విజయవాడ ఎక్స్‌పోలో 11 రోజులు ఈ వ్యవసాయ ప్రదర్శన ఉంటుంది. వ్యవసాయం, ఆక్వా, పశుసంవర్థక, ఉద్యాన శాఖలవి 90 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మొదలు పరికరాల వరకు అనేక అంశాలు వీటిలో ప్రతిబింబించనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా రైతులు వస్తారని అంచనా. వీరి కోసం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, వైఎస్సార్‌ ఉద్యాన, వేంకటేశ్వర వెటర్నరీ, ఫిషరీస్‌ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, అధ్యాపకులు రానున్నారు. పెదవేగి ఆయిల్‌పాం పరిశోధన స్థానం నుంచి సైతం శాస్త్రవేత్తలు వస్తారు. ఈ స్టాళ్లలో రైతులకు అవసరమైన పరికరాలు, యంత్రాలు, ఉత్పత్తులు, విత్తనాలు, చేప పిల్లలు, మేత, పశువులను ప్రదర్శిస్తారు. సాగులో ప్రయోగాలు చేసి విజయం సాధించిన రైతులను సన్మానిస్తారు. ప్రభుత్వం రైతుల ప్రగతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి అర్హతలు ఎలా దరఖాస్తు చేయాలి? అంశంపై వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, వెటర్నరీ విభాగాల అధికారులు అవగాహన కల్పిస్తారు. సాగులో సమస్యలు, తీసుకోవాల్సిన సస్య రక్షణ, డ్రోన్‌ వినియోగం, రసాయనాల పిచికారీ, విత్తనాలు వేయడం, ఏఐ, రోబోల ద్వారా సాగు చేసే సాంకేతిక విధానాలపై అవగాహన కల్పిస్తారు. మామిడి, ఆయిల్‌పాం, అరటి సాగులో అధిక నాణ్యత, దిగుబడి సాధనకు అనుసరించాల్సిన సాగు పద్ధతులు వివరిస్తారు. సాంకేతిక విధానాలతో పాల ఉత్పత్తి, నాణ్యత పెంపు, పశుగ్రాసాలపై అవగాహన కల్పిస్తారు.