కొబ్బరిపాలు + పుల్ల మజ్జిగ…|

పంట పెట్టడం ఒకెత్తయితే… అది ఆరోగ్యంగా ఎదిగేలా చూసుకోవడం ఒకెత్తు. మార్కెట్‌లో నూటారు పేర్లతో గ్రోత్ ప్రమోటర్లను అమ్ముతున్నారు. అయితే, వీటిని కొనకుండా కొద్దిపాటి శ్రమతో ఇంటి వద్దే పెద్ద ఖర్చేమీ లేకుండా తయారుచేసుకోవచ్చు. మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఆక్సిన్స్, జిబ్బరిల్లిన్ తదితరాలు ‘నర్రెంగ’ మొక్కలో దండిగా ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ‘అల్బీజీయా అమరా’. నర్రెంగ ఆకులను ఒక కిలో తీసుకొని, ఐదు లీటర్ల పుల్ల మజ్జిగలో వేసి, వారం రోజుల పాటు పులియబెట్టాలి. ఆ తరువాత వడకట్టి లీటర్ ద్రావణాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నర్రెంగ మొక్కలు దొరకకపోతే మరో మార్గం ఉంది. పచ్చి కొబ్బరిని రుబ్బి, పాలు తీయాలి. ఐదు లీటర్ల కొబ్బరి పాలకు ఐదు లీటర్ల మజ్జిగను చేర్చి… ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పోసుకొని పులియబెట్టుకోవాలి. వారం తరువాత ద్రావకాన్ని వడకట్టుకొని లీటరు ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ రెండు ద్రావణాలు పంటల ఎదుగుదలకే కాకుండా పూత, పిందె బాగా రావడానికి ఉపయోగపడతాయి.

Read More

మొక్కల ఎదుగుదలకు, ఫలదీకరణ శక్తి పెరగడానికి చేప అమినో ఆమ్లం

రైతు వారీగా అతి తక్కువ శ్రమ, స్వల్ప ఖర్చుతో తయారు చేసుకోగలిగేది చేప అమినో ఆమ్లం. చేపలతో అమినో ఆమ్లాలను తయారు చేసుకునే పద్ధతిని కొరియా వ్యవసాయ శాస్త్రజ్ఞుడు డాక్టర్ చోహాన్ క్యూ రూపొందించారు. ఈ విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రాకృతిక రైతులు ఆచరిస్తున్నారు.

తయారు చేసే విధానం : ముందుగా చేప పొలుసులు, ఈకలు, తోకలు తొలగించాలి. తరువాత చేపను చిన్న, చిన్న ముక్కలుగా కోయాలి. చేప ముక్కలను తూకం వేసి దానికి సరిసమానంగా బెల్లం కలపాలి. వాటిని ఒక ప్లాస్టిక్ జాడి లేదా బకెట్‌లో మూడవ వంతు వరకు నింపుకుని పైన గుడ్డ కట్టి నీడలో పెట్టుకోవాలి. కనీసం రోజుకు ఒకసారి కలియబెట్టాలి. వాతావరణ పరిస్థితులను బట్టి 10 నుండి 15 రోజుల్లో చిక్కటి ద్రావణం తయారవుతుంది. తయారైన ద్రావణం నుండి మధురమైన వాసన వస్తుంది. ఒకవేళ చేపల వాసన వస్తుంటే దానికి మరింత బెల్లం కలిపి మరో 4,5 రోజులుంచాలి.

తయారైన ద్రావణాన్ని లీటరు నీటికి 1 నుంచి 4 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి. దీనిని అన్ని పంటలపై పిచికారి చేసుకోవచ్చు.
Read More

చేప వ్యర్థాలతో పోషక మిశ్రమం

వికె-నార్డెప్ స్థానికంగా లభించే వనరుల ద్వారా సేంద్రియ పద్ధతిలో పంటల పెరుగుదలకవసరమైన ముఖ్య పోషకాలన్నీ కలిగి ఉన్న పోషక మిశ్రమాన్ని చేప వ్యర్థాలనుపయోగించి చేసే కొత్త టెక్నాలజీని రూపొందించింది.

 తయారీ విధానం : దీని తయారీకి సుమారు 20 కి. చేపల వ్యర్థాలను సేకరించి 40 లీ. సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ క్యాన్‌లో నిల్వ ఉంచాలి. దీనికి 10 లీ. నీటిని, 20-30 మి.లీ. బొప్పాయి పాలను (పపైన్) కలపాలి. (ముదిరిన ఆకుపచ్ౘ్రంగు బొప్పాయి కాయపై బ్లేడుతో చిన్నగాట్లు చేసి పాలను సేకరించాలి).

