అధిక వర్షాలు పడినప్పుడు టమాటలు నేలను తాకి తడిసి మురిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నరెడ్లగూడలో రైతు మిట్ట బాలకృష్ణారెడ్డి పంటను కాపాడుకునేందుకు ఉద్యాన శాస్త్రవేత్తల సలహా కోరారు. మొక్కలు ఎదిగే దశలో కొమ్మలను లేపడం వల్ల కాయలకు నష్టం తగ్గుతుందని చెప్పారు. ఆయన తన రెండు ఎకరాల కూరగాయల తోటలో వరుసకు వరుసకు మధ్య రెండు అడుగుల స్థలం వదిలి, ప్రతి సాలు పొడవునా ఎనిమిది అడుగుల ఎత్తైన కట్టెలను పాతారు. ఆ కట్టెలకు తీగ కట్టారు. మొక్క అడుగు ఎత్తు పెరగగానే దాని కొమ్మలను లేపి తీగకు తాడుతో కట్టారు. ఇలా మూడు అడుగుల వరకు మొక్క పెరిగిన కొద్దీ తీగ ఎత్తు పెంచుకుంటూ వెళ్లారు. గత నెలలో భారీ వర్షాలతో నీరు చేరినా టమాటకు నష్టం జరగలేదు. కర్రలు, తీగలకు ఎకరానికి రూ.20 వేల ఖర్చు అయిందని అయినా రూ.80 వేల పంట దక్కిందని బాలకృష్ణా రెడ్డి చెప్పారు.

6 Oct, 2025
