పంటకాలం పెరుగుదలకు ‘వండర్ ఆయిల్స్’

ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది. 

ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.

Read More

తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆకుకూరల సాగు

భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.

మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”

ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.

గోంగూర సాగు:
ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.

పాలకూర:
పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.

తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.

బచ్చలికూర :
బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.

చుక్క కూర:
చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

కొత్తిమీర:
కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.

పుదీన:
పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.

మెంతి కూర:
దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.

బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258

Read More

కోడిగుడ్లతో అమినో ఆమ్లం

ఎన్. గోపాల్‌క్రిష్ణన్ అనే అభ్యుదయ రైతు గుడ్లు, నిమ్మకాయలతో మొక్కల పెరుగుదలకు హార్మోన్ తయారు చేశారు. తమిళనాడులో అనేక మంది దీనిని ఉపయోగించి లాభాలు పొందుతున్నారు. ఆయన దీని తయారీ విధానం గురించి రైతులకు శిక్షణ ఇస్తున్నారు.

కావల్సిన వస్తువులు – తయారీ విధానం

  • 20-25 నిమ్మకాయలు
  • 250 గ్రాముల బెల్లం
  • 10-15 కోడి లేక బాతు గుడ్లు ఒక బకెట్‌లో నిమ్మకాయల రసాన్ని తీయాలి. దీనిలో బెల్లాన్ని కరగబెట్టాలి. ఈ రసంలో గుడ్లు మునిగేటట్లు ఉంచి గాలి చొరబడకుండా బకెట్‌కు మూత పెట్టి నీడలో పది రోజుల పాటు ఉంచాలి. గుడ్లు పెంకుతో సహా రసంలో కరిగి రబ్బరు బంతుల్లా తయారవుతాయి. పది రోజుల తరువాత రబ్బరు బంతుల్లా మారిన గుడ్లను చేతులతో నలిపి దాన్ని బాగా కలియబెట్టాలి. తరువాత దీనికి అంతే మొత్తంలో మరోసారి బెల్లం రసాన్ని కలపాలి. ఉదాహరణకు బకెట్‌లో రెండు లీటర్ల రసం ఉందంటే దానికి మరో రెండు లీటర్ల బెల్లం రసాన్ని కలపాలి. తిరిగి బకెట్‌కు గట్టిగా మూత పెట్టి మరో పది రోజులు ఉంచాలి. పది రోజుల తరువాత దీన్ని పంటల మీద ఉపయోగించవచ్చు. 10Ð15 మి.లీ. రసాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి పంటల మీద స్ప్రే చేయాలి.

ఏ పంటలకు ఉపయోగపడుతుంది?
ఈ సేంద్రియ హార్మోన్‌ను వరి, గోధుమ, అరటి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు అన్నింటి మీద స్ప్రే చేయవచ్చు. పిచికారి వేళలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఉదయం, సాయంత్రం పొద్దు మునిగే ముందు పిచికారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీనికి పంచగవ్య, వర్మివాష్‌లను కూడా కలిపి వాడవవచ్చు. ద్రావణం తయారు చేసేటప్పుడు మూతకు చిన్న చిన్న రంధ్రాలు పెడితే మంచిది. దీనిని ఆరు మాసాల వరకు నిలువ చేసుకోవచ్చు.

Read More

మాంసం, వరి పొట్టుతో కునపజలం

ఆదికాలంలోనే భారతీయ వ్యవసాయ శా¢స్తం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రసిద్ధ ప్రాచీన వ్యవసాయ శా¢స్తవేత్తలు ప్రాచీన రుషులు, పరాశరుడు, సురపాలుడు తదితరులు అతద్భుతమైన పరిశోధనలు జరిపి గ్రంథస్థం చేశారు. సురపాల మహర్షి రాసిన వృక్షాయుర్వేదంలో కునపజలం అనే ద్రావణ ఎరువుని ప్రస్తావించారు. సంస్కృతంలో కునప అంటే మృత కళేబరం. జలం అంటే నీరు. అంటే శవం కంపుకొట్టే నీరని అర్థం. ఇది మొక్కలకు పోషక ద్రావణంగానూ ఉపయోగపడుతుంది. దీన్ని చేపల వ్యర్థాలతోనూ, కోడిమాంసం వ్యర్థాలతోనూ, పంది, జింక, ఇతర అడవి జంతువుల మాంసంతోనూ తయారుచేసేవారు. అడవులు అంతరించి జంతువులు కనుమరుగవుతున్న కాలంలోనే ప్రస్తుతం చేపల వ్యర్థాలు, కోడి మాంసం వ్యర్థాలతోనూ తయారు చేసుకోవచ్చు. కోడి మాంసపు వ్యర్థాలతో చేసేదాన్ని కుక్కుట కునప అంటారు.

