ద్వితీయ వ్యవసాయం – రైతుకు అదనపు ఆదాయం అందించే బంగారు బాట

“పంట ఒక్కటే కాదు… పంటతో పాటు మరెన్నో ఆదాయ మార్గాలు ఉన్నాయి”

ఈరోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగా పంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండవు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి.
ఇదే భావనతో ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు శాస్త్రవేత్తలు “ద్వితీయ వ్యవసాయం (Secondary Agriculture)” అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.

ద్వితీయ వ్యవసాయం అంటే ఏమిటి?
పొలంలో పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను శుభ్రపరచడం, ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు.

సరళంగా చెప్పాలంటే…
“పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవడమే ద్వితీయ వ్యవసాయం.”

  1. పంటలకు విలువ జోడించండి – ఎక్కువ ధర పొందండి
    చాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేస్తారు. అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది.
    వరిని బియ్యంగా మార్చడం ,బియ్యంతో అటుకులు, మురమురాలు తయారు చేయడం ,వేరుశెనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం ,మిరపతో మిరప పొడి తయారు చేయడం ,పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం , మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం.దీనివల్ల రైతు సాధారణంగా పొందే ఆదాయం కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం అనేది ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన మరియు స్థిరమైన రంగం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే రైతులు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మహిళా సంఘాలు, యువ రైతులు, FPOలు మరియు గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఇది ఉపాధి కల్పించడంతో పాటు, పోషకాహార భద్రతను మెరుగుపరచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అందువల్ల చిరుధాన్యాల విలువ జోడింపును ద్వితీయ వ్యవసాయం అభివృద్ధికి ఒక ప్రధాన వ్యూహంగా ప్రోత్సహించడం అవసరం.
  2. కోత అనంతర నష్టాలను తగ్గించండి
    భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో కోత అనంతరం గణనీయమైన నష్టం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం.

రైతులు ఈ చర్యలు పాటించాలి:
పంటను బాగా ఆరబెట్టాలి, నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేయాలి ,తేమ రాకుండా నిల్వ చేయాలి, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ ఉపయోగించాలి, శుభ్రమైన సంచుల్లో ప్యాకింగ్ చేయాలి.

  1. గ్రామంలోనే చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి
    గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది.అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.
    చిన్న పరిశ్రమలు : రైస్ మిల్లు, నూనె గానుగ , పప్పు మిల్లు, పిండి మిల్లు , మసాలా తయారీ, పండ్ల ప్రాసెసింగ్
  2. పాల ఉత్పత్తుల ద్వారా ప్రతిరోజూ ఆదాయం
    రైతు ఇంట్లో ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు ఆదాయం వస్తుంది.
    పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్
    తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది.పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి.
  3. తేనెటీగల పెంపకం – తేనెతో పాటు పంట దిగుబడీ పెరుగుతుంది
    తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు.
    దీని ద్వారా తేనె , బీస్‌వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి.
    అంతేకాదు, తేనెటీగలు పరాగసంపర్కం చేయడం వల్ల ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు, పండ్ల పంటల దిగుబడి బాగా పెరుగుతుంది.
  4. పుట్టగొడుగుల సాగు – చిన్న గదిలో పెద్ద ఆదాయం
    వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషాలను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు.
    చిన్న గదిలోనే సాగు చేయవచ్చు.ఈ వ్యాపారం మహిళలకు, యువతకు , స్వయం సహాయక సంఘాలకు
    అత్యంత అనుకూలంగా ఉంటుంది.
  5. చేపల పెంపకం – నీటి వనరులతో అదనపు ఆదాయం
    వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్ పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు.
    వరి సాగుతో పాటు చేపల పెంపకం (Rice-Fish Farming) చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయం పొందవచ్చు.
  6. పశుపోషణ – రైతుకు నమ్మకమైన ఆదాయం
    వ్యవసాయం మరియు పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి.
    పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి.
    పశువుల పేడ : వర్మీకంపోస్ట్ ,బయోగ్యాస్ ,సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
  7. కోళ్ల పెంపకం – తక్కువ పెట్టుబడి, త్వరగా ఆదాయం
    పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బతింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. గుడ్లు, మాంసం సొంత అవసరాల వినియోగానికే కాకుండా అమ్మకాలతో ఆదాయం కూడా పొందవచ్చు. గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా మార్కెట్ ఉంటుంది. చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా విస్తరించవచ్చు. గిరిరాజ, వనరాజ, గ్రామ ప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలు రకం కోడి పిల్లలను పెంచుకోవచ్చు

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75-80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే.. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవ త్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే. సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

  1. వ్యవసాయ వ్యర్థాలను సంపదగా మార్చండి
    చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవశేషాలను కాల్చివేస్తారు.
    అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్ , కంపోస్ట్ ,బయోగ్యాస్ ,బయోచార్ ,పుట్టగొడుగుల సాగు , పశుగ్రాసం తయారు చేయవచ్చు. ఇది పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుతుంది.
  2. పూలు, ఔషధ మొక్కలు – తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం
    మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
  3. నర్సరీలు మరియు విత్తన ఉత్పత్తి
    నాణ్యమైన నారు మొక్కలు, ధృవీకరించిన విత్తనాలకు రైతుల్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. కూరగాయల నారు , పండ్ల మొక్కలు, పూల మొక్కలు ,అటవీ మొక్కలు తయారు చేసి విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

స్వపరాగసంపర్క పంటల్లో వరి , శనగ ,పెసర , మినుము ,ఉలవలు మరియు వేరుశెనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. ధృవీకరించిన విత్తన ఉత్పత్తి, శుభ్రపరచడం, గ్రేడింగ్, విత్తన శుద్ధి, ప్యాకింగ్, బ్రాండింగ్ వంటి విలువ జోడింపు చర్యలను చేపట్టడం ద్వారా రైతులు సాధారణ ధాన్యం విక్రయంతో పోలిస్తే అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇది రైతుల ఆర్థికాభివృద్ధికి, గ్రామీణ ఉపాధి పెంపుకు మరియు నాణ్యమైన విత్తనాల లభ్యతకు ముఖ్యమైన సాధనంగా నిలుస్తుంది.

  1. అగ్రో టూరిజం – వ్యవసాయాన్ని ఆదాయ వనరుగా మార్చండి
    ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభవించడానికి ఆసక్తి చూపుతున్నారు.
    రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు , గ్రామీణ ఆహారం ,పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
  2. రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడే అనుబంధ ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలు:
    టెర్రస్ వ్యవసాయం (Terrace Farming) : ఇళ్ల పైకప్పులపై (Terrace) కుండీలు, గ్రో బ్యాగులు, ట్రేలు లేదా ఎత్తైన బెడ్లలో కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, పూలు మరియు ఔషధ మొక్కలను సాగు చేయడాన్ని టెర్రస్ వ్యవసాయం అంటారు. పట్టణ ప్రాంతాల్లో భూమి కొరత ఉన్నప్పటికీ, పైకప్పు స్థలాన్ని సద్వినియోగం చేసుకొని తాజా, సురక్షితమైన మరియు రసాయన అవశేషాలు తక్కువగా ఉండే కూరగాయలను ఉత్పత్తి చేయవచ్చు. టెర్రస్‌లో పండించిన ఉత్పత్తులను సేంద్రియ కూరగాయలుగా విక్రయించడం, నారు మొక్కలు తయారు చేసి అమ్మడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం, విలువ జోడింపు చేసి ప్యాకింగ్ చేయడం
    ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.

కిచెన్ గార్డెన్ (Kitchen Garden / పోషక తోట)
ఇంటి పరిసరాల్లో లేదా పెరట్లో కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధ మొక్కలను పండించే తోటను కిచెన్ గార్డెన్ లేదా పోషక తోట అంటారు.
దీని ప్రధాన లక్ష్యం కుటుంబానికి ఏడాది పొడవునా తాజా పోషకాహారాన్ని అందించడం.

