ప్రధానమంత్రి ఫసల్బీమా యోజనను ప్రతి పంటకూ విస్తరించాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కోరారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన దీని గురించి ప్రస్తావించారు. రైతులు దాదాపు 200 రకాల పంటలు పండిస్తుంటే.. కేవలం 60 పంటలకే బీమాను వర్తింపజేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అలాగే పంటల బీమా రంగంలో ఐదు ప్రభుత్వరంగ సంస్థలు, 15 ప్రైవేటు సంస్థలు మాత్రమే ఉన్నాయని.. భారీ సంఖ్యలో ఉన్న రైతులకు బీమాను సకాలంలో చెల్లించడానికి ఈ కొద్ది కంపెనీలు సరిపోనందున విస్తృతం చేయాలని కోరారు. మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. రిమోట్ సెన్సింగ్ డేటా ద్వారా పంట నష్టాన్ని అంచనా వేయడం ద్వారా బీమా కంపెనీల చెల్లింపులను వేగవంతం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 20 దాకా ఉన్న బీమా కంపెనీల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనుందని పేర్కొన్నారు.

5 Feb, 2025