ఆవు పేడ, పంచితం, పాలు, పెరుగు, నెయ్యి తదితరాలతో తయారుచేసే ‘కునపజలం’ పంటలు ఏపుగా పెరగడానికి.. పురుగులు, తెగుళ్ల ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, మాంసం, వరిపొట్టు కూడా కలిపి కునపజలం తయారుచేస్తే, మరింత శక్తివంతంగా పనిచేస్తుందంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజిస్ట్) ఇక్రిశాట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన డా॥ వై.ఎల్.నెనె. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ కునపజలం కన్నా ఈ కునపజలం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని డా॥ నెనె అంటున్నారు.

తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కిలోలు, పంచితం 4 లీటర్లు, పాలు 3 లీటర్లు, పెరుగు 2 లీటర్లు, నెయ్యి కిలో, మాంసం (గొడ్డు మాంసం తప్ప ఏదైనా) 3 కిలోలు, వరిపొట్టు 2 కిలోలు, చెరకు రసం 3 లీటర్లు లేదా నల్లబెల్లం కిలో, లేత కొబ్బరినీరు 2 లీటర్లు, బాగా మగ్గిన అరటిపండ్లు 12, కల్లు 3 లీటర్లు.

తయారుచేసే పద్ధతి: మాంసాన్ని, వరిపొట్టును ఉడకబెట్టిన తర్వాత మాత్రమే కునపజలం తయారీలో వాడాలి. మాంసంలో అధిక పోషకాలుంటాయి. వరిపొట్టులో సిలికా ఉంటుంది. పురుగులు, తెగుళ్లను తట్టుకునే శక్తిని సిలికా పెంపొందిస్తుంది. ఉడకబెట్టిన మాంసం, వరిపొట్టుతో పాటు పేడ, పంచితాలను వెడల్పాటి మూతిగల మట్టి లేదా ప్లాస్టిక్ తొట్టి లేదా డ్రమ్ములో కలిపి, పాత్రపై పలుచని వస్త్రాన్ని కప్పి, నీడగా ఉండే ప్రాంతంలో రెండు వారాలు పులియనివ్వాలి. ప్రతి ఉదయం, సాయంత్రం సవ్యదిశలో కొద్దిసేపు కర్రతో కలపాలి. 2 వారాల తర్వాత మిగతా వాటిని కూడా కలిపి మరో వారం రోజులు పులియబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి వాడుకోవచ్చు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

ఉపయోగించే విధానం: ఎకరానికి 100-150 లీటర్ల నీటిలో 3 లీటర్ల కునపజలాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో 3 నుంచి 4సార్లు పంటలపై పిచికారీ చేయాలి. ఈ మధ్యలో వర్షం కురిస్తే 1 లేదా 2 సార్లు అదనంగా పిచికారీ చేయాలి.

ఉపయోగాలు: ముఖ్యంగా పత్తి, మిరప, వరి, కూరగాయలు, పండ్ల తోటలపై బాగా పనిచేస్తుంది. దీనివల్ల పంట గింజల బరువు పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు పంటలను ఆశించవు. పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల నాణ్యత పెరిగి సహజసిద్ధమైన రంగు, రుచి, వాసన వస్తుంది. కూరగాయ పంటల నాణ్యత పెరిగి మంచి మెరుపు వస్తుంది.

