ఔషధమొక్క… వస

వస మొక్క మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది తేమ ప్రదేశంలో బహువార్షిక మొక్క. ఆకులు దళసరిగా రెండు వరుసలలో అమరి ఉంటాయి. ఈ మొక్క దుంప నేలలో ఉంటుంది. లేత పసుపు రంగు పూవులు ఒక దొప్పలో అమరిఉంటాయి. గోదావరి జిల్లా అటవీ ప్రాంతాలలోను, ఉత్తర కోస్తా మండలంలోని గిరిజనులచే ఇది సాగు చేయబడుతుంది. ఈ మొక్క వేరును వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఆకులను, దుంపలను వ్యవసాయంలో కీటకనాశనిగా ఉపయోగించవచ్చు. ఈ మొక్క వేర్లలో ఎకోరిన్, కెలామిన్, యూజినాల్, ఆల్ఫాఎసరోన్ వంటి రసాయనాలు ఉంటాయి.

సాధారణ నామం : స్వీట్ ఫ్లాగ్ శాస్త్రీయ నామం : అకోరస్ కలామస్ కుటుంబం : అకోరేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వేరును ఆయుర్వేద మందులు తయారీలో ఉపయోగిస్తారు.
  • వ్యవసాయంలో కీటకనాశనిగా, తెగుళ్ళ నివారిణిగా….
  • ఆకులు, వేర్లలో ఉన్న రసాయనాలకు కీటకనాశని లక్షణాలు ఉన్నాయని శాస్త్రపరిశోధనలో తేలింది. పురుగులు, తెగుళ్ళ నివారణలో ఈ రసాయనాలెంతగానో ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో …

  • విత్తన నిల్వలలో ఆశించే పురుగులు : విత్తన నిల్వలలో ఆశించే పురుగుల నియంత్రణకు 3 గ్రాముల వస చూర్ణాన్ని ఒక కిలో విత్తనానికి కలిపి ఉంచడం ద్వారా సుమారు 3 నెలల వరకూ విత్తనాలను పురుగులబారినుండి కాపాడుకోవచ్చు. వరి ధాన్యాన్ని ఆశించే ముక్కుపురుగు, పప్పుధాన్యాలను (కంది, పెసర, మినుము, శనగ మొదలైనవి) ఆశించే పుచ్చు పురుగుల నుండి విత్తనాన్ని రక్షించుకోవచ్చు. వస దుంపల పొడికి ఉండే ఘాటైన వాసనకు పురుగులు వికర్షించబడతాయి.
  • పేనుబంక, ఆర్మివర్మ్, కాటన్ స్టెయినర్, పెద్దక్యాబేజి వర్మ్, ఆవాల రంపపు ఈగ, విత్తన నిల్వలో ఆశించే పురుగులను వస దుంప కషాయం నివారిస్తుంది.
  • దుంప కషాయం తయారు చేసే పద్ధతి (శ్రీధర్, అతని అనుచరులు, 2002)
  • ఎండిన దుంపలను దంచి 20 గ్రాముల పొడిని కుండలోని 2 లీటర్ల నీటిలో కలిపి ఒక రోజు నిల్వ ఉంచాలి. తర్వాత వడపోసి 8 మి.లీ. సబ్బు నీరు కలిపి మరుసటి రోజు ఉదయం పంటపై పిచికారి చేయాలి.
  • విత్తన శుద్ధి (విత్తనాల నాశించే పురుగులు, తెగుళ్ళ నివారణ) (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1998)
  • ఒక మట్టి కుండలో 2.5 లీటర్ల నీరు పోసి మరిగించాలి. చల్లారిన తర్వాత 1 లీటరు ఆవుమూత్రం 50 గ్రా. దుంపపొడి కలిపి కర్రతో త్రిప్పాలి. విత్తనాలను ఈ ద్రావణంలో కలపాలి. పైకి తేలిన విత్తనాలను తొలగించి 15 నిమిషాలు ఉంచి ఆరబెట్టి విత్తాలి.
Read More

పురుగులు, తెగుళ్ళ నివారణకు మ్యాజిక్ కంపోస్టు

కావలసిన పదార్థాలు
పశువుల పేడ : 1 కిలో
పశువుల మూత్రం : 1 లీటరు
వేప ఆకులు, కానుగ ఆకులు, జిల్లేడు ఆకులు : 1 కిలో (ఒక్కొక్కటి)
బెల్లం : 50 గ్రా.

తయారు చేసే విధానం : ఒక కుండ తీసుకొని పైన చెప్పిన చెట్ల ఆకులన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కుండలో వేసి దానికి పశువుల పేడ, మూత్రం కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుండను బట్టతో కప్పి ఉంచి వారం రోజుల పాటు నీడలో ఉంచాలి. వారం రోజుల తరువాత దానిలోని మిశ్రమాన్ని వడపోసి దానికి నీటిని కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి.

  • చిన్న మొక్కలకు ఒక భాగం మిశ్రమానికి 60-70 రెట్ల నీటిని కలిపి, పెద్ద మొక్కలకైతే 30-40 రెట్ల నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి.
  • ఈ కషాయాన్ని విత్తనశుద్ధికి కూడా ఉపయోగించవచ్చు.
  • పురుగులను, తెగుళ్ళను నివారించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
  • చెదలు సమస్యగా ఉన్నచోట మ్యాజిక్ కంపోస్టు తయారీలో ఆముదం లేదా సీతాఫలం ఆకులు కలిపి తయారు చెయ్యాలి.

పంటల ఎదుగుదలకు మిశ్రమం :
పశువుల పేడ : 100 కిలోలు
పశువుల మూత్రం : 100 లీటర్లు
వేరుశనగ చెక్క (పిండి) : 100 కిలోలు

పై మూడు పదార్థాలను ఒక పాలిథిన్ పట్టాపై వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక ఎకరం పొలానికి సరిపోతుంది. మిశ్రమాన్ని పొలంలో సమంగా పడేలా చల్లుకోవాలి. దీనిని వాడటం వలన పంటలకు కావలసిన పోషక పదార్థాలు లభించి పంటలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీనిని అన్ని పంటలలోనూ వాడుకోవచ్చు.

Read More