పండించే పంటలు : టమాట, వంకాయ, బెండ, మిరప, పాలకూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, మునగ, బొప్పాయి

కిచెన్ గార్డెన్ ద్వారా ఉత్పత్తి చేసిన అదనపు కూరగాయలు, నారు మొక్కలు లేదా విత్తనాలను విక్రయించడం ద్వారా కుటుంబానికి అదనపు ఆదాయం లభిస్తుంది. అలాగే ఇంట్లో తయారుచేసిన కంపోస్ట్, వర్మీకంపోస్ట్, జీవామృతం వంటి సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది.

ప్రభుత్వ పథకాల వినియోగం
రైతులు ఈ పథకాల ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు.
• ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం (PMFME)
• వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (Agriculture Infrastructure Fund)
• జాతీయ తేనెటీగల మరియు తేనె మిషన్
• డెయిరీ అభివృద్ధి పథకాలు
• NABARD గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు

నేటి వ్యవసాయ పరిస్థితుల్లో “పంట పండించడం మాత్రమే కాదు… పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం.” ద్వితీయ వ్యవసాయం ద్వారా రైతులు పంటలతో పాటు పాలు, తేనె, పుట్టగొడుగులు, చేపలు, కోళ్లు, సేంద్రియ ఎరువులు, ప్రాసెసింగ్ ఉత్పత్తులు, నర్సరీలు వంటి అనేక ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబానికి సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల ప్రతి రైతు తన వ్యవసాయానికి అనువైన కనీసం ఒకటి లేదా రెండు ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టి “ఉత్పత్తిదారుడు” నుండి “వ్యవసాయ పారిశ్రామికవేత్త”గా ఎదగడానికి కృషి చేయాలి.”వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం” అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

డా. కె.తేజస్వర రావు మరియు డా . బి. సహదేవ రెడ్డి
ఆచార్య N G రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము

Read More

శాస్త్రీయ పద్ధతుల ద్వారా పశువుల ఎంపిక

రైతు సోదరులు, పశుపోషణలో సరైన జంతువులను ఎంపిక చేసుకోవడం అనేది లాభనష్టాలను శాసించే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. నాణ్యమైన, ఆరోగ్యకరమైన పశువులను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎంపిక చేసుకోవాలి.

  1. పాడి పశువుల ఎంపిక (ఆవులు మరియు గేదెలు)
    పాడి పరిశ్రమలో అధిక పాల దిగుబడి మరియు నిరంతర ఆదాయం కోసం ఆవులు, గేదెలను ఎంచుకునేటప్పుడు ఈ క్రింది శారీరక, ఉత్పాదక లక్షణాలను గమనించాలి:

ఆ. శారీరక నిర్మాణం (Body Conformation)
• త్రిభుజాకార శరీరం (Wedge Shape): మంచి పాడి పశువు వెనుక భాగం వెడల్పుగా, ముందు భాగం (తల మరియు మెడ) సన్నగా ఉండి, పక్క నుండి చూస్తే త్రిభుజాకారంలా కనిపించాలి. ఇది పాలు ఇచ్చే సామర్థ్యానికి ప్రతీక.
• చర్మం మరియు కళ్లు: చర్మం పల్చగా, మెరుస్తూ, పట్టుకుంటే వదిలేసేలా వదులుగా ఉండాలి. కళ్లు చురుగ్గా, స్పష్టంగా ఉండాలి.
• వెన్నెముక మరియు కాళ్లు: వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్లు బలంగా, నిలబడే పద్ధతి సరిగ్గా ఉండి, గిట్టలు ఎలాంటి పగుళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.

బి. పొదుగు మరియు చనుమొనల లక్షణాలు (Udder and Teats)
• పొదుగు పరిమాణం: పొదుగు పెద్దదిగా, వెనుక కాళ్ల మధ్య భాగంలో బాగా అమర్చబడి ఉండాలి. పాలు పితికిన తర్వాత పొదుగు పూర్తిగా ముడుచుకుపోవాలి (ఇది పొదుగులో కొవ్వు తక్కువగా, పాల గ్రంథులు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది).
• పాల నరాలు (Milk Veins): పొదుగు ముందరి భాగం నుండి పొట్ట కింది వరకు సాగే పాల నరాలు లావుగా, వంకరలు తిరిగి స్పష్టంగా కనిపించాలి.
• చనుమొనలు: నాలుగు చనుమొనలు సమానమైన పొడవు, లావు కలిగి, ఒకదానికొకటి సమాన దూరంలో చతురస్రాకారంలో అమరి ఉండాలి. పొదుగు గట్టిగా ఉండకూడదు (పొదుగు వాపు వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకోవాలి).

సి. వయస్సు మరియు ఈత (Age and Lactation)
• ఈత: మొదటి లేదా రెండవ ఈతలో ఉన్న పశువులను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి ఎక్కువ కాలం పాలు ఇస్తాయి.
• వయస్సు నిర్ధారణ: పశువు నోటిలోని పళ్లను చూసి వయస్సును శాస్త్రీయంగా అంచనా వేయవచ్చు. 4 నుండి 6 శాశ్వత పళ్లు (దాదాపు 3 నుండి 5 సంవత్సరాల వయస్సు) ఉన్న పశువులు కొనుగోలుకు అనువైనవి.

డి. ఇతర ముఖ్యాంశాలు
• వీలైతే పశువును కొనేముందు వరుసగా మూడు పూటల పాలు పితికి చూసి, సగటు పాల దిగుబడిని లెక్కించాలి.
• తెలంగాణ వాతావరణానికి గేదెలలో ముర్రా (Murrah) లేదా స్థానిక గ్రేడెడ్ ముర్రా, ఆవులలో జెర్సీ క్రాస్ (Jersey Cross), హెచ్.ఎఫ్ క్రాస్ (HF Cross) లేదా దేశవాళీ జాతులైన గిర్ (Gir), సాహివాల్ (Sahiwal) అనుకూలమైనవి.

  1. గొర్రెలు మరియు మేకల ఎంపిక (Sheep and Goat Selection)
    మాంసం ఉత్పత్తి మరియు పిల్లల ద్వారా లాభాలు పొందడానికి జీవాల ఎంపికలో చాలా జాగ్రత్తలు అవసరం.

ఆ. పోతు జీవాల ఎంపిక (Breeding Rams / Bucks)
మంద అభివృద్ధి అంతా పోతు జీవం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని ఎంపిక అత్యంత కీలకం.
• లక్షణాలు: పోతు జీవం చురుగ్గా, పొడవుగా, ఎత్తైన శరీరంతో, వెడల్పాటి ఛాతి కలిగి ఉండాలి.
• ప్రజనన అవయవాలు: రెండు వృషణాలు (Testicles) సమాన పరిమాణంలో, బాగా అభివృద్ధి చెంది, కిందికి వేలాడుతూ ఉండాలి. వృషణాలలో ఎలాంటి వాపులు లేదా గడ్డలు ఉండకూడదు.
• వయస్సు: 1 నుండి 1.5 సంవత్సరాల వయస్సు (రెండు పళ్ల ప్రాయం) ఉన్న పోతులను మాత్రమే ప్రజననం (దాటించడం) కోసం వాడాలి.

బి. ఆడ జీవాల ఎంపిక (Ewes / Does)
• శరీర రూపురేఖలు: ఆడ జీవాల వెనుక భాగం వెడల్పుగా ఉండాలి, ఇది సులభంగా ఈనడానికి తోడ్పడుతుంది. నోరు, దవడలు సరిగ్గా అమరి ఉండి మేతను సులభంగా నమలగలగాలి.
• సంతానోత్పత్తి చరిత్ర: త్వరగా ఎదకు వచ్చేవి, తక్కువ వ్యవధిలో ఈనేవి మరియు ఒకే ఈతలో రెండు పిల్లలను (ముఖ్యంగా మేకలలో) కనే హిస్టరీ ఉన్న తల్లుల నుండి వచ్చిన పిల్లలను ఎంచుకోవాలి.
• పొదుగు ఆరోగ్యం: పొదుగును తాకి చూసినప్పుడు మెత్తగా ఉండాలి. చనుమొనలు మూసుకుపోయి ఉండకూడదు.

సి. వయస్సు మరియు జాతులు
• వయస్సు: 1 నుండి 2 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ జీవాలు మొదటి ఈతకు సిద్ధంగా ఉంటాయి.
• తెలంగాణకు అనువైన జాతులు:
o గొర్రెలు: నెల్లూరు (జోడిపి, బ్రౌన్), నల్లగొండ స్థానిక జాతులు.
o మేకలు: మహబూబ్‌నగర్ లోకల్, ఉస్మానాబాదీ, తలచ్చేరి/బీటల్ క్రాస్ జాతులు.

  1. పెరటి కోళ్ల ఎంపిక (Backyard Poultry Selection)
    తక్కువ పెట్టుబడితో ఇళ్ల వద్ద, పెరట్లో కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం మరియు పోషకాహారం పొందవచ్చు.

ఆ. పిల్లల (Chicks) మరియు పెరిగే కోళ్ల ఎంపిక
• చురుకుదనం: కోడిపిల్లలు చురుగ్గా కదులుతూ, శబ్దాలకు త్వరగా స్పందిస్తూ ఉండాలి. కళ్లు ప్రకాశవంతంగా, గుండ్రంగా ఉండాలి.
• శరీర నాణ్యత: పొట్ట భాగం మెత్తగా ఉండాలి (సరిగ్గా కరగని సొన వల్ల పొట్ట గట్టిగా ఉండకూడదు). ఈకలు పొడిగా, శుభ్రంగా ఉండాలి. కాళ్లు బలంగా, నిటారుగా ఉండి ఎలాంటి వైకల్యాలు ఉండకూడదు.
• నాభి (Navel): పిల్లల నాభి భాగం పూర్తిగా ఎండిపోయి, మూసుకుపోయి ఉండాలి. తడి నాభి ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

బి. గుడ్లు పెట్టే కోళ్ల ఎంపిక (Layers)
• కలగిరి (Comb) మరియు గడ్డం (Wattles): గుడ్లు పెట్టే కోడి యొక్క కలగిరి/శిఖ పెద్దదిగా, ఎర్రగా, వెచ్చగా మరియు మెరుస్తూ ఉంటుంది. గుడ్లు పెట్టని కోళ్లలో ఇది చిన్నదిగా, తెల్లగా మారుతుంది.
• శరీర సామర్థ్యం (Pelvic Bones): కోడి వెనుక భాగంలోని తుంటి ఎముకల (Pelvic bones) మధ్య కనీసం 2 నుండి 3 వేళ్ల వెడల్పు స్థలం ఉండాలి. అలాగే తుంటి ఎముకకు, రొమ్ము ఎముక చివరి భాగానికి (Keel bone) మధ్య 3 నుండి 4 వేళ్ల ఖాళీ ఉంటే అది ఎక్కువ గుడ్లు పెట్టే మంచి కోడి అని అర్థం.
• గుభ్రం (Vent): గుడ్లు పెట్టే కోడి యొక్క గుభ్రం (మల విసర్జన ద్వారం) వెడల్పుగా, తేమగా మరియు గుండ్రంగా ఉంటుంది.

సి. మాంసం కోళ్ల ఎంపిక (Broilers/Cockerels)
• తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగే సామర్థ్యం, వెడల్పాటి రొమ్ము భాగం మరియు బలమైన తొడలు ఉన్న కోళ్లను మాంసం కోసం ఎంచుకోవాలి.

డి. తెలంగాణకు అనువైన పెరటి కోళ్ల రకాలు
• రాజశ్రీ (Rajasri), వనరాజ (Vanaraja), గ్రామప్రియ (Gramapriya) మరియు స్థానిక నాటు కోళ్లు పెరటి పెంపకానికి, తెలంగాణ వాతావరణానికి ఎంతో అనుకూలమైనవి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండి, తక్కువ మేత ఖర్చుతో ఎక్కువ గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి.

రైతులకు సాధారణ ఆరోగ్య సూత్రాలు (Health Check-list)
ఏ జంతువు లేదా పక్షిని కొనుగోలు చేసినా ఈ క్రింది ఉమ్మడి ఆరోగ్య లక్షణాలను తప్పక గమనించాలి:

  1. ఆకలి మరియు నెమరు: జంతువు మేతను బాగా తింటూ, చురుగ్గా నెమరు వేస్తూ ఉండాలి.
  2. మలమూత్ర విసర్జన: పేడ లేదా విసర్జితాలు సాధారణ రంగు, గట్టిదనం కలిగి ఉండాలి (సారగా/డయేరియా ఉండకూడదు).
  3. కళ్ల నుండి నీరు: కళ్లు, ముక్కు మరియు నోటి నుండి ఎలాంటి అసాధారణ జిగట స్రావాలు కారకూడదు.
  4. టీకాల రికార్డు: కొనుగోలు చేసే ముందే సదరు పశువులకు/జీవాలకు సకాలంలో టీకాలు (FMD, PPR, గాలికుంటు, పిడుగు రోగం, కోళ్లలో ఆర్‌.డి.వి వంటివి) వేశారో లేదో కనుక్కోవాలి.
    ఈ రకమైన శాస్త్రీయ పద్ధతులను పాటించి పశుసంపదను ఎంపిక చేసుకుంటే పశుపోషణలో నష్టాలు రాకుండా నివారించవచ్చు.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), ఫోన్: 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

కోళ్లలో మైకోప్లాస్మోసిస్ వ్యాధి / దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి (సి.ఆర్.డి)

మైకోప్లాస్మా జాతి సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధుల సమూహాన్ని “మైకోప్లాస్మోసిస్” అంటారు. ఈ జాతి సూక్ష్మజీవులు సుమారుగా 17 రకాలున్నప్పటికీ, 2-3 రకాలు మాత్రమే కోళ్లలో వ్యాధిని కలిగిస్తాయి. అవి మైకోప్లాస్మా గాలిసెప్టికం(అన్ని రకాల పక్షులకు), మైకోప్లాస్మా సైనోవి (సాధారణ కోళ్ళు, టర్కీలు, పావురాలు), మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ (ప్రధానంగా టర్కీలకు). ఈ వ్యాధిలో ప్రధానంగా శ్వాసకోశ సంబందిత లక్షణాలు గమనిస్తాము మరియు దీర్గకాలికంగా ఉంటుంది. అందువలన దీనిని దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి లేదా క్రానిక్ రేస్పిరెటరి డిసీజ్ (సి.ఆర్.డి) అని అంటారు.

అన్ని వయస్సు కోళ్ళకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. శీతాకాలం వంటి చల్లగా వుండే మాసాల్లో మరియు ఇతర వ్యాధులైనటువంటి ఇ.కోలి, పాశ్చురేల్లోసిస్, ఇన్ఫేక్ట్చువస్ బ్రోoకిటిస్, కొక్కెర తెగులు సోకినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి ఉదృతంగా ఉంటుంది. వ్యాధి సోకిన కోడి ద్వారా, కలుషితమైన గాలి ద్వారా ఆరోగ్యకరమైన ఇతర కోళ్ళకు వ్యాపిస్తుంది. షెడ్ లో కోళ్ళు కిక్కిరిసి వుండి, గాలి, వెలుతురు ప్రసరణ సరిగా లేకుండా ఉన్నప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన లిట్టర్, కోళ్ళ మూత్రం ద్వారా, కలుషితమైన దాణా,  త్రాగునీటి ద్వారా, ఇతర పక్షులు, కోడి పిల్లల బాక్సులు, పరికరాలు, గ్రుడ్ల ట్రే ల ద్వారా, టీకాలు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో పని మనుషుల ద్వారా , బ్రీడింగ్ ఫారాలలో వ్యాధి గ్రస్త పుంజుల వీర్యం ద్వారా, తల్లి కోడి అండాశయం నుండి గ్రుడ్డు ద్వారా కోడిపిల్లలకు వ్యాపిస్తుంది.

లక్షణాలు:
మైకోప్లాస్మా గాలిసెప్టికం బారిన పడిన బ్రాయిలర్ కోళ్లలో 4 వారాల తరువాత మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి బారిన పడిన లేయర్ కోళ్లలో వ్యాధి మెల్లగా వ్యాపిస్తుంది. సూక్ష్మక్రిమి కోళ్ళ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 11-18 రోజుల్లో లక్షణాలు కనబడతాయి. ప్రప్రథమంగా శ్వాసకోశ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. అందులోను మొదటగా శ్వాసనాళo పైభాగం ఆశించడం వలన శ్వాస తీసుకోవడం కష్టతరమై కోళ్ళు తల పైకెత్తి గాలి పీల్చుకుంటాయి. అలా శ్వాస తీసుకుంటున్నప్పుడు కూతలు కూడా వినబడుతాయి. ఆ తర్వాత సుక్ష్మక్రిమి గాలిగదులు, శ్వాసనాళం కింది భాగాన్ని ఆశించినప్పుడు గాలి గదులు వాచిపోతాయి. శ్వాసనాళంలో నెమ్ము చేరడం వలన గురక శబ్దం వస్తూ ఉంటుంది. కళ్ళు, ముక్కు నుండి నీరు కారుతూ ఉంటుంది. చిన్న పిల్లలలో 30% వరకు మరణాలు సంభవిస్తాయి. గ్రుడ్ల ఉత్పత్తి 20-30% తగ్గిపోతుంది. మేత వినియోగం తగ్గటం వలన పెరిగే కోళ్లలో పెరుగుదల రేటు తగ్గి బరువు తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలలో నీళ్ళ విరోచనాలుంటాయి. ఇంకా పెరికార్దిటిస్, పెరిటోనిటిస్, పెరిహేపటైటిస్ తరచుగా కనబడతాయి.

మైకోప్లాస్మా సైనోవి తరచుగా 4-12 వారాల కోడిపిల్లలకు, అలాగే 10-12 వారాల టర్కీకోళ్ళకు సోకుతుంది. ఇది ప్రధానంగా కీళ్ళను ప్రభావితం చేయడం వలన కీళ్ళ వాపులు, కీళ్ళ మధ్యలో మరియు టేండాన్ పొరలలో తెల్లటి చిక్కటి ద్రవం చేరి, కోళ్ళు కుంటుతూ ఉంటాయి.

మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ వ్యాధి బారిన పడిన టర్కీ కోళ్ళలో శ్వాస కష్టమవటం, తక్కువ శరీర పెరుగుదల, మెడ మరియు కాళ్ళ కీళ్ళలో వాపు, గ్రుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం, పొదిగే గ్రుడ్ల నుండి పిల్లల ఉత్పత్తి తగ్గటం, అధిక మరణాలు సంభవించడం వంటివి గమనిస్తాము.

పోస్ట్ మార్టెం చేసి చూస్తే:
శ్వాసనాళం ఫైభాగంలో రక్తస్రావాలు ఉంటాయి. తెల్లటి జిగట పదార్ధం కనబడుతుంది. గాలి గదులు మందమై కందిపోయి జున్ను లాంటి పదార్ధం పేరుకొని ఉంటుంది. గుండె, కాలేయం మీద పలుచని పొర ఏర్పడుతుంది.
చికిత్స : వ్యాధి గ్రస్త కోళ్ళకు థయాముటిన్, టైలోసిన్ వంటి యాంటిబయోటిక్ మందులను త్రాగే నీళ్ళలో లేదా ఇంజక్షన్ రూపంలో 5-7 రోజులు వాడాలి. ఇవే కాకుండా ఆక్సిటెట్రాసైక్లిన్, క్లోర్టెట్రాసైక్లిన్ ను టన్ను దాణాలో 200-400 గ్రా. చొప్పున కలిపి కూడా వాడవచ్చు.

నివారణ :

  • పెద్ద కోళ్ళు, కోడి పిల్లలు ఒకే షెడ్లో కాకుండా వేర్వేరు షెడ్లలో ఉంచాలి. ఈ షెడ్లు దూరంగా, ఎడంగా ఉండాలి.
  • కొత్తగా పిల్లలు తెచ్చే ముందు, షెడ్లను పొటాషియం పెర్మంగానేట్ మరియు ఫార్మలిన్ ద్రావణంతో ఫుమిగేషన్ చేసి 2-3 వారాలు ఖాళీగా ఉంచాలి.
  • కోళ్ళ ఫారాలలో కోళ్ళు కిక్కిరిసి, గుమికూడి ఉండకుండా చూడాలి. అందుకొరకు సరిపోను స్థలం కేటాయించాలి.
  • అధిక చలి మరియు గాలి, వెలుతురు లోపం వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కావున గాలి,వెలుతురు సక్రమంగా ప్రసరించేలా చూడాలి.
  • టీకాలు, ఏలికపాముల మందు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో కోళ్ళు ఒత్తిడికి గురికాకుండా చూడాలి.
  • పాత లిట్టర్ తొలగించి, అమోనియా వాయువును నివారించాలి.
  • వ్యాధితో మరణించిన కోళ్ళను కాల్చి వేయాలి. వ్యాధి సోకిన వాటిని వెంటనే వేరు చేయాలి.
  • వాహనాలు, దాణా బస్తాలు, క్రేట్లు, పరికరాల ద్వారా వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్త వహించాలి.
  • కోళ్ళ షెడ్లు మరియు పరికరాలను శుభ్రం చేయడానికి ప్రతిపాదిత క్రిమిసంహారణిలైనటువంటి ఫినోలిక్ ఆమ్లం, క్రెసాలిక్ ఆమ్లం, హైపోక్లోరైట్, 10% ఫార్మలిన్, 0.1% గ్లుటరాల్దిహైడ్, బ్లీచింగ్ పౌడర్ ను వాడాలి.

డా. టి. విజయ నిర్మల శాస్త్రవేత్త (పశువైద్య విభాగం), డా. ఎన్. శ్రీ విద్య రాణి శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), డా. బి.ఎస్. కాంతి శ్రీ శాస్త్రవేత్త (గృహ విజ్ఞాన విభాగం), డా. ఎస్. ఫిరోజ్ హుస్సేన్, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), డా. ఎం.బాలకృష్ణ, సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట, వై.ఎస్.ఆర్. కడప జిల్లా-516173, డా. గోవిందరాజులు, ఎ.డి.ఆర్., ఆర్.హెచ్.ఆర్.ఎస్., తిరుపతి & డా. సి.హెచ్. రూత్, విస్తరణ సంచాలకులు, వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్ : 8121136184

Read More

గ్రామీణ ప్రాంతాలలో భద్రంగా డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళ పెంపకం

గ్రామీణ ప్రాతాలలోని స్త్రీలు నిరక్షరాస్యత, పేదరికానికి తోడు సరైన పోషకాహారం తీసుకోలేక పోవడం వలన అనారోగ్యానికి గురి అవుతున్నారు. వీటిని అధిగమించాలంటే స్వాలంబనతో పాటు సమతుల్య ఆహారం ఎంతో అవసరం. గ్రామాలలోని ప్రజలు అధికంగా బియ్యంను ప్రధాన ఆహారంగా వాడుతారు. వీటిలో పిండి పదార్ధాలు అధికంగాను, మాంసకృత్తులు అత్యల్పంగానూ ఉంటాయి. అందువల్ల గ్రామాల్లోని ప్రజలు మాంసకృత్తుల లోపం మూలంగా సరైన ఎదుగుదల లేక ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరు సరైన పోషకాహారము తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అయతే ఈ మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు కోడి గ్రుడ్డులో మరియు కోడి మంసములో పుష్కలంగా ఉన్నాయి. పోషకాహార నిపుణుల సూచన మేరకు కనీసం రెండు రోజులకి ఒక గ్రుడ్డు చొప్పున తింటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. అందువల్ల కోళ్ళ ఉత్పత్తులను గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో అందుబాటులోకి తెస్తే అది వారి ఆహారలో ఒక భాగమై వారి ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దోహద పడుతుందున్న ఉద్దేశ్యముతో అధిక గ్రుడ్లు ఉత్పత్తి మరియు నాటు కోడి మాంసం రుచికి సమానంగా అనిపించే వనరాజ, గిరిరాజ, గ్రామ ప్రియ, రాజశ్రీ, శ్రీనిధి, వనశ్రీ మరియు కడక నాథ్ కోళ్ళ జాతులను పెరటిలో పెంచుకోవడానికి అనువైనవిగా గుర్తించి గ్రామీణ ప్రాంత రైతులకు పరిచయం చెయ్యడం జరిగింది.

గ్రామీణ ప్రాంతంలో నాటు కోళ్ళ పెంపకం సర్వసాధారణము. అయితే నాటు కోళ్ళు తక్కువ కోడి గ్రుడ్లు పెడతాయి అలాగే తక్కువ మాంసం దిగుబడి ఇస్తాయి. అలాగే కుక్కలు, నక్కలు కోళ్ళని ఎత్తికొనిపోయి తినేయడం వలన ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒక్కోసారి కోళ్ళని దొంగలించడం వలన కూడా నష్టం జరుగును. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ ని ఈ క్రింద తెలియ చేసిన కొలతల ప్రకారము వ్యవసాయ పరిశోధన కేంద్రం, విజయనగరం వారు రూపొందించడం జరిగింది.

డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ కొలతలు వివరములు :

  • పొడవు 87 అంగుళములు, వెడల్పు 46 అంగుళములు, మధ్యలో ఎత్తు 66 అంగుళములు, ఒక ప్రక్క ఎత్తు 42 అంగుళములు మరియు ఇంకో ప్రక్క ఎత్తు 54 అంగుళములు.
  • పైన రూఫ్ జింక్ షీట్, బాక్స్ చుట్టు మరియు బాక్స్ క్రింద కూడా జింక్ షీట్ తో తయారు చెయ్యడం జరిగింది.
  • డూప్లెక్స్ బాక్స్ లో క్రింద ఫ్రీగా తిరగడానికి రెండు రకాలైన జింక్ మెష్ లను వేయడం జరిగింది.
  • మిగిలిన రాడ్స్ అన్నీ ఇనుముతో తయారు చేయడము జరిగింది.
  • డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళు క్రింది నుండి బాక్స్ లోనికి వెళ్ళడానికి జింక్ మెస్ మెట్లు లాగ ఏర్పాటు చెయ్యడము జరిగింది.
  • డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ లోనికి కోడి పిల్లలు, మేత, నీరు పెట్టడానికి మరియు తీయడానికి చిన్న తలుపు ఏర్పాటు చెయ్యడం జరిగింది.
  • కోడిపిల్లలను మరియు కోళ్ళను ఎవరు తీయకుండా ఉండుటకు తాళం వేసుకొనే సదుపాయం ఏర్పాటు చెయ్యడం జరిగింది.
  • ఒక డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ తయారీ చెయ్యడానికి సుమారుగా 25,000/- (ఇరువైదు వేలు) రూపాయలు అవుతుంది.
  • ఇలా తయారు చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో 16 చదరపు అడుగులు పైన బాక్స్ కోళ్ళు నిద్ర పోవుటకు మరియు గ్రుడ్లు పెట్టటకు ఉపయోగపడుతుంది. ఈ బాక్స్ లో రెండు అంగుళాలు లోతు ఏర్పాటు చేసి బెడ్డింగ్ మెటీరియల్ క్రింద వరి దాన్యం ఊకను రెండు అంగుళాలు నింపాలి.
  • ఇలా తయారీ చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో 32 చదరపు అడుగులు క్రింద బాక్స్ కోళ్ళు ఫ్రీగా తిరగడానికి, మేత టబ్బు, నీళ్ళ టబ్బు పెట్టడానికి ఉపయోగపడుతుంది. పైన తెలిపిన కొలతలతో తయారు అయన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో మొదట్లో 20-25 కోడిపిల్లలు పెంచుకోవచ్చు. పెద్దవైతే 15-20 కోళ్ళను సులువుగా పెంచుకోవచ్చు.
  • ఈ డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ కి తాళం వేసుకొని రైతు ఎక్కడికైనా వెళ్లి వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. రోజు ఉదయం మరియు సాయంత్రం కొద్దిగా మేత మరియు నీరు పెట్టుకుంటే సరిపోతుంది.

ఈ విధంగా తయారు చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లని ఐ.సి.ఎ.ఆర్. – ఐ.ఐ.యఫ్.యస్.ఆర్. వారి ఆర్ధిక సహాయముతో తయారు చేసి ఉచితముగా సాలూరు మండలంలో గంగాన్నదొరవలస, మెట్టవలస గ్రామాలలో 18 మంది రైతులకు మరియు మక్కువ మండలంలో చిమిడివలస, ఎర్రసామంతులవలస గ్రామాలలో 18 మంది రైతులకు 2020-2021 సంవత్సరములో సరఫరా చేయడం జరిగినది. ఈ డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ తో పాటు, ఒక మేత పెట్టే టబ్, ఒక నీళ్ళు పెట్టే టబ్ మరియు 10 ఆడ పిల్లలు, 5 మగ పిల్లలు ఇచ్చి పరిశీలించడం జరిగింది. ఇలా రైతులు డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళ పెంపకం చేపట్టడము వలన టేబుల్లో తెలిపిన విధంగా కోళ్ళు, గ్రుడ్లు విషయములో చాలా లాభాలు నమోదు చెయ్యడం జరిగినది.

రైతులు డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళ పెంపకం చేపట్టడము వలన 46.67 శాతం కోళ్ళను కుక్కలు, నక్కలు ఎత్తికెల్లి పోకుండా కాపాడటము గమనించడమైనది. అలాగే డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో ఉన్న కోళ్ళు 1247 గ్రుడ్లు పెడితే, సాధారణంగా పెంచే కోళ్ళు 568 గ్రుడ్లను మాత్రమే పెట్టాయి. అలాగే డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో ఉన్న కోళ్ళు 52.50 కిలోలు మాంసం దిగుబడినిస్తే, సాధారణంగా పెంచే కోళ్ళు 22.40 కిలోలు మాంసం దిగుబడినిచ్చాయి. కోళ్ళని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో పెంచడం వలన సుమారుగా మొత్తం లాభం రూ. 21,985/- వచ్చింది. సాధారణంగా చేపట్టే కోళ్ళ పెంపకములో సుమారుగా మొత్తం లాభం రూ.9,560/- వచ్చింది. కావున కోళ్ళని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో పెంచడం వలన కోళ్ళను కుక్కలు, నక్కలు ఎత్తికెల్లి పోకుండా కాపాడుకోవడము కాకుండా అదనంగా 54.45 శాతం గ్రుడ్లు మరియు 57.33 శాతం మాంసం వచ్చినట్లు గమనించడమైనది.

డా.ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా.కె. లక్ష్మణ, ప్రధాన శాస్త్రవేత్త(విస్తరణ), డా.కే. తేజేశ్వర రావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా. టి.యస్.యస్.కే. పాత్రో, ప్రధాన శాస్త్రవేత్త(తెగుళ్ళు విభాగం)
ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, విజయనగరం. మొబైల్ నెంబర్ : 9440123223

Read More

ఆరోగ్యకరమైన లేయర్ పుల్లెట్ కోళ్లు – లాభాల సిరులు

లాభదాయకమైన లేయర్ల పెంపకం నాణ్యమైన పుల్లెట్‌ల పెంపకం నుండే ప్రారంభం అవుతుంది. తక్కువ వయసున్న పుల్లెట్‌లు అండోత్పత్తి దశకు చేరే సమయానికి సరైన శరీర బరువు ఉన్నట్లయితే వాటి జన్యు సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు అవుతుంది.

