ఫలించిన మాజీ మంత్రి ఏరాసు ప్రయత్నంకాయలు కాసిన మియాజాకీ రకం

ప్రంచంలో ఖరీదైన మామిడిగా పేరొందిన ‘మియాజాకీ’ రకం మామిడిని ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన తెదేపా నేత, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. జపాన్‌లో పండే ఈ రకం మామిడి.. గతంలో బంగ్లాదేశ్‌లో ఒక కేజీ రూ. లక్ష పలికింది. దాంతో మియాజాకీ మామిడిపండ్లపై ప్రపంచ రైతులు దృష్టి సారించారు. మంచి రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమైన బీటా కెరోటిన్‌, విటమిన్‌-సి, విటమిన్‌-ఎ, ఫోలిక్‌ యాసిడ్‌ వంటివి అందులో ఉంటాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి రెండేళ్ల కిందట బంగ్లాదేశ్‌లో జరిగిన ‘మామిడి మేళా’ ప్రదర్శనలో ఆరు మియాజాకీ రకం మొక్కలను కొనుగోలు చేసి తన పొలంలో వేశారు. ఉద్యానశాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ వాటికి తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించడంతో ఈ ఏడాది కాయలు కాశాయి.

ప్రయోగక్షేత్రంగా తోట..
పాణ్యంలోని తన పొలంలో అరుదైన జాతుల మొక్కలను పెంచుతూ ప్రతాప్‌రెడ్డి దాన్ని ఒక ప్రయోగక్షేత్రంగా మార్చేశారు. మామిడిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 20 రకాలకు చెందిన 1,500 మొక్కలను బంగ్లాదేశ్‌ నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందులో 400 మొక్కలు బతికాయి.