ఒక వ్యక్తి ఆధార్‌ సంఖ్యతో వారి వయసు, చిరునామా, సిమ్‌కార్డులు, ఆదాయ వివరాలు తెలుసుకొనే తరహాలోనే భూమికి సంబంధించిన సర్వే, ఉప సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దులు, నేల రకం, ఎలా సంక్రమించింది, మ్యాప్‌, లింక్‌ డాక్యుమెంట్లు, బీమా, బ్యాంకు రుణాలు, మార్టిగేజ్‌ తదితర సమగ్ర సమాచారం తెలుసుకునేలా త్వరలోనే ‘భూధార్‌’ అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెవెన్యూ శాఖను ఇటీవల ఆదేశించారు. భూధార్‌ అమలు లోకి వస్తే.. భూ ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టికి అడ్డుకట్ట పడనుందని ప్రభుత్వం భావిస్తోంది. భూధార్‌ జారీకి ప్రతి భూమిని సర్వే చేయాల్సి ఉంటుంది. భూమి సరిహద్దులను అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి భూధార్‌ నమోదు చేస్తారు. సర్వే పూర్తికాక ముందు తాత్కాలిక, పూర్తయ్యాక శాశ్వత భూధార్‌ జారీ చేయనుంది. ప్రతి రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌కు సర్వేను తప్పనిసరి చేస్తూ భూభారతి చట్టంలో సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి కనీసం 43 మంది చొప్పున లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను ప్రభుత్వం నియమిస్తోంది. ప్రస్తుతం ఏడు వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇటీవల సర్వే నిర్వహించిన పైలట్‌ గ్రామాల్లో భూధార్‌ కార్డులను తొలుత జారీ చేసి, తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 70.50 లక్షల మంది రైతులకు 1.40 కోట్ల ఎకరాల సాగు భూములున్నాయి. భూ దస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం (ఆర్వోఆర్‌) కింద ప్రతి కమతానికి పట్టా పాసుపుస్తకం జారీ చేస్తుండగా.. అందులో పలు సర్వే నంబర్ల కింద ఉన్న భూమి వివరాలు తప్ప ఏమీ ఉండటం లేదు.
భూధార్‌లో ఒక రైతుకు చెందిన భూమి సమగ్ర వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా కమతాలన్నింటినీ కంప్యూటరీకరించడం, ప్రభుత్వం వద్ద భూమికి సంబంధించిన పథకాలన్నింటినీ జోడించే ప్రక్రియలను చేపట్టనున్నారు.
అనంతరం ఆర్వోఆర్‌ 2025 భూభారతి చట్టంలోని సెక్షన్‌ (రూల్‌ 9) ప్రకారం రాష్ట్రంలోని ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు.
ఆన్‌లైన్‌లో ఈ సంఖ్యను నమోదు చేస్తే భూమి సమగ్ర వివరాలు ఇట్టే తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. దీనికోసం రెవెన్యూశాఖ ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది.
డిజిటల్‌ ఇండియా భూ దస్త్రాల ఆధునికీకరణ పథకంలో భాగంగా ప్రతి కమతానికి యూఎల్‌పిన్‌/భూ ఆధార్‌ / భూధార్‌ జారీ చేయాలని కేంద్రం సూచిస్తోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే తాత్కాలిక లేదా శాశ్వత భూధార్‌ కార్డుల జారీని ప్రారంభించాయి.