షెడ్ ఏర్పాటుచేసుకోవడం:
పాత బ్యాచ్ తీసి వేసిన తరువాత కొత్త బ్యాచ్ మొదలు పెట్టడానికి కనీసం 3 వారాల విరామ సమయాన్ని పాటించాలి. షెడ్‌ని శుబ్రపరిచే ముందు షెడ్‌లో ఉన్న మేత మరియు కోళ్ల లిట్టర్‌ని తొలగించి, ఎలుకల నియంత్రణ కూడా చేపట్టాలి. షెడ్ మొత్తాన్ని అధిక ప్రెషర్ కలిగిన నీటి జెట్ వాషర్ సహాయంతో కడగాలి. ఇదే సమయంలో షెడ్‌కి కావలసిన మరమ్మతులు చేయించుకుని పెట్టుకోవాలి. పాత బ్యాచ్ కోళ్లను తీసి వేసిన తర్వాత ఆ బ్యాచ్‌లో ఉపయోగించిన ఫీడర్లు, డ్రింకర్లను తీసేసి ముందుగా డిటర్ౙెంట్‌తో బాగా కడిగి, తర్వాత డిస్ ఇంఫెక్టన్ట్ ద్రావణంలో ఒక రాత్రి అంతా నానబెట్టి, మరుసటి రోజు శుభ్రమైన నీటితో కడిగి, ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వలన బాక్టీరియాలు చనిపోతాయి. తరువాత పాత బ్యాచ్ లిట్టర్ అంతా పూర్తిగా తీసేయాలి. కడిగే సమయంలో షెడ్డు పై కప్పు నుంచి మొదలు పెట్టి తర్వాత గోడలు, ఆపై నేలను శుభ్రం చేసుకోవాలి. నేలను ప్రెషర్ వాషెర్ సహాయంతో శుభ్రం చేసి, డిస్ ఇంఫెక్టన్ట్ ద్రావణాన్ని స్ప్రే చేయాలి. నేల మొత్తాన్ని ఫ్లేమ్ గన్ సహాయంతో కాల్చాలి. ఇలా కాల్చటం వలన క్రిములు, కోడి ఈకలు మరియు వాటిపై ఉండే క్రిములు అన్నీ నశిస్తాయి. మట్టి నేల ఐతే పొడి సున్నాన్ని చల్లాలి, కాంక్రీట్ ఫ్లోర్ ఉన్నట్లయితే సున్నంతో వైట్ వాషింగ్ చేయించుకోవాలి. ఇదే సమయంలో వాటర్ ట్యాంక్ మరియు నీటి పరికరాలు అన్నీ శుభ్రం చేసుకోవాలి. వాటర్ లైన్‌లు శుభ్రపరుచుటకు లిదీబీజిరిదిజిరిదీ, ఔ904, ఇతర డిస్ ఇన్ఫిక్టన్ట్ ద్రావణాలు వాడాలి, తర్వాత శుభ్రమైన నీటితో కడగవలెను.

కోడి పిల్లలు రాకముందు:
కోడిపిల్లలు రావడానికి 48 గంటల ముందుగానే షెడ్ రెడీ చేసుకోవాలి. కోడి పిల్లలు షెడ్ కి చేరుకునే సమయానికి షెడ్ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా, షెడ్ సైజుని బట్టి ముందుగానే లైట్లు ఆన్ చేసుకోవాలి. దీనివలన షెడ్ లోపల వాతావరణం సరైన ఉష్ణోగ్రతకి చేరుకుంటుంది. ఫీడర్లలో దాణా కనిపించేలా వెలుతురు 30 – 35 లక్స్ ఉండేలా చూసుకోవాలి. నాణ్యమైన తాజా చిక్ స్టార్టర్ దాణాని ఫీడర్లలో నింపాలి. అలాగే కోడి పిల్ల తాగడానికి అనువుగా డ్రింకర్లలో నీటిని నింపి తగిన ఎత్తులో అమర్చాలి. ఒత్తిడిని తగ్గించడానికి నీటిలో విటమిన్లు, ఎలెక్ట్రోలైట్స్ కలపాలి.

కోడి పిల్లల నాణ్యతః
కోడిపిల్లలను నాణ్యమైన పేరెంట్స్ / హేచరీ నుండి తీసుకోవాలి. కోడిపిల్లలు మంచి బరువుతో పూర్తిగా ఆరిపోయి మరియు బొడ్డు బాగా నయమై ఉండాలి. కాళ్ళు నిటారుగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి. మొదటి రోజునే మారెక్స్ వ్యాధి రాకుండా హెచ్‌వీటి స్ట్రెయిన్ టీకా వేయించాలి.

బ్రూడింగ్ – అతి ప్రధానం:
కోడి పిల్లల జీవితంలో మొదటి రెండు వారాలు క్లిష్టమైనవి.అపుడే పుట్టిన కోడిపిల్లలు వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేవు. కావున వాటికి అనువైన వాతావరణాన్ని అందించాలి. కేజ్‌లో కోడి పిల్లల కాళ్ళు ఇరుక్కోకుండా న్యూస్ పేపర్‌ని పరచాలి. కోడి పిల్లలను కేజ్‌లో పెంచుతున్నట్లు ఐతే న్యూస్ పేపర్ మీద దాణాని చల్లి ఉంచాలి, ఇలా చేయడం ద్వారా కోడి పిల్లలలో దాణా తినడాన్ని ప్రేరేపించవచ్చు. కోడి పిల్లలు ఎంత తొందరగా తినడం మొదలుపెడతాయో అంత వేగంగా వాటి ఎదుగుదల ఉంటుంది. హేచరీ నుండి బయటికి వచ్చాక ఎంత తొందరగా తింటే అంత ఆరోగ్యాంగా ఉంటాయి, లేకపోతే డీహైడ్రేషన్ వలన బలహీనం అవుతాయి. కేజ్‌లలో పిల్లలు నేల మీద పిల్లల లాగా కదల్లేవు కాబట్టి వాటికి కావలసిన ఉష్ణోగ్రత మరియు తేమని అందించాలి.

షెడ్లలో పాటించాల్సిన ఉష్ణోగ్రతలు
వయస్సు (రోజులలో) కావాల్సిన ఉష్ణోగ్రత (డిగ్రీల సెంటీగ్రేడ్)
1-7 32-33
8-14 28-30
15-21 26-28
22-28 23-26
28-35 21-23

సరైన బరువును చేరుకోవడానికి కోడి పిల్లల నిర్వహణః
ఒక క్రమబద్ధమైన సమతుల్యమైన పెరుగుదల రేటును అనుసరిస్తూ కోడి పిల్లలు ఎదుగుతాయి. ఎదిగేటపుడు వాటికి కావలసిన పోషణ, టీకాలు, సరైన నిర్వహణ, లైటింగ్ / వెలుతురు అందించినపుడు, కోళ్లు జాతి / బ్రీడ్ జన్యు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఎదిగే దశలో బ్రీడ్ సామర్థ్యానికి తక్కువ బరువు ఉండే కోళ్ళలో అవయవాలు సరిగా అభివృద్ధి చెందక, దీని ప్రభావం గుడ్లు పెట్టే దశలో కన్పిస్తుంది. దీనివల్ల గుడ్ల సంఖ్య తగ్గిపోవడం, చిన్న గుడ్లు రావడం లేదా దాణా వినియోగం తగ్గిపోవడం జరిగి రైతులు నష్టపోతారు.

ఎదిగే దశను 3 భాగాలుగా విభజించవచ్చు.
0-6 వారాల వయసు వరకు: ఈ సమయంలో జీర్ణ వ్యవస్థ మరియు రోగ నిరోధక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ సమయంలో ఎలాంటి పోషక లోపమైన, ఫారం నిర్వహణలో జరిగే లోపాలు ఈ రెండు వ్యవస్థలను శాశ్వతంగా దెబ్బ తీస్తాయి. దీని వలన కోళ్లు తేలికగా వ్యాధులకు గురి అవుతాయి.

