గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం

     గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తోంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనాధారంలో పశుపోషణకు ముఖ్యమైన స్థానం ఉంది. వ్యవసాయంతో పాటు పశువులను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో పశుపోషణ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడగా, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు వంటి సాంకేతిక సాధనాలు రైతులకు పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఆర్థిక లావాదేవీలలో సహాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం రైతుల జీవితాలను సులభతరం చేస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.

పశువులకు డిజిటల్ గుర్తింపు (RFID ట్యాగింగ్):
ప్రతి పశువు చెవికి ప్రత్యేకమైన డిజిటల్ కోడ్ కలిగిన ట్యాగ్‌ను (RFID – Radio Frequency Identification) అమర్చుతున్నారు. దీని ద్వారా పశువు పుట్టిన తేదీ, యజమాని వివరాలు, ఇచ్చిన టీకాలు, మరియు ఆరోగ్య చరిత్రను కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (NDLM) డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు నకిలీ పశువులను గుర్తించడానికి సహాయపడుతుంది.

పశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ- డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ ఒకటి.

  • ప్రస్తుతం పశువులకు స్మార్ట్ కాలర్లు లేదా చెవులకు అమర్చే సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పశువుల శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఆహారం తీసుకునే విధానం వంటి విషయాలను నిరంతరం గమనిస్తాయి.
  • పశువులో ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే రైతు మొబైల్‌కు సమాచారం చేరుతుంది. దీంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చు. ఫలితంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి.
  • మన దేశంలో కొన్ని AI ఆధారిత వ్యవస్థలు మాస్టైటిస్, లంపీ స్కిన్ డిసీజ్ వంటి వ్యాధులను కూడా ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

పాల ఉత్పత్తి మరియు విక్రయాలలో డిజిటలైజేషన్:
పాల సేకరణ కేంద్రాలలో ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్’ (AMCU) వచ్చాయి. వీటి ద్వారా పాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో నాణ్యత (ఫ్యాట్ శాతం) ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.

  • డిజిటల్ పరికరాలు పశువుల ఉత్పాదకతను కూడా పెంచుతున్నాయి. పశువులు ఎంత మేత తింటున్నాయి, ఎప్పుడు మేత ఇవ్వాలి, సంతానోత్పత్తికి సరైన సమయం ఎప్పుడు అనే విషయాలను ఇవి గుర్తించగలవు. అలాగే పాల ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కూడా విశ్లేషించగలవు.
  • దీంతో ప్రతి పశువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతోంది.

కృత్రిమ గర్భధారణ (AI) మరియు సంతానోత్పత్తి యాప్‌లు:
పశువుల ఈత సమయం, ఎదకు వచ్చే సమయం కచ్చితంగా తెలిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు వచ్చాయి. ఇవి పశువుల ఆరోగ్య చక్రంను పర్యవేక్షించి, రైతులకు సరైన సమయానికి సూచనలు పంపుతాయి.

రైతుల చేతిలో స్మార్ట్‌ఫోన్ శక్తి- నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ రైతులకు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది.
మొబైల్ యాప్‌ల ద్వారా రైతులు పశువైద్యుల సలహాలు పొందవచ్చు. టెలీమెడిసిన్ సేవలను ఉపయోగించవచ్చు. వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. వ్యాధులపై హెచ్చరికలు పొందవచ్చు. మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. అలాగే పశువులు లేదా పాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. టీకాలు వేయాల్సిన తేదీలు, మందులు ఇవ్వాల్సిన సమయాల గురించి కూడా యాప్‌లు గుర్తు చేస్తాయి.

వ్యాధుల నియంత్రణలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర
పశువుల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే డిజిటల్ పరికరాలు వెంటనే హెచ్చరికలు పంపిస్తాయి. దీంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపించకముందే అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పశువుల మరణాలు తగ్గడమే కాకుండా రైతులు ఆర్థిక నష్టాల నుంచి కూడా రక్షించబడతారు.

పశువైద్య సేవలు – ఈ-సంజీవని:
దూర ప్రాంతాల్లోని రైతులకు పశువైద్యుల సలహాలు, సూచనలు అందించడానికి టెలి-మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ చేసి వ్యాధులను నిర్ధారించి, చికిత్స అందించవచ్చు.

మార్కెట్ అవకాశాల విస్తరణ- డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం పొందుతున్నారు.
దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తులకు సరైన ధర లభిస్తుంది. మార్కెట్ సమాచారం సులభంగా అందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపుల వల్ల డబ్బు లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరుగుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల యాంటీబయాటిక్స్ అవసరానికి మించి వాడాల్సిన అవసరం తగ్గుతుంది. నీరు, మేత వంటి వనరుల వృథా తగ్గుతుంది. పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు
అయితే ఈ మార్పుల మధ్య కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం. డిజిటల్ పరిజ్ఞానం కొంతమందికి తక్కువగా ఉండటం. ఆధునిక పరికరాల ధరలు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రైతులందరూ ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు.
అందుకే రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.

ముగింపు
డిజిటల్ టెక్నాలజీ సంప్రదాయ పశుపోషణ పద్ధతులను తొలగించడం లేదు. వాటిని మరింత మెరుగుపరుస్తోంది. రైతుల అనుభవానికి ఆధునిక సాంకేతికత తోడవడంతో పశుపోషణ మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతోంది. ఆరోగ్యకరమైన పశువులు, అధిక ఆదాయం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో పశుపోషణలో డిజిటల్ సాధనాలు కూడా భూమి, నీరు, మేతల మాదిరిగానే అవసరమైనవిగా మారనున్నాయి.
ఈ డిజిటల్ విప్లవం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వల్ల పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయి. యువత కూడా ఈ ఆధునిక పశుపోషణ పట్ల ఆసక్తి చూపుతున్నారు.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్‌సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. Ph: 9703121088

Read More

రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి అనూహ్య స్పందన – PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

600 గ్రామాల్లో 37,000 రైతులతో అవగాహన కార్యక్రమం

  • రైతుల్లో అసంతృప్తి లేదు.. కానీ చేయాల్సింది చాలా ఉంది

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ రాష్ట్రవ్యాప్తంగా నిరాటంకంగా, విజయవంతంగా సాగుతోంది. మే 5వ తేదీన వికారాబాద్ జిల్లా ధరూర్ లో ఈ కార్యక్రమాన్ని శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ M. కోదండ రెడ్డి, PJTAU ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య లాంచనంగా ప్రారంభించారు. ఆరోజు నుండి ఈ కార్యక్రమం నేటి వరకు 600 గ్రామాల్లో నిర్వహించగా సుమారు 31,000 మంది పురుషులు, 6,000 మంది మహిళలు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 37,000 మంది రైతులతో శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులు ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ MP డాక్టర్ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ G. చిన్నారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, ఎమ్మెల్సీలు, సుమారు 25 మంది శాసనసభ్యులు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులతో పాటు వారంలో ఒకరోజు ఉపకులపతి, ఇతర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. PJTAU శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆరు అంశాలైన తక్కువ యూరియా వాడి సాగు ఖర్చును తగ్గించడం, అవసరం మేరకే రసాయనాలను వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, వివిధ ఇన్ పుట్స్ కొనుగోలుకు సంబంధించిన రశీదులని భద్రపరచుకోవడం, సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడులను పాటించి సుస్థిరాదాయాన్ని పొందడం, చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించడం వంటి వాటిపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్ధులు రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతులు అడుగుతున్న అనేక సందేహాలను శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో నివృత్తి చేస్తున్నారు.

ఉపకులపతి సమీక్ష :-

   మూడు వారాలుగా సాగుతున్న 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం పై ఉపకులపతి అల్దాస్ జానయ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ కార్యక్రమానికి రైతాంగం నుంచి మంచి స్పందన వస్తుందని వివరించారు. ప్రభుత్వం రైతాంగానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల పై రైతాంగంలో ఎటువంటి అసంతృప్తి లేదని జానయ్య స్పష్టం చేశారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు. అలాగే ఇంకా కొన్ని వ్యవసాయ అంశాలకి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా రైతులు కోరుతున్నారని జానయ్య అన్నారు.  ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే నష్టాల్ని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పంటల బీమా సదుపాయం ప్రవేశపెట్టాలని రైతులు కోరుకుంటున్నారని, అలాగే చిన్న, సన్నకారు రైతులకి ఆధునిక వ్యవసాయ పనిముట్లని మరియు పచ్చి రొట్ట విత్తనాలను రాయితీపై  అందించాలని, విస్తృతంగా భూసార పరీక్షలు నిర్వహించాలని రైతాంగం కోరుకుంటున్నారని అల్దాస్ జానయ్య వివరించారు. ఇదే స్ఫూర్తితో రైతు సోదరులు, మహిళలు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని  దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉపకులపతి కోరారు.
Read More