సహకార బ్యాంకుల్లో నగదు రహిత సేవలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (డీసీసీబీ) యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమగోదావరిలోని సహకార బ్యాంకుల్లో సోమవారం ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి దాకా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసే విధానం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు సహకార బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన రైతులకు లేకపోయేసరికి ప్రధానంగా పొగాకు, ఆయిల్ పామ్, కోకో రైతులు వాణిజ్య బ్యాంకుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ రైతుల సరకు విక్రయ లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే ముడిపడి ఉంటున్నాయి. దీంతో ఈ రకమైన యూపీఐ సేవలు సహకార బ్యాంకుల్లో ప్రారంభించే విషయంపై ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఉన్నతాధికారులతో మాట్లాడి తొలుత తన సొంత జిల్లా ఉమ్మడి పశ్చిమ నుంచే దీనికి శ్రీకారం చుట్టారు. ఇకపై ఖాతాదారులు మొబైల్ ఫోన్లను వినియోగించి తక్షణమే ఇతరులకు డబ్బులు పంపొచ్చు. స్వీకరించొచ్చు. నగదు రహిత సేవలను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా బ్రాంచిని సందర్శించకుండా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార బ్యాంకుల్లో త్వరలోనే యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

Read More

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా గుర్రపుడెక్కతో ఎరువు తయారీ

వినూత్న రీతిలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. పంట కాలువల్లో విపరీతంగా పెరిగే ఈ గుర్రపు డెక్కతో సాగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఏళ్లుగా అన్నదాతలను పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఇదొకటి. మరోవైపు, గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం ఏటా భారీగా ఖర్చు చేస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు పశ్చిమగోదావరి కలెక్టర్‌ చదలవాడ నాగరాణి వినూత్నంగా ఆలోచించారు. ‘గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీకి శ్రీకారం చుట్టారు. డీఆర్‌డిఏ పీడీ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం సిద్ధాపురంలోని సంపద తయారీ కేంద్రంలో కుండీల్లో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీని ప్రయోగాత్మంగా చేపట్టారు. ఫలితంగా అన్నదాతల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు.. మహిళల ఉపాధికి అవకాశం ఏర్పడినట్లైంది. గుర్రపు డెక్క ముక్కలు, ఆవుపేడ, మైక్రోబియల్‌ కల్చర్‌తో ఇలా చేశారు. 3-9 అడుగుల కుండీల్లో కింద గడ్డిని పొరగా వేసి, ఆపైన ముక్కలుగా చేసిన గుర్రపుడెక్క, దానిపైన రెండు అంగుళాల మందంలో ఆవుపేడను ఏడు నుంచి ఎనిమిది పొరలుగా వేశారు. 21 రోజుల పాటు అలా వదిలేశారు. అనంతరం మైక్రోబయల్‌ కల్చర్‌ను వాడి త్వరగా కంపోస్టింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు. ఆ మిశ్రమాన్ని ఏడు వారాల తర్వాత గుళికలుగా తయారుచేశారు. ఎరువు తయారీ ప్రాంతాన్ని క్రిమికీటకాలు ఆకర్షించే ప్రమాదం ఉండడంతో ఇళ్లకు, గోదాములకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.*నాణ్యమైన సేంద్రియ ఎరువు… తక్కువ సమయంలో…* గుర్రపుడెక్క ఎరువు సాధారణ సేంద్రియ ఎరువు కంటే రెండు నుంచి మూడు రెట్లు నాణ్యంగా ఉన్నట్లు ప్రయోగ పరీక్షల్లో తేలింది. ఈ తీగ కుళ్లడానికి తక్కువ సమయం పడుతోంది. పశువుల వ్యర్థాల కన్నా ఇందులో నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ కర్బనం, కాపర్‌, మాంగనీస్‌, జింక్‌, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఈ సేంద్రియ ఎరువు 6 నెలలపాటు నిల్వ ఉంటుంది. మిద్దె పంటలు, కొబ్బరి, మామిడి, సపోటా, కూరగాయలు, ఆయిల్‌పామ్‌, పూలమొక్కలు, కూరగాయలు, వరి, ఉద్యాన పంటలన్నింటికీ గుర్రపుడెక్కతో తయారుచేసిన ఎరువును ఉపయోగించుకోవచ్చు.*స్వయం ఉపాధి మార్గం* ఎరువు తయారీని మహిళా సమాఖ్యలకు అప్పగించడంతో ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన సేంద్రియ ఎరువు దొరుకుతోంది. గుర్రపుడెక్కతో తయారుచేసిన సేంద్రియ ఎరువు ధర కిలో రూ.12 నుంచి రూ.15గా, టన్ను రూ.12 వేలుగా నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే 100 యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎరువు తయారు కావడానికి ఒక్కో యూనిట్లో 20 మందికి 50 రోజుల పాటు ఉపాధి లభిస్తుంది. దీనిని రైతులే స్వయంగా తయారు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

Read More