6-12 వారాల వయసు వరకు: ఈ సమయంలో కోళ్ల కండరాలు, ఎముకలు, ఈకలు వేగంగా వృద్ధి చెందుతాయి. 12-13 వారాలు వచ్చే సరికి 95 % అస్థిపంజరం అభివృద్ధి చెందుతుంది. ఆ తరువాత ఎముకలలో ఎదుగుదల ఉండదు. కోడి అస్థిపంజరం పరిమాణాన్ని బట్టి గుడ్డు పెంకు నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఎదుగుదల సరిగా లేని కోళ్ళ గుడ్డు పెంకు బలహీనంగా ఉండి గుడ్లు తొందరగా పగిలిపోవడం జరిగి రైతుకు నష్టం కలుగుతుంది.

13-17 వారాల వయసు వరకు: ఈ సమయంలో శరీర ఎదుగుదల తగ్గి జననేంద్రియాలు వృద్ధి పెరిగి అండోత్పత్తికి సిద్దం అవుతాయి. శరీరంలోని కండరాలు మరియు ఫ్యాట్ అభివృద్ధి సాగుతూనే ఉంటుంది. ఈ దశలో శరీర బరువు 17-18 వారాలలో ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటే అండోత్పత్తి ఆలస్యం అవుతుంది.

కోళ్లు ఎదిగే వయసులో – ముఖ్య దశలు:

  1. బ్రూడింగ్ – ఉష్ణోగ్రత సరిగ్గా ఉండేలా చూడాలి. కాలాన్ని మరియు వయసును బట్టి ఉష్ణోగ్రతను మారుస్తూ ఉండాలి.
  2. 5వ వారం కనీస శరీర బరువు 350 గ్రా. ఉండేలా చూసుకోవాలి. ప్రతి వారం సాంపిల్ బరువులు నిర్దిష్ట బరువుతో సరిచూసుకోవాలి. ఒకవేళ నిర్దిష్ట బరువు లేనట్లయితే దానికి గల కారణాలను వెంటనే సవరించుకోవాలి. ఉదాహరణకి దాణాలో పోషకాల లోపం, ఫీడర్ల మరియు డ్రింకర్ల సంఖ్య కావాల్సిన దానికన్నా తక్కువగా ఉండడం మరియు వాటి ఎత్తు కోళ్ల ఎత్తుకి ఎప్పటికపుడు సర్దుబాటు చేయడం.
  3. ముక్కు కత్తిరించడం బిక్ ట్రిమ్మింగ్ :
  • కోడి పిల్లల ముక్కు ముందు భాగాన్ని బిక్ ట్రిమ్మర్‌లో పెట్టి, సరైన ఉష్ణోగ్రత అనగా బ్లేడ్ 650 సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రత కు చేరుకున్నాక కోడి పిల్ల పరిమాణం బట్టి ఈ సైజు రంద్రాన్ని వాడాలో నిర్ణయించుకోవాలి.
  • ట్రిమ్మింగ్ బ్లేడ్ నారింజ ఎరుపు రంగుకు చేరినట్లయితే అది 650 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగి ఉన్నట్లు గుర్తించాలి.
  • 10 -14 రోజుల వయసులో మొదటి సారి, 14 వారాల లోపు ఇంకొకసారి ముక్కును కత్తిరించుకోవాలి.
  • రెండవసారి ముక్కు కత్తిరించడం 14 వారాల లోపు చేయాలి, తర్వాత చేస్తే అంటే 15 -17 వారాల వయసులో చేయడం వలన నొప్పికి దాణా మరియు నీరు సరిగా తీసుకోక పోషక లోపం జరిగి జననేంద్రియాల అభివృద్ధికి ఒత్తిడి కలిగి గుడ్లు పెట్టడం ఆలస్యమవడమే కాకుండా చిన్న గుడ్లు ఎక్కువ సంఖ్యలో వచ్ౘ్ి రైతులు నష్టపోతారు.
  1. సమయానికి బ్రూడర్ కేజ్ ల నుండి గ్రోవర్ కేజ్ లోకి మార్చాలి.
  2. బ్రూడింగ్ నుండి గ్రోయింగ్ షెడ్లలో ఒకేరకమైన నీటి వ్యవస్థని వాడాలి.

కోళ్లు ఎదిగే వయసులో – ముఖ్య అంశాలు:
శరీర బరువు పర్యవేక్షణ :

  • ఒక వారం వయసు నుండి కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభించే వయసు వరకు ప్రతి వారం కోడిపిల్లల బరువు చూడాలి. 4 వారాల వరకు గ్రూప్ బరువు, 4 వారాల నుండి 18 వారాల వరకు విడివిడిగా బరువును చూడాలి. తరువాత రెండు వారాలకు ఒకసారి బరువులు చూసినట్లయితే సరిపోతుంది.
  • కేజ్ లలో కోళ్లను ఒకే దగ్గరనుండి కాకుండా మొదటి కేజ్‌లు, చివరి కేజ్‌లు మరియు మధ్య కేజ్‌లలో నుండి తీసుకోవాలి. అదేవిదంగా పైనుండి, మధ్య కేజ్‌లు మరియు కింద వరస కేజ్‌లలోనుండి కోళ్లను ఎంచుకోవాలి.
  • ఇలా పర్యవేక్షించడం ద్వారా వాటి ఎదుగుదలలో సమస్యలను వెంటనే గుర్తించి దాణాలో మార్పులను సరిచేసుకోవచ్చు. తక్కువ బరువులున్న కోళ్లను గ్రేడింగ్ చేసి షెడ్‌లో ఒకవైపు కేజ్‌లలోకి మార్చి కొన్ని రోజులు వాటికి స్టార్టర్ దాణాని అందించాలి.

శరీర బరువు ఏకరూపతః

  • శరీర బరువు ఏకరూపత అనేది భవిష్యత్తులో వాటి అండోత్పత్తి సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. ఎదిగే వయసులో 85% ఉండాలి, ఇలా ఉంటే అన్ని కోళ్లు ఒకేసారి అండోత్పత్తికి చేరి అధిక గుడ్లు ఉత్పత్తి చేస్తాయి.
  • యూనిఫార్మిటీ అనేది కంపెనీ స్టాండర్డ్‌తో సరిగా ఉంటే గుడ్ల ఉత్ఫత్తి మరియు గుడ్ల బరువులో తేడాలు లేకుండా ఉంటాయి, తద్వారా రైతు మంచి లాభాలను పొందవచ్చు.

లైటింగ్:

  • లైటింగ్ అనేది గుడ్లు పెట్టె కోళ్ళలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. సమయానికి లైటింగ్ అనేది ఇవ్వకపోతే గుడ్ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. లైటింగ్ లో రెండు అంశాలు – లైటింగ్ వ్యవధి మరియు తీవ్రత.
  • మొదటి 3 రోజులు 23 గంటలు, 3 వ రోజు నుండి – 3 వారాల వరకు నెమ్మదిగా 23 గంటల నుండి 16 గంటల లైటింగ్ వ్యవధికి తగ్గిస్తూ రావాలి. 4 వ వారం నుండి 7వ వారం వరకు వారానికి ఒక రోజు చొప్పున 12 గంటల వ్యవధికి తగ్గించాలి. 8 వ వారం నుండి 16 /17 వారం లేదా నిర్ణీత శరీర బరువు వచ్చే వరకు సహజంగా వచ్చే లైటింగ్ మాత్రమే ఇవ్వాలి. నిర్ణీత బరువు చేరుకున్నాక లైట్‌తో ప్రేరేపించాలి.
  • శరీర బరువు నిర్ణీత బరువు కన్నా తక్కువ ఉంటే లైట్‌తో ప్రేరేపించడం ఆలస్యం చేయాలి.

