తెలంగాణా రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత రైతులకు వరప్రదాయిని అయన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఎగువ భాగంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు సోమవారం తెరుచుకున్నాయి. తెలంగాణ మరియు మహారాష్ట్రకు చెందిన ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బాబ్లీ ప్రాజెక్ట్‌కు ఉన్న 14 గేట్లను ఎత్తివేశారు. గేట్లు ఎత్తిన సమయంలో ప్రాజెక్ట్‌లో 0.2 టి.యం.సీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమైన జులై 1వ తేదీ నుంచి బాబ్లీ గేట్లను తెరచి అక్టోబరు 28వ తేదీన మూసి వేస్తారు. ఈపరిణామంతో నిజామాబాద్‌ రెంటల్‌ మండలం కందకుర్తి, త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది.