సత్తుపిండిని కేవలం రెండే రెండు పదార్థాలతో తయారు చేస్తారు. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగకు కట్టుకుపోయే ‘సద్ది’లో, ఈ సత్తుపిండి ఒకటి.

సత్తుపిండిని, మొక్కజొన్నలను ‘వేపి’ తయారు చేస్తారు.
మన వండని వంటలు కాన్సెప్ట్ ప్రకారం, మొక్కజొన్నలను వేపకుండానే తయారు చేసాను.

కిలో మొక్కజొన్నలను బాగా ఎండబెట్టి, శుభ్రం చ్రేసి, మెత్తగా మర పట్టించాలి.

విసుర్రాయితో విసురుకుంటే, ‘కోల్డ్ విసుర్డ్ పిండి’ వస్తుంది, అది మరీ శ్రేష్టమైన పిండి.

మర(గిర్ని) పట్టిస్తే పిండి ఎక్కువ వేడెక్కుతుంది. ఆ మేరకు జీవశక్తి నష్టపోతుంది. కనుక విసుర్రాయి (తిరుగలి) ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండాలి.

సత్తుపిండి తయారీ విధానం: రెండు కప్పుల మొక్కజొన్న పిండికి, తగినంత ముడిబెల్లాన్ని తీసుకోవాలి. కాస్తా వెడల్పు గిన్నెలో అరకప్పు మంచినీరు తీసుకుని, ఆ నీటిలో బెల్లాన్ని కరిగించాలి. కరిగిన బెల్లపు నీటిలో, మొక్కజొన్న పిండిని బాగా కలిపి, ముద్దలు చేసుకోవాలి. అంతే! వెరీ సింపుల్!

మొక్కజొన్న పిండి సహజ సువాసనతో తియ్యగా ఉంటుంది.

పెద్దలు, పిల్లలు సత్తుపిండిని ఉపాహారంగా తినవచ్చు.

బెల్లం మోతాదు ఎవరి అబిరుచిని బట్టి వారు, కాస్తా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.

పిండి తయారుగా ఉంటే, సత్తుపిండి తయారీ నిముషాలలో అవుతుంది. సత్తుపిండిలో ఎండుద్రాక్ష లేదా ఖర్జూర పండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

పూర్వం ప్రయాణాల్లో సత్తుపిండిని, బెల్లాన్ని వెంట తీసుకుని పొయ్యేవారు. వంటకు వీలుకాని పూట, సత్తుపిండిని తినేవారు.

  • రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి