మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

పీఎం ఆషా పథకం కింద మొక్కజొన్న రైతులకు నేరుగా ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలని.. ఏపీని ప్రత్యేకంగా పరిగణించి ధరల వ్యత్యాసంలో 100% కేంద్రమే భరించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,700 మాత్రమే ఉంది. కనీస మద్దతు ధర రూ. 2,400 కంటే ఇది చాలా తక్కువ. రోజురోజుకు ధరలు పడిపోతున్నాయి’ అని వివరించారు. ‘రాష్ట్రంలో 42.06 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 14.26 లక్షల టన్నుల పంట కోత దశలో ఉంది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు నష్టపోతారు. నాఫెడ్, ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతులివ్వాలి. జూన్ 2026 వరకు పథకాన్ని పొడిగించాలి’ అని సీఎం కోరారు.

Read More

భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతుల్లో భయం

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ…”రైతులు పంటల ఎంపిక, పెట్టుబడుల ప్రణాళిక, మార్కెట్ పరిస్థితుల అంచనాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిస్థితి ప్రతికూలంగా మారింది. వాణిజ్య ఒప్పందం కారణంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల ఏ పంట వేయాలి… ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాల్లో రైతులకు కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందడం లేదు. దీంతో రాష్ట్రాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఎరువుల సరఫరా విషయంలో కూడా స్పష్టత లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఏప్రిల్‌కు కేటాయించిన ఎరువులు ఇంకా అందలేదు. రైతులకు నష్టం కలిగించే ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించాలి. ఎరువుల సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలి” అని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.

Read More