాలల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.