దిగుబడిని పెంచే కునపజలం
కావలసిన పదార్థాలు : మాంసం-1 కిలో; మినప పప్పుపొడి -1/4 కి.; నువ్వులు- 1/4 కి.; నల్లబెల్లం- 1/4 కి.; ఆవుపాలు – 1 లీటరు; ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె – 50 గ్రాములు; మంచి నీరు – 5 లీటర్లు

తయారు చేసే విధానం : మాంసాన్ని నీటిలో వేసి సన్నని మంటపై సగం కషాయం అయ్యే వరకు ఉడికించాలి. 2 గంటలు చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. సన్నని మంటపై మళ్ళీ మరగించాలి. పొంగువచ్చిన తర్వాత మినపపిండి, దంచిన నువ్వులు, బెల్లం వేసి కలియబెడుతూ ఉండాలి. పొంగు వచ్చిన వెంటనే పాత్రను దించి, చల్లార్చి, మట్టికుండలో పోయాలి. అందులో ఆవుపాలు పోసి, కుండపైన మూకుడు పెట్టి గట్టి గుడ్డతో వాసిన కట్టి పెంట పోగు కింద లేక మట్టి గుంతలో పాతి పెట్టాలి. 11వ రోజు బయటకు తీసి కషాయాన్ని వడపోయాలి. ఈ కషాయాన్ని వేరొక కుండలో పోసి దానికి నెయ్యి లేక నూనె కలిపి పాత్రపై మూకుడు పెట్టి ఒక ప్లాస్టిక్ కాగితంలో ఉంచి గట్టిగా తాడుతో కట్టి 10 రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11వ రోజు నుంచి ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు. 3 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఏ పంటపైనన్నా పిచికారి చేయవచ్చు. పంటకాలంలో రెండుసార్లు పిచికారి చేయవచ్చు. ఇది ప్రభావశీల ఔషధం. పంట దిగుబడి 20% పెరుగుతుంది.

Read More

రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి

విదేశీ పప్పులు, నూనెల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారని తెలగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతులు పండించిన వరి, మక్కలు కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. గిట్టుబాటు, ఆదాయం, డిమాండుకు అనుగుణంగా పప్పులు, కూరగాయలు, ఆయిల్‌పాం వంటి ఉద్యాన పంటలు సాగుచేయాలని కర్షకులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రణాళికపై ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రి బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మన మామిడిపండ్లకు జపాన్ లో డిమాండ్ ఉన్నా.. రసాయన అవశేషాల పేరిట ఆ దేశం తిరస్కరించింది. ఇకనైనా రైతులు అధిక రసాయనాల వాడకం తగ్గించాలి. ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపాలి’ అని పేర్కొన్నారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ పాల్గొన్నారు.

Read More

జలధారతో కరవు తీరింది

కరవుతో ఇబ్బందులు ఎదుర్కొనే అన్నమయ్య జిల్లాలోని గాలివీడు మండలంలోని రైతులు ప్రస్తుతం కూరగాయలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. జలధారలో భాగంగా హంద్రీనీవా నీటిని వెలిగల్లు జలాశయానికి మళ్లించడంతో పాటు చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో సుమారు 900 ఎకరాల్లో మల్చింగ్ విధానంలో టమాటా, ఇతర కూరగాయలు పండిస్తు న్నారు. డ్రోన్‌తో ఫొటో తీసిన క్రమంలో మల్చింగ్ పేపర్లతో ఆ ప్రాంతమంతా ఈ విధంగా కనిపించింది.

