వ్యవసాయ యంత్ర పరికరాల సబ్సిడీకి రూ.112.50 కోట్ల కేటాయింపు

రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, గొర్రులు, కోత, నూర్పిడి యంత్రాలు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు వంటి వ్యవసాయ యంత్ర పరికరాలను అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఖరీఫ్, రబీ సాగు ఆధారంగా 2025-26 సంవత్సరానికి 28 జిల్లాలకు రూ.112.50 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.

*నిబంధనలు*

ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు యంత్రాల యూనిట్ ధరలో 50% చొప్పున, ఇతర రైతులకు 40% చొప్పున రాయితీ వర్తిస్తుంది. 40 హెచ్‌పీ వరకు సామర్థ్యం గల ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, అనుబంధ పరికరాలు, విత్తే, నాటే, తవ్వే యంత్రాలు, స్ప్రేయర్లు, స్వీయచోదక పరికరాలు, పవర్ టిల్లర్లు, కోత, నూర్పిడి యంత్రాలు, పంట కోత తర్వాత విలువ జోడింపు యంత్రాలు అందిస్తారు. లబ్ధిదారులను జిల్లా సంయుక్త కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. జిల్లాల్లో మండలాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదం తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదలవుతుంది. ఎంపికైన వారి మొబైల్ ఫోన్లకు మెనేజ్‌లు పంపిస్తారు. ప్రొసీడింగ్స్ ఇచ్చిన 15 రోజుల్లో రైతులు పరికరానికి సంబంధించి తమ వాటా మొత్తాన్ని డీలర్లకు చెల్లించాలి. ఆర్డర్ అందాక 15 రోజుల్లో రైతులకు యంత్రాన్ని అందిస్తారు.

రాయితీపై యంత్ర పరికరాలకు రైతు సేవా కేంద్రాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. నచ్చిన డీలర్ వద్ద పరికరాన్ని కొనుక్కోవచ్చు. మే 5 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలి. 23 నుంచి 25 వరకు లాటరీ ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి మంజూరు పత్రం ఇస్తారు. లబ్ధిదారు మే 26 నుంచి జూన్ 9లోగా తన వాటా సొమ్ము డీలర్‌కు చెల్లించాలి. మే 26 నుంచి జూన్ 26 వరకు యంత్రాలు సరఫరా చేస్తారు. జూన్ 30 నుంచి డీలర్ ఖాతాలోకి రాయితీ సొమ్ము విడుదల ప్రక్రియ మొదలవుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు వెబ్ సైట్: https://eseed.ap.gov.in/FM/*కౌలు రైతులూ అర్హులే* సొంత భూమి కలిగిన రైతులతో పాటు గత మూడేళ్లలో కనీసం మూడు సీజన్లలో ఈ పంటలో నమోదైన ‘కౌలు రైతు కార్డులు’ పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అటవీ హక్కుల పత్రాలున్న(ఆరఓఎఫఆర్) రైతులూ అర్హులే. 2024-25 సంవత్సరంలో రాయితీ పొందినవారు అర్హులు కాదు. కుటుంబంలో ఒక సభ్యుడే దరఖాస్తు చేసుకోవాలి. భూమి రికార్డులు, అటవీ హక్కుల పత్రాలు, ఈ-పంట తదితర సమా చారం ఆధారంగా అర్హుల్ని ఎంపిక చేస్తారు.

Read More

సేంద్రియ రైతుల కోసం ‘ఏలూరు రైతు సంపద’

‘ఏలూరు రైతు సంపద’ డాట్ ఇన్ అనే ఒక వెబ్‌సైట్‌ను ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా జిల్లాలో సేంద్రియ సేద్యం చేస్తున్న అన్నదాతలు వారు పండించే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశాన్ని ఉచితంగా కల్పించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో జరుగుతున్న మోసాలను నియంత్రించడం, రైతు-వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఉంచేందుకు ఈ ప్రత్యేక ప్లాట్‌ఫాంను కలెక్టర్ ఏర్పాటు చేయించారు. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యే ఉత్పత్తులను జిల్లా వ్యవసాయ-ఉద్యానశాఖలు ధ్రువీకరిస్తాయి. దాంతో వినియోగదారులు నేరుగా పోర్టల్‌లోకి వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుని రైతులతో మాట్లాడి తీసుకోవచ్చు.
సృజనాత్మక ఆలోచనలో భాగంగా…

సృజనాత్మక ఆలోచనలో భాగంగా…
వచ్చే సమావేశం నాటికి ప్రతి కలెక్టర్ ఒక సృజనాత్మక ఆలోచనతో రావాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా ఏలూరు కలెక్టర్ ఈ వెబ్‌సైట్ రూపకల్పనకు చొరవ తీసుకున్నారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ అధికారులను సమన్వయం చేసుకుని దీన్ని రూపొందించారు. ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయటానికి క్యూఆర్ కోడ్ వినియోగదారులకు అందు బాటులో ఉంచారు. దూర ప్రాంతాలకు చెందినవారు ఎవరైనా బుక్ చేసుకుంటే వారికి సరకులు పంపటానికి కార్గో బస్సులు, పార్సిల్ సర్వీసులు సులభతరం చేయాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్, సర్టిఫికేషన్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో దీన్ని ప్రజంట్ చేయనున్నారు.
ఈ నెల 18 లేదా 19న ఏలూరులో రైతు సంపద ఉత్పత్తుల భారీ మేళాను ఏర్పాటు చేసి ఈ వేదికను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలో ఆయా శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రైతుల ఉత్పత్తులను ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలని సోమవారం పీజీఆర్ఎస్‌కు హాజరైన అధికారులకు కలెక్టర్ సూచించారు.

Read More