అసాధారణ వాతావరణ పరిస్థితులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక

వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వ్యవసాయ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతదేశ వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం పై ఆధారపడి ఉంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని చేరుకొని, క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా జూన్ మొదటి లేదా రెండవ వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. రైతులు ఈ వర్షాలను ఆధారంగా చేసుకొని ఖరీఫ్ పంటల సాగును ప్రారంభిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నైరుతి రుతుపవనాల రాక ఒకటి నుండి మూడు వారాల వరకు ఆలస్యమవుతోంది. దీని కారణంగా విత్తనాల మొలక ఆలస్యం కావడం, సాగు విస్తీర్ణం తగ్గడం, నేలలో తేమ కొరత ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా, వర్షపాతం ఆలస్యంగా ప్రారంభమవడం, ఒకేసారి అధిక వర్షపాతం నమోదవడం, పంట పెరుగుదల మధ్యలో పొడి వాతావరణం (డ్రై స్పెల్స్) ఏర్పడడం, తుఫానులు, వడగాల్పులు మరియు ఉష్ణోగ్రతలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు వంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు పంటల పెరుగుదల మరియు దిగుబడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను మరియు తక్కువ వ్యవధిలో పరిపక్వత చెందే పంట రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, విత్తే సమయాల్లో అవసరమైన మార్పులు, స్వల్పకాలిక పంట రకాల వినియోగం, నేలలో తేమ మరియు నీటి సంరక్షణ చర్యల అమలు, అలాగే అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.
  1. వర్షాకాలం ఆలస్యమైనప్పుడు
    వర్షాలు జూన్ నెలలో ప్రారంభం కాక జూలై లేదా ఆగస్టు వరకు ఆలస్యం అయితే సాధారణంగా సాగు చేసే దీర్ఘకాలిక పంటలకు బదులుగా స్వల్పకాలిక పంటలను ఎంచుకోవాలి. పెసర, మినుము, ఉలవలు, నువ్వులు, జొన్న, సజ్జ, కొర్రలు వంటి పంటలు తక్కువ వ్యవధిలో పూర్తవుతాయి మరియు తక్కువ నీటితో కూడా మంచి దిగుబడిని ఇస్తాయి.
  2. మధ్యలో పొడి వాతావరణం ఏర్పడినప్పుడు
    వర్షాలు ప్రారంభమైన తరువాత కొన్ని వారాలు వర్షాభావం ఏర్పడితే నేలలో తేమను కాపాడటం అత్యంత ముఖ్యం. కలుపు నివారణ చేయడం, నేలపై మల్చింగ్ చేయడం, అంతరకృషి నిర్వహించడం, అవసరమైతే జీవరక్షక నీటిపారుదల ఇవ్వడం ద్వారా పంటను రక్షించవచ్చు.
  3. అధిక వర్షాలు కురిసినప్పుడు
    భారీ వర్షాల వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే బయటకు వెళ్లేలా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలి. నీరు నిల్వ ఉండటం వల్ల వేరుకుళ్లు, శిలీంధ్ర వ్యాధులు మరియు పోషక లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అవసరమైన మొక్కల సంరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి.
  4. వర్షాలు ముందుగానే ముగిసినప్పుడు
    వర్షాకాలం త్వరగా ముగిసి నేలలో తేమ తగ్గినప్పుడు తక్కువ కాలంలో పూర్తయ్యే పంటలు లేదా రబీ సీజన్‌లో తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలి. నేలలో తేమను సంరక్షించేందుకు మల్చింగ్, కన్జర్వేషన్ టిల్లేజ్ వంటి పద్ధతులు ఉపయోగించాలి.
  5. దీర్ఘకాలిక కరవు పరిస్థితులు: పంట ఎదుగుదల దశలో వర్షాలు ఆగిపోతే, మొక్కల సంఖ్యను తగ్గించి, కలుపును తీసివేసి వాటిని నేలపై కప్పి ఉంచడం) ద్వారా తేమను కాపాడుకోవాలి. నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను (అలసందలు వంటివి) సాగు చేయడం మేలు.

ప్రత్యామ్నాయంగా సాగు చేయదగిన పంటలు
• వేరుశెనగకు బదులుగా – పెసర, నువ్వులు, ఉలవలు
• వరికి బదులుగా – జొన్న, సజ్జ, రాగులు
• పత్తికి బదులుగా – పెసర, మినుము, నువ్వులు
• మొక్కజొన్నకు బదులుగా – జొన్న, కొర్రలు, సజ్జ

రైతులు పాటించాల్సిన ముఖ్య సూచనలు
• వాతావరణ శాఖ సూచనలను ప్రతిరోజూ గమనించాలి.
• స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలి.
• ధృవీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలి.
• వర్షపు నీటిని సంరక్షించే చర్యలు చేపట్టాలి.
• పంటల బీమా పథకాలలో నమోదు చేసుకోవాలి.
• సమగ్ర పంట నిర్వహణ పద్ధతులను అనుసరించాలి.

నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల మొక్కల ఎదుగుదల మెరుగుపడి, వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు నిలదొక్కుకుని మంచి దిగుబడిని ఇస్తాయి.

• వేసవి దుక్కి: వేసవిలో లోతుగా దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే కలుపు మొక్కలు మరియు కొన్ని కీటకాల సమస్య కూడా తగ్గుతుంది.
• వాలు ప్రాంతాల్లో భూమి సమోన్నత రేఖలకు అనుగుణంగా దున్నడం వల్ల వర్షపు నీటి ప్రవాహం తగ్గి నేల కోత నివారించబడుతుంది.
• పొలాన్ని చిన్న చిన్న గట్లుగా విభజించడం ద్వారా వర్షపు నీరు పొలంలోనే నిలిచి నేలలోకి ఇంకుతుంది.
• మల్చింగ్: పంట అవశేషాలు, గడ్డి లేదా ప్లాస్టిక్ మల్చ్ను నేలపై పరచడం ద్వారా నేల నుంచి నీటి ఆవిరీభవనం తగ్గి తేమ ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుంది.
• అంతరకృషి: పంటల మధ్య తేలికగా దున్నడం వల్ల నేలపై ఏర్పడే గట్టి పొర తొలగి నీటి చొరబాటు మెరుగుపడుతుంది మరియు తేమ నష్టం తగ్గుతుంది.
• సమయానికి కలుపు నివారణ: కలుపు మొక్కలు నేలలోని తేమను ఎక్కువగా వినియోగిస్తాయి. కాబట్టి వాటిని తొలగించడం ద్వారా ప్రధాన పంటకు తేమ ఎక్కువగా అందుతుంది.
• వెడల్పు వరుసల సాగు: నీరు సులభంగా చొరబడేలా వెడల్పు బెడ్లు మరియు కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిల్వ, పారుదల రెండూ మెరుగుపడతాయి.
• సేంద్రీయ పదార్థాల వినియోగం పశువుల ఎరువు, కంపోస్ట్, పంట అవశేషాలను నేలలో కలపడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది.

ప్రస్తుత వాతావరణ మార్పులు వ్యవసాయానికి ప్రధాన సవాలుగా మారాయి. అయితే అసాధారణ వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, తగిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయడం ద్వారా రైతులు పంట నష్టాలను తగ్గించుకొని స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం, వాతావరణ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం మరియు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు.

ఇ. ప్రియాంకబాయి, రిసెర్చ్ అసోసియేట్, యాజమాన్య విభాగము,
వ్యవసాయ పరిశోధన స్థానం, కదిరి. ఫోన్ : 7674886216

Read More

ఎల్ నినో పరిస్థితుల్లో రైతు ఆదాయ స్థిరత్వానికి వ్యూహాలు: అనుకూల పంటల ఎంపిక మరియు వ్యవసాయ రికార్డుల నిర్వహణ

భారతదేశ జనాభాలో సుమారు 68.84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, మొత్తం శ్రామిక శక్తిలో 54.6 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో కూడా సుమారు 61.12 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, దాదాపు 55 శాతం మంది వ్యవసాయ రంగంతో అనుసంధానమై ఉన్నారు. వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో 86 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ కమతాలు చిన్న మరియు సన్నకారు వర్గాలకు చెందుతాయి.