కాంతి తీవ్రతః
వయసు 0-7 రోజులు 1-4 వారాలు 4-17 వారాలు >17 వారాలు గుడ్లు పెట్టే దశలో
Lux Min–20 10 6 10 30-35

  • నిర్ణీత బరువు రాకముందే లైటింగ్ ఇచ్చినా లేదా లైటింగ్ తీవ్రత 30 Lux కన్నా ఎక్కువ ఇస్తే కోళ్ళలో ప్రోలాప్స్ వచ్చే ప్రమాదం ఉంది. కావున లైటింగ్ ఇచ్చే ముందు బరువు సరిచూసుకోవడం చాల ముఖ్యం.
    ఎదిగే దశలో ఎదురయ్యే సమస్యలు దీర్ఘ కాలంలో అండోత్పత్తి దశలో గుడ్ల సంఖ్య, సైజు మరియు గుడ్ల పెంకు యొక్క నాణ్యతపై ప్రభావం చూపుతాయి, కాబట్టి పూర్తి శ్రద్ధతో అన్ని అంశాలను పాటించి సరైన శరీర బరువు చేరుకునేలా పుల్లెట్ కోళ్లను పెంచినట్లయితే అధిక లాభాలను అందుకోవచ్చు.
    పుల్లెట్ కోళ్లను పెంచే క్రమంలో పైన తెలిపిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ అవి గుడ్లు పెట్టడం ప్రారంభించిన తరువాత వచ్చే చాలా సమస్యలను అధిగమిస్తూ, ఆశించిన స్థాయిలో ఫలితాలను చూడవచ్చు.

డా. కె. ప్రశాంత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కోళ్ల శాస్త్ర విభాగం, పశువైద్య కళాశాల, మామునూరు, వరంగల్, పివిఎనఆర్‌టివియు, ఫోన్: 7013179181

Read More

సెర్ప్ నుంచి గ్రామీణ మహిళలకు కొత్త పథకం

రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ మహిళలకు జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు జూన్ 2 నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. దీనికింద మహిళలతో పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె, మేక పిల్లల పెంపకం కేంద్రాలు, నాటు కోళ్లు, ఈము పక్షుల కొనుగోళ్ల యూనిట్లు ఏర్పాటు చేయిస్తారు. వారికి బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థికసాయం అందిస్తారు. పథకానికి ఎంపికైన మహిళా సంఘాల లబ్దిదారులకు పశువైద్య వర్సిటీ శిక్షణ ఇస్తుంది. దీనిపై పీవీ నరసింహారావు తెలం గాణ పశువైద్య విశ్వవిద్యాలయంతో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పశు వైద్య వర్సిటీ రిజిస్ట్రార్ శరత్‌చంద్ర ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ స్వయంసహాయక సంఘాల అభ్యున్నతి, పశుసంపద వృద్ధి కోసం ఒప్పందం చేసుకున్నట్లు దివ్యా దేవరాజన్ తెలిపారు.

Read More

బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో 8

బర్డ్ ఫ్లూ స్వేచ్ఛా ప్రాంతాలు (బర్డ్ ఫ్లూ ఫ్రీ ఏరియా)గా ఆంధ్రరాష్ట్రంలో ఆరు జిల్లాల్లోని 8 ప్రాంతాలను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ప్రాంతాల్లో ఫ్లూ ప్రబలడంతో ఆ ప్రాంతాలను అప్పట్లో బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. తర్వాత నెలకు రెండుసార్లు చొప్పున ఈ ప్రాంతాల్లోని కోళ్లు / పక్షుల నమూనాలు సేకరించి, భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఐకార్-ఎనఐహెచఎసఏడీ)కు పంపించారు. వరుసగా నెగెటివ్ వస్తుండటంతో ఈ ప్రాంతాలను బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలుగా ప్రకటించవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
కమర్షియల్ పౌల్ట్రీలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని వేల్పూరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని కానూరు అగ్రహారం, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుముల్లంక, ఎ.కోడూరు మండలంలోని కృష్ణారావుపాలెం, కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని 21వ వార్డు, గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామం మరియు బాతులు ప్రభావితమైన ప్రాంతం కర్నూలు జిల్లాలో ఎనఆర్‌పేట, కర్నూలును బర్డ్ ఫ్లూ ఫ్రీ ప్రాంతాలుగా ప్రకటించారు.

Read More

‘నాటుకోళ్ల’ పెంపకంకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో యువతకు, మహిళలకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడానికి, రైతులకు అదనపు రాబడిని కల్పించడానికి నూతన, సంప్రదాయ విధానాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా తిన్నవారికి ప్రొటీన్లు… పెంచిన వారికి ఆదాయం అందుతుందనే భావనతో నాటుకోళ్ల పెంపకాన్ని భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది. గతంలో ప్రతి పల్లెలో నాటుకోళ్లు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య భారీగా తగ్గింది. జాతీయ పశుగణన గణాంకాల ప్రకారం… తెలంగాణలో 2014లో 8,20,134 నాటుకోళ్లు ఉండగా 2025 నాటికి 5,10,552 తగ్గాయి. మరోవైపు పట్టణాల్లో నాటుకోడి మాంసానికి అధిక గిరాకీ ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కోళ్ల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసింది.
కార్యాచరణ…
వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు సంబంధిత విశ్వవిద్యాలయాల ద్వారా పథకాన్ని అమలు చేస్తారు.
దళిత, గిరిజనుల కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద కోళ్లను పంపిణీ చేస్తారు. ఇప్పటికే మహబూబాబాద్‌, ములుగు, నల్గొండ జిల్లాల్లో దళితులు, గిరిజనులకు ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆరు వేల చొప్పున నాటుకోళ్లను అందజేశారు.
రైతులు తక్కువ పెట్టుబడితో పెరట్లో, వ్యవసాయ క్షేత్రాల్లో కోళ్ల షెడ్లను ఏర్పాటు కోవచ్చు. గుడ్లు, మాంసం సంతల్లో, స్థానిక మార్కెట్లలో అమ్మకాల ద్వారా లాభాలు పొందవచ్చు.
షెడ్లను ఉపాధి హామీ పథకం కింద నిర్మించుకోవచ్చు. మదర్‌ యూనిట్‌ కింద పెద్దషెడ్‌ నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తున్నారు. దీనిలో కోడిపిల్లలను పెంచి గ్రామంలో ఇతరులకు పెంపకానికి ఇస్తారు. చిన్న యూనిట్లకు రూ. లక్ష ఇస్తారు. ఈ మేరకు రాయితీపై కోళ్లను, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణసాయాన్ని అందజేస్తారు.
మహిళాశక్తి పథకం కింద ప్రతి మండలానికి రెండు చొప్పున యూనిట్లు, 100 చొప్పన చిన్న యూనిట్లను మంజూరు చేస్తోంది. దీనికి రుణసాయాన్ని సెర్ప్‌ అందజేస్తుంది.

Read More

వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉజ్వల భవిత

వికసిత భారత్‌ కింద ఉజ్వల భవిష్యత్‌ ఉన్న పశుసంవర్థక, మత్స్య, పౌల్ట్రీ రంగాలను ప్రోత్సహిస్తామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్‌ శాఖల సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సీఎల్‌ఎఫ్‌ఎంఏ 58వ జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాణా ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం’ అని బఘేల్‌ హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి, మల్కాజిగిరి ఎంపీ ఈటల, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్‌, కేంద్ర సంయుక్త కార్యదర్శి ముత్తుకుమారస్వామి, స్లిఫ్మా చైర్మన్‌ దివ్యకుమార్‌ గులాటీ, పౌల్ట్రీ ఇండియా అధ్యకక్షుడు ఉదయ్సింగ్‌ పాల్గొన్నారు.వికసిత భారత్‌ కింద ఉజ్వల భవిష్యత్‌ ఉన్న పశుసంవర్థక, మత్స్య, పౌల్ట్రీ రంగాలను ప్రోత్సహిస్తామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్‌ శాఖల సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సీఎల్‌ఎఫ్‌ఎంఏ 58వ జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాణా ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం’ అని బఘేల్‌ హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి, మల్కాజిగిరి ఎంపీ ఈటల, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్‌, కేంద్ర సంయుక్త కార్యదర్శి ముత్తుకుమారస్వామి, స్లిఫ్మా చైర్మన్‌ దివ్యకుమార్‌ గులాటీ, పౌల్ట్రీ ఇండియా అధ్యకక్షుడు ఉదయ్సింగ్‌ పాల్గొన్నారు.

Read More