తేమ 22 శాతం వరకు అనుమతి
తరుగు 5 కేజీలు మించనివ్వం మంత్రి నాదెండ్ల మనోహర్‌ హామీ

రైతులు ఆందోళన చెందవద్దని, వర్షాలకు తడిసిన ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జె. తిమ్మాపురం, జగ్గంపేట మండలం కాట్రావులపల్లి, కాకినాడ గ్రామీణంలోని చీడిగలో సోమవారం మంత్రి పర్యటించి, భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం కాకినాడ కలెక్టరేట్‌లో కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల జేసీలు, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖలు, మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. విలేకర్లతో మంత్రి మాట్లాడుతూ ‘పంటను యంత్రాలతో కోస్తుండటం వల్ల తేమ శాతం 16-17 అంటే ఇబ్బంది. 22 శాతం వరకు అనుమతించాలని, తరుగు 5 కేజీల కంటే ఎక్కువ ఉండకూడదని ఆదేశాలిచ్చాం. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లకు 1:2 బ్యాంకు గ్యారంటీ వెసులు బాటు కల్పించాం. దిగుబడి ఎక్కువగా ఉన్నందున కొనుగోలుకు అదనపు లక్ష్యాలు నిర్దేశించాం. అదనంగా తూర్పుగోదావరిలో 50 వేలు, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో లక్ష, కాకినాడ జిల్లాలో మరో 50 వేల మెట్రిక్‌ టన్నుల సేకరణకు అనుమతిచ్చాం. బాయిల్డ్‌ రైస్‌ వెరైటీ (బొండాలు రకం) జాప్యం లేకుండా కొనుగోలు చేస్తారు. వర్షాలకు నష్టంపై అంచనాలు వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించాం’ అని వివరించారు.