తెలంగాణ వ్యవసాయం నీటిపారుదల మరియు వర్షాధార వ్యవసాయ వ్యవస్థల సమ్మేళనంగా ఉండి, వర్షపాతం వ్యవసాయాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇటీవలి సంవత్సరాల్లో సాగునీటి వసతులు పెరిగినప్పటికీ, వాతావరణ మార్పులు రైతుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీసుకునే ప్రతి పంట నిర్ణయం కుటుంబ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షపాతం అస్థిరంగా ఉండే సంవత్సరాలలో పంటల ఎంపిక మరింత కీలకంగా మారుతుంది. ఎల్నినో (Elnino) వంటి వాతావరణ పరిస్థితులు వర్షపాతాన్ని ప్రభావితం చేసి వ్యవసాయ ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో సాధారణంగా రుతుపవనాల బలహీనత, సగటు కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. 2025-26 సంవత్సరానికి కూడా వాతావరణ పరిస్థితులపై ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశాలపై వివిధ వాతావరణ సంస్థలు సూచనలు చేస్తున్నాయి.

తెలంగాణలోని ప్రధాన పంటలు మరియు వాటిపై ఎల్ నినో ప్రభావం
వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2025 వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో వరి పంట 50.57 శాతం వాటాతో ప్రథమ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో పత్తి 34.52 శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించింది. ఈ గణాంకాలు రాష్ట్ర వానాకాల పంటల సరళిలో వరి మరియు పత్తి పంటల ప్రాబల్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఎల్నినో వంటి వాతావరణ అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు కేవలం సంప్రదాయ పద్ధతిలో వరి సాగుపైనే ఆధారపడకుండా, నీటి లభ్యత తక్కువగా అవసరం ఉన్న కందులు, పెసర వంటి పప్పుధాన్యాలు లేదా స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన గణాంకాల ప్రకారం, ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో (2014-15 మరియు 2015-16) తెలంగాణలో ప్రధాన పంటల నికర ఆదాయంలో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి.

2015-16 తీవ్రమైన ఎల్ నినోలో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. వరి (-14007.72), మొక్కజొన్న – 11373.53), పత్తి (-10908.38), కందులు (-9818.09), పెసర (-5207.97) పంటలన్నింటిలోనూ నికర ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఇది తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పంటలు ఎంతగా దెబ్బతింటాయో సూచిస్తుంది. అదే విధంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు వర్షాభావాన్ని తట్టుకొని రైతులకు నష్టాలను తగ్గించే అవకాశాన్ని కల్పించాయి. దీనినిబట్టి ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో అన్ని పంటలు ఒకే విధంగా ప్రభావితమవలేదని గమనించవచ్చు. కొన్ని సంవత్సరాలలో వరి అత్యధిక నష్టాలను చవిచూడగా, కొన్ని ప్రత్యామ్నాయ పంటలు లాభాలను మరియు తక్కువ నష్టాలను నమోదు చేశాయి.

అదేవిధంగా పంటల ఎంపికలో కూడా ఒకే సూత్రం అందరికీ వర్తించదు. రైతు నేల స్వభావం, నీటి వనరులు, గత అనుభవం, మార్కెట్ పరిస్థితులు మరియు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా తీసుకోవడానికి వ్యవసాయ రికార్డులు ఎంతో ఉపయోగపడతాయి. గత సంవత్సరాలలో ఏ పంటకు ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత ఆదాయం లభించింది, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంట మెరుగ్గా నిలిచింది వంటి వివరాలు రికార్డుల ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.

దీనికోసం రైతు పొలంలో జరిగే వివిధ కార్యకలాపాలకు వేర్వేరు రికార్డులు అవసరం. రైతు నిర్వహించుకోదలచిన ముఖ్యమైన రికార్డు రకాలు ఇవి:

  1. వ్యవసాయ దినచర్య రికార్డు
  2. పంటల వారీ ఖర్చు-ఆదాయ రికార్డు
  3. ఎరువుల వినియోగ రికార్డు
  4. పురుగుమందుల వినియోగ రికార్డు
  5. కార్మికుల వినియోగ రికార్డు
  6. యంత్రాల వినియోగ రికార్డు
  7. నీటి వినియోగ రికార్డు
  8. దిగుబడి రికార్డు
  9. పశుసంవర్ధక రికార్డు
  10. నిల్వ మరియు విక్రయాల రికార్డు

ప్రస్తుతం తెలంగాణలోని అభ్యుదయ రైతులు కొంతమంది ప్రధానంగా కాగితపు రికార్డుల ద్వారానే వ్యవసాయ సమాచారాన్ని నమోదు చేసి భద్రపరుస్తున్నారు. అయితే, కాలానుగుణంగా అందుబాటులోకి వచ్చిన వివిధ ఆధునిక పద్ధతులను కూడా వినియోగించి వ్యవసాయ రికార్డులను మరింత సమర్థవంతంగా భద్రపరచుకోవచ్చు. వీటిలో సంప్రదాయ కాగితపు పద్ధతులతో పాటు డిజిటల్ రికార్డు పద్ధతులు, స్మార్ట్ఫోన్ ఆధారిత పద్ధతులు మరియు ప్రభుత్వ డిజిటల్ వేదికలు ముఖ్యమైనవి. ఈ పద్ధతుల వివరాలు క్రింది చిత్రంలో చూపించబడ్డాయి.

వివిధ వ్యవసాయ రికార్డుల పద్ధతులు
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం గల అనుకూల పంటలను ఎంపిక చేసి సాగు చేయడం రైతుల ఆదాయ స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వాతావరణ మార్పులు మరియు వర్షాభావ పరిస్థితుల ప్రభావాలను తగ్గించడంలో ముఖ్యమైన వ్యూహంగా నిలుస్తుంది. అదే సమయంలో, పంటల ఎంపిక, ఖర్చులు, దిగుబడులు, ఆదాయం మరియు వనరుల వినియోగానికి సంబంధించిన వ్యవసాయ రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచడం ద్వారా రైతులు గత అనుభవాలను విశ్లేషించి భవిష్యత్ సాగు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా మరియు సమర్థవంతంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల, అనుకూల పంటల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ రికార్డుల నిర్వహణ కూడా వాతావరణ అనిశ్చితులను ఎదుర్కొంటూ స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయాభివృద్ధికి కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.

డా. డి. ఎ. రజిని దేవి, సహాయ ప్రొఫెసర్, వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం, వ్యవసాయ కళాశాల,రాజేంద్రనగర్
డా. కె. శేఖర్, సహాయ ప్రొఫెసర్, సేద్య విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ఫోన్: 9032128184

Read More

తెలంగాణా రాష్ట్రానికి వ్యవసాయ పథకాల్లో రూ.51 కోట్ల కోత

తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర నిధుల కేటాయింపులో పోలిస్తే రూ.51 కోట్ల మేర కోత పడింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మసాగునీరు, భూసార ఆరోగ్య నిర్వహణ, వర్షాధార ప్రాంత అభివృద్ధి, డిజిటల్ వ్యవసాయం, వెదురు అభివృద్ధి పథకం, సహజ వ్యవసాయం తదితర కేంద్ర పథకాల కింద రాష్ట్రంలో ఏటా రూ.1,439.49 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇందులో 60 శాతం వాటా కింద కేంద్రం రూ.871.15 కోట్లు విడుదల చేస్తోంది. ఆదివారం ప్రవేశ పెట్టిన 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.820 కోట్లు మాత్రమే పేర్కొన్నారు. రూ.51 కోట్ల మేర తగ్గించారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయాధికారులు సంప్రదించగా… ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజనలో కొన్ని కేంద్ర పథకాలను విలీనం చేయడంతో రాష్ట్రానికి నిధులు తగ్గాయని కేంద్ర అధికారులు సమాచారం ఇచ్చారు.
సీఎం ధన్-ధాన్య కృషి యోజన అమలుకు తెలంగాణ రాష్ట్రంలో జనగామ, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలు ఎంపికయ్యాయి. దీనికింద ఏటా రూ.160 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ. 960 కోట్లు వెచ్చిoచాలని కేంద్రం నిర్దేశించింది. దీనిలో 31 పథకాలను విలీనం చేయగా.. అందులో తెలంగాణలో అమలయ్యే ఆరు పథకాలున్నాయి. వాటన్నింటినీ ఒకే పద్దుగా నిధులు కేటాయించడంతో రాష్ట్రానికి రూ.50 కోట్ల మేర తగ్గినట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ధన్-ధాన్య పథకానికి అదనంగా నిధులు వస్తాయని భావిస్తుండగా… ఉన్నవాటిలో కోత విధించడంపై వ్యవసాయాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాయనున్నారని తెలిపారు.

Read More