వడగాల్పుల ప్రభావంతో నష్టపోయిన పౌల్ట్రీ రైతులను ఆదుకుంటాం

యూరియా లభ్యత, మొక్క జొన్న ధరలు, రొయ్యల మార్కెట్ పరిస్థితులు, కొబ్బరి రైతుల సమస్యలు, అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి తదితర అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల సంచాలకులతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వడగాడ్పుల ప్రభావంతో రాష్ట్రంలో సుమారు 5.5 కోట్ల కమర్షియల్ లేయర్ కోళ్లలో 2.5% నుంచి 3.5% వరకు మరణాలు నమోదైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని ఆయన తెలిపారు. నష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పౌల్ట్రీ రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు.

Read More

యుద్ధం వలన గుడ్ల ఎగుమతులకు దెబ్బ

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పది రోజులుగా రోజుకి రూ. 4 కోట్ల విలువైన గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో తెలంగాణా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గుడ్లు కార్గో ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. బయటి నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం విపణిలో హోల్‌సేల్‌గా ఒక గుడ్డు ధర రూ.4.20 ఉండగా, రిటైల్ రూ. 5కు అమ్ముతున్నారు. మరోవైపు రిటైల్ అమ్మకందారులు తమ షాపుల్లోనే ఎక్కువగా ఉన్నాయని, కొత్తగా ఆర్డర్లు తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో పౌల్ట్రీఫాం యజమానులు, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. ఇది పౌల్ట్రీ రంగానికి ఊహించని ఉత్పాతమని తెలంగాణ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read More