కొత్తగా 50 వేల ఎకరాల్లో కూరగాయలు, తోటల పెంపకమే లక్ష్యం – సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.145 కోట్లు కేటాయింపు – మెట్రో అర్బన్‌ వెజిటబుల్‌ క్లస్టర్ల విభాగానికి హైదరాబాద్‌ ఎంపిక – జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.333 కోట్లు మంజూరయ్యే అవకాశం*

తెలంగాణలో కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి భారీగా సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు పథకాల కింద నిధులను విడుదల చేయనుంది. సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం (మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌-ఎంఐడీహెచ్‌) కింద రాష్ట్రానికి రూ.145కోట్లను కేటాయించింది. దీంతోపాటు మెట్రో అర్బన్‌ వెజిటబుల్‌ క్లస్టర్‌ పథకానికి హైదరాబాద్‌ను ఎంపిక చేసింది. ఫలితంగా రాష్ట్రానికి త్వరలో రూ.333 కోట్లు రానున్నాయి. దేశంలో కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఎంఐడీహెచ్‌ని అమలు చేస్తోంది. 2025-26 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను తాజాగా విడుదల చేసింది. దీనికి ముందు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతి పాదనలు కోరగా… మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యాన శాఖ డైరెక్టర్‌ యాస్మిన్‌బాషా ప్రతిపాదనలను పంపారు. తెలంగాణలో ఉద్యాన పథకాల అమలులో పురోగతిని పరిగణనలోనికి తీసుకున్న కేంద్రం…. 2025-26 సంవత్సరానికి రూ.145 కోట్లను కేటాయించింది. నిరుడు ఇచ్చిన రూ. 60 కోట్లకంటే ఇది రూ.85 కోట్లు అధికం కావడం గమనార్హం. మొత్తం రూ.145 కోట్లలో కేంద్రం 60% రాష్ట్రం 40% నిధులను భరిస్తాయి.*అన్నదాతలకు భారీగా ప్రోత్సాహకాలు:* రాష్ట్రంలో 2025-26 కార్యాచరణ ప్రణాళిక కింద ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో ప్రధానంగా… కూరగాయలు 5,000 ఎకరాలు, మామిడి 2,000 ఎకరాలు, నారింజ 1,000 ఎకరాలు, కోకో 2,500 ఎకరాల చొప్పున… మొత్తంగా 50 వేల ఎకరాల మేరకు పెంచాలంది. వీటికోసం అధికారులు… రాయితీలు, ప్రోత్సాహకాలను భారీగా పెంచారు. గతంలో మామిడి సాగుకు మూడేళ్లలో ఎకరానికి రూ.81,581 సాయం అందేది. దాన్ని ఇప్పుడు రూ.2 లక్షలకు పెంచారు. నారింజ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి తోటల సాగుకు సైతం మొక్కలు, ఎరువులు, పురుగుమందులు, అంతర పంటలు, నీటి సదుపాయానికి 40% రాయితీ ఇవ్వనున్నారు. పాత తోటలను నరికి వాటి స్థానంలో తోటల పునరుద్ధరణ, ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి ఎరువులు, పురుగుమందులు, కత్తిరింపు పరికరాలు, సెక్యూటర్ల కొనుగోలుకు సాయమూ అందించనున్నారు. రక్షిత సాగు కార్యక్రమాల (గ్రీన్‌ హౌస్‌/షేడ్‌ నెట్‌ హౌస్‌ / మల్చింగ్‌)కు, అంకురోత్పత్తి, తెగుళ్ల నియంత్రణకు, కోల్డ్‌ స్టోరేజీలకు, ప్యాక్‌ హౌస్‌లకూ సాయం అందిస్తారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద చిన్న ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు, రోటోవేటర్లు, పవర్‌ వీడర్లు, తైవాన్‌, హ్యాండ్‌ స్ప్రేయర్లు మొదలైనవి సమకూరుస్తారు. సౌర కంచెలు ఏర్పాటుకు రుణమిస్తారు. పంటల శుద్ధి, మార్కెటింగ్‌కు ఊతమిస్తారు.*ఆరుజిల్లాల్లో విస్తరణకు చేయూత:* మెట్రో నగరాల్లో కూరగాయల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లతో కూరగాయల సమూహాల పథకం (మెట్రో అర్బన్‌ వెజిటబుల్‌ క్లస్టర్ల) ప్రారంభించింది. అందులో భాగంగా ఐదు మెట్రో సిటీలకు 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకున్న ప్రాంతాల్లో కూరగాయల సాగును పెద్దఎత్తున పెంచాలని నిర్ణయించింది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరుతోపాటు తాజాగా హైదరాబాద్‌ను సైతం చేర్చింది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ శివార్లలో కూరగాయల పెంపకాన్ని భారీగా చేపడతారు. ఇకపై వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌ వరకు కూరగాయల సమూహాల పథకం వర్తిస్తుంది. దీనికింద కూరగాయల సాగుకు రైతులు, రైతు సమూహాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహిస్తారు. అవసరమైన విత్తనాలు, నారు, మొక్కలు, సేంద్రియ ఎరువులను అందిస్తారు.