రైతుమేళాలో ఆధునిక పరికరాల ప్రదర్శన

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండురోజుల రైతుమేళా రాజేంద్రనగర్‌లోని క్రీడా ప్రాంగణంలో ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మానవరహిత వ్యవసాయ ప్రాజెక్టులో భాగంగా అగ్రివర్సిటీ సాంకేతిక కేంద్రం, ఇంజినీరింగ్ విభాగం, అగ్రి రోబోటిక్స్, ఐవోటీ సొల్యూషన్స్ ఫర్ అగ్రికల్చర్ (అరిసా) కేంద్రం రూపొందించిన రోబోలు, ఫార్మ్ రోబోలు, ఆధునిక యంత్ర పరికరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితోపాటు అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు, సేంద్రియ ఎరువులు, చిరుధాన్య ఉత్పత్తులకు సంబంధించి మొత్తం 102 స్టాళ్లను ఏర్పాటు చేయగా రైతులు భారీగా తరలివచ్చారు. ప్రధానంగా రూ.14 లక్షల విలువైన మెగాస్ప్రేయర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరి నారును పొలంలో సమాన దూరంలో నాటే రైస్ ట్రాన్స్‌ప్లాంటర్ కూడా ఆకట్టుకుంది. భారత వరి పరిశోధన సంస్థ(ఐఐఆరఆర్) అభివృద్ధి చేసిన అధిక దిగుబడి విత్తన రకం డీఆరఆర్ ధాన్ 75, ఇతర రకాలను భారీగా కొనుగోలు చేశారు. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్) చిరుధాన్యాల రకాలు, ఆహారాల తయారీ విధానాలు, యంత్రాలను ప్రదర్శించింది. ఉద్యానశాఖ నూతన విత్తన రకాలు, పౌల్ట్రీ డైరెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కొత్త కోళ్ల రకాలు, దాణా, కమ్యూనిటీ సైన్స్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన సహజ ఆహార పదార్థాలను రైతులు కోనుగోలు చేశారు.

మహిళా రైతులకు త్వరలో డ్రోన్లు

తెలంగాణలో రైతులు కోటీశ్వరులు కావాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వర్సిటీ, వ్యవసాయ శాఖ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మెగా రైతు మేళాను పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి తుమ్మల ప్రారంభించారు. ‘వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు భవిష్యత్తులో డ్రోన్‌లు ఇస్తాం. డిమాండ్‌కు అనుగుణంగా పంటమార్పిడి, సహజ వ్యవసాయ విధానాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం’ అని తుమ్మల తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘రైతులు అధునాతన నైపుణ్యాలు, సాంకేతికతను వినియోగించుకొని ఉత్పత్తులను పెంచాలి. అగ్రివర్సిటీ నూతన వంగడాలను రైతులకు అందుబాటులోకి తేవాలి’ అని సూచించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ‘ఆహార ఉత్పత్తిలో మహిళలది ప్రధాన పాత్ర. వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో భాగస్వామ్యం కల్పించేలా కృషి చేస్తున్నాం’ అన్నారు.

Read More

జాతీయ పురస్కారం అందుకున్న పార్వతీపురం శాస్త్రవేత్త

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం చప్పబుచ్చింపేట గ్రామానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డా. వైకుంఠపు పాపారావుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌లో రాష్ట్రీయ కృషి విజ్ఞాన జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఐసీఏఆర్‌ స్థాపన దినోత్సవం సందర్భంగా దిల్లీలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.

Read More

వ్యవసాయ పరిశోధన సంచాలకుడు బలరామ్‌ ఆవిష్కరించిన హైబ్రిడ్‌ వరి విత్తనోత్పత్తికి మూడు దేశాల పేటెంట్‌

హైబ్రిడ్‌ వరి పరిశోధనలో నూతన ఆవిష్కరణకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు మరాఠి బలరామ్‌ మూడు దేశాల పేటెంట్లను పొందారు. ఇప్పటికే ఆయనకు భారత్‌తోపాటు అమెరికాలో పేటెంట్‌ లభించింది. తాజాగా ఫిలిప్పీన్స్‌ నుంచి పేటెంట్‌ పొందారు. బలరామ్‌ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఐఆర్‌ఆర్‌ఐ)లో ఫెలోషిప్‌ సందర్భంగా పరిశోధన చేపట్టారు. ఆఫ్రికాలో ఏడాదికి పైగా పండే వరి పంట రకాన్ని తీసుకొని దాని జీవకణాన్ని మరో మొక్కతో పరపరాగ సంపర్కం ద్వారా కొత్త హైబ్రిడ్‌ రకాన్ని కనుగొన్నారు. దీనికి 2020లో అమెరికా పేటెంట్‌ లభించగా.. 2023లో భారత్‌లో పేటెంట్‌ వచ్చింది. తాజాగా బుధవారం ఆయనకు పేటెంట్‌ను మంజూరు చేస్తూ ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ధ్రువీకరణపత్రాన్ని పంపింది. 2036 జూన్‌ 5 వరకు దీని కాలపరిమితి ఉంటుందని వెల్లడించింది. ఈ సందర్భంగా తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య, ఇతర ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు ఆయనను అభినందించారు.

Read More