గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం

     గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తోంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనాధారంలో పశుపోషణకు ముఖ్యమైన స్థానం ఉంది. వ్యవసాయంతో పాటు పశువులను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో పశుపోషణ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడగా, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు వంటి సాంకేతిక సాధనాలు రైతులకు పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఆర్థిక లావాదేవీలలో సహాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం రైతుల జీవితాలను సులభతరం చేస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.

పశువులకు డిజిటల్ గుర్తింపు (RFID ట్యాగింగ్):
ప్రతి పశువు చెవికి ప్రత్యేకమైన డిజిటల్ కోడ్ కలిగిన ట్యాగ్‌ను (RFID – Radio Frequency Identification) అమర్చుతున్నారు. దీని ద్వారా పశువు పుట్టిన తేదీ, యజమాని వివరాలు, ఇచ్చిన టీకాలు, మరియు ఆరోగ్య చరిత్రను కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (NDLM) డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు నకిలీ పశువులను గుర్తించడానికి సహాయపడుతుంది.

పశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ- డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ ఒకటి.

  • ప్రస్తుతం పశువులకు స్మార్ట్ కాలర్లు లేదా చెవులకు అమర్చే సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పశువుల శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఆహారం తీసుకునే విధానం వంటి విషయాలను నిరంతరం గమనిస్తాయి.
  • పశువులో ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే రైతు మొబైల్‌కు సమాచారం చేరుతుంది. దీంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చు. ఫలితంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి.
  • మన దేశంలో కొన్ని AI ఆధారిత వ్యవస్థలు మాస్టైటిస్, లంపీ స్కిన్ డిసీజ్ వంటి వ్యాధులను కూడా ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

పాల ఉత్పత్తి మరియు విక్రయాలలో డిజిటలైజేషన్:
పాల సేకరణ కేంద్రాలలో ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్’ (AMCU) వచ్చాయి. వీటి ద్వారా పాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో నాణ్యత (ఫ్యాట్ శాతం) ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.

  • డిజిటల్ పరికరాలు పశువుల ఉత్పాదకతను కూడా పెంచుతున్నాయి. పశువులు ఎంత మేత తింటున్నాయి, ఎప్పుడు మేత ఇవ్వాలి, సంతానోత్పత్తికి సరైన సమయం ఎప్పుడు అనే విషయాలను ఇవి గుర్తించగలవు. అలాగే పాల ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కూడా విశ్లేషించగలవు.
  • దీంతో ప్రతి పశువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతోంది.

కృత్రిమ గర్భధారణ (AI) మరియు సంతానోత్పత్తి యాప్‌లు:
పశువుల ఈత సమయం, ఎదకు వచ్చే సమయం కచ్చితంగా తెలిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు వచ్చాయి. ఇవి పశువుల ఆరోగ్య చక్రంను పర్యవేక్షించి, రైతులకు సరైన సమయానికి సూచనలు పంపుతాయి.

రైతుల చేతిలో స్మార్ట్‌ఫోన్ శక్తి- నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ రైతులకు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది.
మొబైల్ యాప్‌ల ద్వారా రైతులు పశువైద్యుల సలహాలు పొందవచ్చు. టెలీమెడిసిన్ సేవలను ఉపయోగించవచ్చు. వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. వ్యాధులపై హెచ్చరికలు పొందవచ్చు. మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. అలాగే పశువులు లేదా పాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. టీకాలు వేయాల్సిన తేదీలు, మందులు ఇవ్వాల్సిన సమయాల గురించి కూడా యాప్‌లు గుర్తు చేస్తాయి.

వ్యాధుల నియంత్రణలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర
పశువుల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే డిజిటల్ పరికరాలు వెంటనే హెచ్చరికలు పంపిస్తాయి. దీంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపించకముందే అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పశువుల మరణాలు తగ్గడమే కాకుండా రైతులు ఆర్థిక నష్టాల నుంచి కూడా రక్షించబడతారు.

