పంటల సాగుతోనే కాకుండా వ్యవసాయ భూముల్లో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులే సొంతంగా లేదా ఏదైనా సహకార, స్వయం సహాయక సంఘం, కంపెనీ భాగస్వామ్యంతో పొలంలో సౌరవిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ‘ప్రధాన మంత్రి కిసాన్‌ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్‌ మహాభియాన్‌’ (పీఎం కుసుమ్‌) పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు ఈ ఉత్తర్వుల్లో ప్రకటించింది. పొలాల్లో 4 వేలమెగావాట్ల స్థాపిత సామర్థ్యమున్న సౌరవిద్యుత్‌ కేంద్రాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే (వచ్చే మార్చి) లోగా ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ పథకం అమలుకు ‘తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’ (టీజీరెడ్కో)ను నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. ఈ విద్యుత్‌ను కొనేందుకు నిర్ణీత ధరను విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయిస్తుంది. కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. డిస్కంల సమన్వయంతో ఆసక్తిగల రైతుల ఎంపికకు టీజీరెడ్కో దరఖాస్తులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.