Read More

తెలంగాణాలో కూరగాయల రైతులకు సమీపంలోనే విక్రయ కేంద్రాలు

కూరగాయ పంటలు పండించే చోటే స్థానిక మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 ప్రాంతాలను దీని కోసం గుర్తించింది. కూరగాయల సాగు విస్తీర్ణం పెంపుదల ప్రణాళికలో భాగంగా రైతు సమస్యలపై ఉద్యానశాఖ, ఉద్యానవర్సిటీలు అధ్యయనం చేశాయి. పంటలు పండించిన తర్వాత విక్రయాలు, మార్కెటింగ్ సమస్యగా మారిందని, దీంతో రైతులు సాగుకు వెనకాడుతున్నారని అధ్యయనంలో తేల్చింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 36 రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. అవీ నగరాలు, పట్టణాల్లోనే ఏర్పాటయ్యాయి. తెల్లవారుజామునే పంటను అక్కడికి తరలించడం రైతులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు తమ గ్రామాల సమీ పంలోనే మార్కెట్లను ఏర్పాటు చేసి క్రయవిక్రయాలకు అవకాశం కల్పించాలని ఉద్యానశాఖ, వర్సిటీలు సూచించాయి. దీనికి అనుగుణంగా స్థలాలను గుర్తించాలని సర్కారు అన్ని జిల్లాల కలెక్టర్లను ఇటీవలే ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల రహదారులకు సమీపంలో రవాణా సౌకర్యం ఉన్నవాటికి ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించింది. కలెక్టర్లు మొదటి విడతలో 60 ప్రాంతాలను గుర్తించారు. అక్కడ కూరగాయల నిల్వ, విక్రయాల కోసం మార్కెటింగ్ శాఖ షెడ్లను నిర్మించనుంది. కూరగాయల లభ్యతపై సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. రవాణా కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులా లకు అక్కడి నుంచే కూరగాయలు పంపిణీ చేయనున్నారు.

Read More

రసాయన రహిత సహజ సాగు ప్రాజెక్టును తెలంగాణాలో ప్రారంభించాం

కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్‌పామ్ తదితర ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచుతామని, తెలంగాణా రాష్ట్రంలో సహజ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. వ్యవసాయ వర్సిటీలో సోమవారం మెగా రైతుమేళాకు ఆయన హాజరై ప్రసంగించారు. ‘రసాయన రహితంగా ఉండే సహజ సాగు ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రారంభించాం. రైతులకు శిక్షణ ఇచ్చి మరింత మంది దీన్ని అనుసరించేలా కార్యక్రమాలు చేపడతాం. మే 4-9వ తేదీ మధ్య గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన 12 అంశాలపై అవగాహన కల్పిస్తాం’ అని తెలిపారు.

Read More

కూరగాయల సాగుపై 800 మంది రైతులకు శిక్షణ

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 మందికి రైతులకు ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా శిక్షణ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగును పెద్దఎత్తున పెంచుతామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలో.. కూరగాయల పంటలపై అఖిలభారత సమన్వయ పథకం 44వ వార్షిక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్‌లో భాగంగా తెలంగాణలో ఉద్యాన రంగాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో ఉన్న కూరగాయల సాగు.. లక్ష ఎకరాలకు పడిపోయిందని, వెంటనే ఈ విస్తీర్ణం పెరగాలన్నారు. విశ్వవిద్యాలయానికి మిరప, ఔషధ మొక్కల ఏఐసీఆర్పీ కేంద్రాలను మంజూరు చేయాలని ఆయన ఐకార్‌ను కోరారు. సమావేశంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సుధాకర్ పాండే, భారత కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ రాజేశ్‌కుమార్, దాదాపు 300 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Read More

కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 9600/- సబ్సిడీ

తెలంగాణా రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో ఎకరంలో ఆరుటన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40 శాతం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యానశాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈఏడాది 10 వేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్‌ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం కోసం రూ.24 వేలు ఖర్చవుతుందని ఉద్యానశాఖ గుర్తించింది. ఇందులో 40 శాతం.. అంటే రూ. 9600 సాయం అందించేందుకు సిఫార్సు చేయగా.. మంత్రి ఆమోదం తెలిపారు. టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ తదితర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. సాగు ప్రారంభించిన వెంటనే నారు, విత్తనాలను ఉద్యానశాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేస్తే వారికి 40 శాతం సబ్సిడీ సాయం రూ.9600 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు 2.50 ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు. సాగుకు అవసరమైన నారును సిద్దిపేట జిల్లా ములుగు, హైదరాబాద్‌ సమీపంలోని జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లలో ఉద్యానశాఖ సాగు చేస్తోంది. ఎంపికైన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది.

Read More
  • 1
  • 2