పశువైద్య సేవలు – ఈ-సంజీవని:
దూర ప్రాంతాల్లోని రైతులకు పశువైద్యుల సలహాలు, సూచనలు అందించడానికి టెలి-మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ చేసి వ్యాధులను నిర్ధారించి, చికిత్స అందించవచ్చు.

మార్కెట్ అవకాశాల విస్తరణ- డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం పొందుతున్నారు.
దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తులకు సరైన ధర లభిస్తుంది. మార్కెట్ సమాచారం సులభంగా అందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపుల వల్ల డబ్బు లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరుగుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల యాంటీబయాటిక్స్ అవసరానికి మించి వాడాల్సిన అవసరం తగ్గుతుంది. నీరు, మేత వంటి వనరుల వృథా తగ్గుతుంది. పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు
అయితే ఈ మార్పుల మధ్య కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం. డిజిటల్ పరిజ్ఞానం కొంతమందికి తక్కువగా ఉండటం. ఆధునిక పరికరాల ధరలు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రైతులందరూ ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు.
అందుకే రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.

ముగింపు
డిజిటల్ టెక్నాలజీ సంప్రదాయ పశుపోషణ పద్ధతులను తొలగించడం లేదు. వాటిని మరింత మెరుగుపరుస్తోంది. రైతుల అనుభవానికి ఆధునిక సాంకేతికత తోడవడంతో పశుపోషణ మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతోంది. ఆరోగ్యకరమైన పశువులు, అధిక ఆదాయం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో పశుపోషణలో డిజిటల్ సాధనాలు కూడా భూమి, నీరు, మేతల మాదిరిగానే అవసరమైనవిగా మారనున్నాయి.
ఈ డిజిటల్ విప్లవం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వల్ల పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయి. యువత కూడా ఈ ఆధునిక పశుపోషణ పట్ల ఆసక్తి చూపుతున్నారు.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్‌సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. Ph: 9703121088

Read More

యుద్ధం వలన గుడ్ల ఎగుమతులకు దెబ్బ

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పది రోజులుగా రోజుకి రూ. 4 కోట్ల విలువైన గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో తెలంగాణా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గుడ్లు కార్గో ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. బయటి నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం విపణిలో హోల్‌సేల్‌గా ఒక గుడ్డు ధర రూ.4.20 ఉండగా, రిటైల్ రూ. 5కు అమ్ముతున్నారు. మరోవైపు రిటైల్ అమ్మకందారులు తమ షాపుల్లోనే ఎక్కువగా ఉన్నాయని, కొత్తగా ఆర్డర్లు తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో పౌల్ట్రీఫాం యజమానులు, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. ఇది పౌల్ట్రీ రంగానికి ఊహించని ఉత్పాతమని తెలంగాణ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read More

కొబ్బరికి యుద్ధం దెబ్బ

కొబ్బరి సాగుకు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక పెట్టింది పేరు. తమిళనాడు, ఏపీల నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధ ప్రభావం దేశం లోని కొబ్బరి మార్కెట్‌పై పడింది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో కువైట్, ఒమన్, దుబాయ్, ఇరాన్, సౌదీలకు ఎగుమతి చేసేందుకు కాయలను సిద్ధం చేశారు. అయితే యుద్ధం నేపథ్యంలో ముంబయి, చెన్నై, తూత్తుకూడి పోర్టుల్లోనే కాయలతో కంటెయినర్లు నిలిచిపోయాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. ఆయా దేశాలకు ఎగుమతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా ఓడరేవుల్లో ఉన్న సరకును స్థానికంగా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కొబ్బరి ధరల పతనం..: గత నెలలో శివరాత్రి సందర్భంగా కోనసీమ కొబ్బరి మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. వెయ్యి పచ్చి కాయలు రూ.18-20 వేలు పలికాయి. కురిడీల ధరలూ బాగానే ఉన్నాయి. శ్రీరామనవమికి దేశవ్యాప్తంగా మంచి ధర వస్తుందని వ్యాపారులు ఆశించారు. ఓడరేవుల ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లే కొబ్బరికాయలు అక్కడే నిలిచిపోవడంతో ధరలపై ప్రభావం చూపింది. దీంతో ప్రస్తుతం వెయ్యి కాయలు రూ.13-14 వేలకు పతనమయ్యాయని మార్కెట్ విశ్లేషకుడు అప్పన కాళీప్రసాద్ తెలిపారు.

Read More

71.86 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

తెలంగాణాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో సన్నధాన్యం 39.08 లక్షల టన్నులు కాగా, దొడ్డు ధాన్యం 32.78 లక్షల టన్నులు. సన్న ధాన్యం రైతులకు క్వింటాకు రూ.500 అదనంగా చెల్లించారు. కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,448 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సాగు పెరగడంతో పాటు ఇటు పీపీసీలకు సన్నాలు భారీగా వచ్ౘ్ాయి. సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నుల్ని పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించింది. 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్న ధాన్యాన్ని విక్రయించగా.. ఇందులో 99.25% మంది అన్న దాతలకు ప్రభుత్వం సోమవారం నాటికి రూ.1,939.58 కోట్లను బోనస్‌గా అందించింది. మరో రూ.14.62 కోట్లు చెల్లించాల్సి ఉంది.

Read More

తెలంగాణాకు వెన్నెముక రైతులే

హైదరాబాదులో నిన్న ప్రారంభమయిన గ్లోబల్‌ సదస్సులో ”విలువ ఆధారిత ఉత్పత్తుల గొలుసు విధానం-రైతుల ఆదాయం రెట్టింపు” అనే అంశంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. అనంతరం మీడియాతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”తెలంగాణకు వెన్నెముక రైతులే. జనాభాలో ఎక్కువ మంది జీవనోపాధికి సేద్యం వనరుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు సంక్షేమం, పురోగతికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. గత రెండేళ్లలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. లక్ష కోట్లు వెచ్చించాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయం, దాని అనుబంధ ఆర్థిక వ్యవస్థ దాదాపు 34.6 బిలియన్‌ డాలర్లు. 2047 నాటికి దీనిని 400 బిలియన్‌ డాలర్లకు పెంచాలనేది లక్ష్యం. ఆ స్థాయిలో వృద్ధి సాధించడానికి స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌, రంగాల వారీ వ్యూహంతో పనిచేస్తున్నాం. అధిక విలువ కలిగిన పంటల సాగు, ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటల్‌ వ్యవసాయం, డ్రోన్లు, యాంత్రీకరణ, మార్కెట్‌ లింకేజీలు, ఈ-ట్రేడింగ్‌ బలోపేతం, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, విలువ ఆధారిత ఉత్పత్తులు, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీ.. లాజిస్టిక్‌ వ్యవస్థలు, సహకార సంస్థలు, వ్యవసాయ స్టార్టప్‌ల బలోపేతం, రైతు భరోసా, పంటలబీమా, వ్యవసాయ యంత్రాలకు రాయితీ, ఆహార శుద్ధి జోన్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడతాం. ఇవి రైతుల ఆదాయాలను పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి సహాయపడతాయి. పొలం నుంచి మార్కెట్‌ వరకు మార్కెట్‌ ఆధారిత గొలుసు వ్యవస్థలను నిర్మించడం, గిట్టుబాటు ధరలను నిర్ధారించడం, వృథాను తగ్గించడం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాం’ అని తెలిపారు. చర్చలో భారత వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎ.కె.సింగ్‌, ఆసియా అభివృద్ధి బ్యాంకు సలహాదారు శ్రీనివాసన్‌, ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత మోదడుగు విజయ్‌ గుప్తా, కోసాంబ్‌ ఎండీ జె.ఎస్‌. యాదవ్‌, ఆదిత్య బిర్లా గ్లోబల్‌ ట్రేడింగ్‌ ఎండీ, సీఈవో రాజేష్‌ సోమాని, వ్యవసాయ పరిశోధన సంస్థ మాజీ అధిపతి డాక్టర్‌ సమరేందు మహంతి, మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్‌ అధ్యకక్షుడు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More