చేప వ్యర్థాలను పపైన్‌తో బాగా కలిపి 5-8 గంటలుంచాలి. పాత్రను మూసి ఉంచి ప్రతి గంటలకు ఒకసారి కలియత్రిప్పాలి.

పులియ బెట్టడం
5-8 గంటల తర్వాత బెల్లం ద్రావణాన్ని (4 కి. బెల్లాన్ని 5 లీ. నీటిలో కలిపి) చేప వ్యర్థాలకు కలిపి బాగా కలియత్రిప్పాలి. ఈ మిశ్రమాన్ని 15-20 రోజులు బాగా పులియనివ్వాలి. ఈ సమయంలో చేప పొలుసులు, ఎముకలు బాగా క్షీణించి పోతాయి.
15-20 రోజులు పులిసిన తర్వాత పులిసిన పదార్థానికి 2 నుండి 5 రెట్లు నీరు కలిపి ద్రావణం తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. పూర్తిగా కరగని పదార్థమేదైనా ఉంటే దానిని భూమికి ఎరువుగా వేయాలి.
పంటపై పిచికారి చేయడానికి 250 నుండి 500 మి.లీ. ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ ఫార్మ్యులేషన్‌ని అన్ని కూరగాయలు, పూల పంటల్లో ఉపయోగించవచ్చు. బెండ, తోటకూర, పాలకూర, వంగ, టమాట పంటలపై విస్తృత పరిశోధనలు జరిపి మంచి ఫలితాలను పొందారు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

మొక్కకు పోషకాలనందించే సస్యామృతం

వివిధ రకాల ఔషధ మొక్కలు, ఆవు పేడ ఆవు మూత్రంలో పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు : ఇది మొక్కకు పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగుళ్ళను నివారిస్తుంది.

 తయారీకి కావలసిన పదార్థాలు : ఆవు పేడ - 30-40 కి.; ఆవు మూత్రం - 5 లీ.; పాలుకారే మొక్కల (పాలకొడిశ, జిల్లేడు, జట్రోఫా, బొప్పాయి మొదలైనవి) ఆకులు - 5 కి.; ఘాటైన వాసనగల మొక్కల (వయ్యారిభామ, అత్తాకోడలు, తంగేడు తదితరాలు) ఆకులు - 5 కి.; నూనె గింజల చెక్క (వేరుశనగ, ఆముదం, కానుగ, నువ్వులు, వేప) చెక్కలో ఏదైనా - 2 కి.; బెల్లం - 1కి.; నువ్వులు, కంది లేదా పొగాకు కట్టెలు కాల్చిన  బొగ్గు లేదా పిడకబూడిద; నీరు - 100 లీ.; పై పదార్థాలన్నీ పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా తొట్టి. 

తయారీ విధానం :

  • ముందుగా సేకరించిన ఆకులను తరిగి పెట్టుకోవాలి.
  • వీటిని ఆవుపేడ, మూత్రాలతో కలిపి డ్రమ్ములో వేసుకోవాలి.
  • దీనికి నూనె చెక్క బూడిద, బెల్లం కలపాలి.
  • డ్రమ్ములో వేసిన ఈ పదార్థాలను రోజు కలుపుతూ ఉండాలి.
  • తొట్టి లేదా డ్రమ్ము పై గోనె పట్టా కప్పి వుంచాలి.
  • వారం రోజుల్లో పూర్తిగా పులిసిపోయిన తర్వాత తయారైన ద్రావణాన్ని వడపోయాలి. ఆకులు, ఇతర పదార్థాల పిప్పి ఏదైనా మిగిలి వుంటే మొక్కలకు మల్చింగ్గా ఉపయోగించాలి.
  • తయారైన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్లు డ్రిప్పు ద్వారా లేదా కాలువ ద్వారా పారించాలి.
  • మొక్కల పూత, కాత, గింజకట్టే దశల్లో 5 శాతం ద్రావణాన్ని పిచికారి చేయాలి.
Read More

నేల సారవంతానికి ‘గార్బేజ్ ఎంజైమ్‌’

గార్బేజ్ ఎంజైమ్‌ను థాయ్‌లాండ్‌కి చెందిన డా. రోసుకాన్ ఆవిష్కరించారు.

తయారీవిధానం : కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు, మార్కెట్లో చెత్త కుప్పలో వేసిన మిగలపండిన పండ్లు, కూరగాయల వ్యర్థాలకు కొంచెం నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ పంచదార కలిపి 90 రోజులు మురగబెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.

కావలసిన పదార్థాలు :

  • మూత బిగుతుగా పెట్టడానికి వీలుపడే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ము
  • కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, మొక్కలు కుళ్ళినవి 3 పాళ్ళు)
  • నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ (బ్రౌన్) సుగర్ – 1 పాలు
  • నీరు Ð 10 పాళ్ళు

పైవాటినిన్నంటినీ బాగా కలపాలి. దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి కలపవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి గాలిచొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగులకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. మొదటి 30 రోజుల పాటు, రోజుకోసారి మూత తీసి వాయువులు బయటికి వెళ్ళాక, మరలా గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడపోసి నిల్వ చేసుకుని 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చిన వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. లేదా మళ్ళీ గార్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడవచ్చు.

ప్రయోజనాలు : దీనిలో ఉన్న సూక్ష్మ జీవరాశులు, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ ఎరువుగా, కీటకనాశినిగా, శిలీంద్ర, బాక్టీరియా, వైరస్ తెగుళ్ళ నివారణిగా పనిచేస్తుంది. దీనిని వాడితే పంటల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. దీనిని నీటిలో తగినపాళ్ళలో కలిపి వాడుకోవాలి.

  • ఎరువుగా : 1:1000 పాళ్ళలో కలిపి నేలలో పోయవచ్చు. లేదా పంటలపై పిచికారి చేయవచ్చు.
  • పురుగులు / తెగుళ్ళ నివారణకు : 1:100 పాళ్ళలో కలిపి పిచికారి చేయవచ్చు.
  • దిగుబడి పెంచడానికి : 1:500 పాళ్ళలో కలిపి పిచికారి చేయాలి.
  • పశుపోషణకు, కోళ్ళ పెంపకానికి ఉపయోగించవచ్చు.
  • ఇల్లు, మరుగుదొడ్డి పరిశుభ్రతకు వాడవచ్చు.
Read More

మాంసం, వరి పొట్టుతో కునపజలం

ఆదికాలంలోనే భారతీయ వ్యవసాయ శా¢స్తం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రసిద్ధ ప్రాచీన వ్యవసాయ శా¢స్తవేత్తలు ప్రాచీన రుషులు, పరాశరుడు, సురపాలుడు తదితరులు అతద్భుతమైన పరిశోధనలు జరిపి గ్రంథస్థం చేశారు. సురపాల మహర్షి రాసిన వృక్షాయుర్వేదంలో కునపజలం అనే ద్రావణ ఎరువుని ప్రస్తావించారు. సంస్కృతంలో కునప అంటే మృత కళేబరం. జలం అంటే నీరు. అంటే శవం కంపుకొట్టే నీరని అర్థం. ఇది మొక్కలకు పోషక ద్రావణంగానూ ఉపయోగపడుతుంది. దీన్ని చేపల వ్యర్థాలతోనూ, కోడిమాంసం వ్యర్థాలతోనూ, పంది, జింక, ఇతర అడవి జంతువుల మాంసంతోనూ తయారుచేసేవారు. అడవులు అంతరించి జంతువులు కనుమరుగవుతున్న కాలంలోనే ప్రస్తుతం చేపల వ్యర్థాలు, కోడి మాంసం వ్యర్థాలతోనూ తయారు చేసుకోవచ్చు. కోడి మాంసపు వ్యర్థాలతో చేసేదాన్ని కుక్కుట కునప అంటారు.

ఆవు పేడ, పంచితం, పాలు, పెరుగు, నెయ్యి తదితరాలతో తయారుచేసే ‘కునపజలం’ పంటలు ఏపుగా పెరగడానికి.. పురుగులు, తెగుళ్ల ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, మాంసం, వరిపొట్టు కూడా కలిపి కునపజలం తయారుచేస్తే, మరింత శక్తివంతంగా పనిచేస్తుందంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజిస్ట్) ఇక్రిశాట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన డా॥ వై.ఎల్.నెనె. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ కునపజలం కన్నా ఈ కునపజలం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని డా॥ నెనె అంటున్నారు.

తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కిలోలు, పంచితం 4 లీటర్లు, పాలు 3 లీటర్లు, పెరుగు 2 లీటర్లు, నెయ్యి కిలో, మాంసం (గొడ్డు మాంసం తప్ప ఏదైనా) 3 కిలోలు, వరిపొట్టు 2 కిలోలు, చెరకు రసం 3 లీటర్లు లేదా నల్లబెల్లం కిలో, లేత కొబ్బరినీరు 2 లీటర్లు, బాగా మగ్గిన అరటిపండ్లు 12, కల్లు 3 లీటర్లు.

తయారుచేసే పద్ధతి: మాంసాన్ని, వరిపొట్టును ఉడకబెట్టిన తర్వాత మాత్రమే కునపజలం తయారీలో వాడాలి. మాంసంలో అధిక పోషకాలుంటాయి. వరిపొట్టులో సిలికా ఉంటుంది. పురుగులు, తెగుళ్లను తట్టుకునే శక్తిని సిలికా పెంపొందిస్తుంది. ఉడకబెట్టిన మాంసం, వరిపొట్టుతో పాటు పేడ, పంచితాలను వెడల్పాటి మూతిగల మట్టి లేదా ప్లాస్టిక్ తొట్టి లేదా డ్రమ్ములో కలిపి, పాత్రపై పలుచని వస్త్రాన్ని కప్పి, నీడగా ఉండే ప్రాంతంలో రెండు వారాలు పులియనివ్వాలి. ప్రతి ఉదయం, సాయంత్రం సవ్యదిశలో కొద్దిసేపు కర్రతో కలపాలి. 2 వారాల తర్వాత మిగతా వాటిని కూడా కలిపి మరో వారం రోజులు పులియబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి వాడుకోవచ్చు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

ఉపయోగించే విధానం: ఎకరానికి 100-150 లీటర్ల నీటిలో 3 లీటర్ల కునపజలాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో 3 నుంచి 4సార్లు పంటలపై పిచికారీ చేయాలి. ఈ మధ్యలో వర్షం కురిస్తే 1 లేదా 2 సార్లు అదనంగా పిచికారీ చేయాలి.

ఉపయోగాలు: ముఖ్యంగా పత్తి, మిరప, వరి, కూరగాయలు, పండ్ల తోటలపై బాగా పనిచేస్తుంది. దీనివల్ల పంట గింజల బరువు పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు పంటలను ఆశించవు. పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల నాణ్యత పెరిగి సహజసిద్ధమైన రంగు, రుచి, వాసన వస్తుంది. కూరగాయ పంటల నాణ్యత పెరిగి మంచి మెరుపు వస్తుంది.

దిగుబడిని పెంచే కునపజలం
కావలసిన పదార్థాలు : మాంసం-1 కిలో; మినప పప్పుపొడి -1/4 కి.; నువ్వులు- 1/4 కి.; నల్లబెల్లం- 1/4 కి.; ఆవుపాలు – 1 లీటరు; ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె – 50 గ్రాములు; మంచి నీరు – 5 లీటర్లు

తయారు చేసే విధానం : మాంసాన్ని నీటిలో వేసి సన్నని మంటపై సగం కషాయం అయ్యే వరకు ఉడికించాలి. 2 గంటలు చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. సన్నని మంటపై మళ్ళీ మరగించాలి. పొంగువచ్చిన తర్వాత మినపపిండి, దంచిన నువ్వులు, బెల్లం వేసి కలియబెడుతూ ఉండాలి. పొంగు వచ్చిన వెంటనే పాత్రను దించి, చల్లార్చి, మట్టికుండలో పోయాలి. అందులో ఆవుపాలు పోసి, కుండపైన మూకుడు పెట్టి గట్టి గుడ్డతో వాసిన కట్టి పెంట పోగు కింద లేక మట్టి గుంతలో పాతి పెట్టాలి. 11వ రోజు బయటకు తీసి కషాయాన్ని వడపోయాలి. ఈ కషాయాన్ని వేరొక కుండలో పోసి దానికి నెయ్యి లేక నూనె కలిపి పాత్రపై మూకుడు పెట్టి ఒక ప్లాస్టిక్ కాగితంలో ఉంచి గట్టిగా తాడుతో కట్టి 10 రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11వ రోజు నుంచి ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు. 3 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఏ పంటపైనన్నా పిచికారి చేయవచ్చు. పంటకాలంలో రెండుసార్లు పిచికారి చేయవచ్చు. ఇది ప్రభావశీల ఔషధం. పంట దిగుబడి 20% పెరుగుతుంది.

Read More