దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలను కొత్తగా ప్రారంభించడానికి, తమ ముందస్తు అనుమతి తప్పనిసరి అని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మంగళవారం లేఖ రాసింది. వ్యవసాయ విద్య నాణ్యత దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐకార్‌ డైరెక్టర్‌ జనరల్‌, వ్యవసాయ పరిశోధన, విద్య కార్యదర్శి హిమాంశు పాఠక్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ఐకార్‌ తాజా లేఖ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ప్రైవేటు కళాశాలల ప్రలోభాలకు గురికావద్దు. నిబంధనల మేరకు కళాశాలలున్నాయో, లేదో తెలుసుకున్నాకే వాటిలో చేరాలి. ఐకార్‌ నిబంధనలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతాను’ అని వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్‌ జానయ్య తెలిపారు.