వండని వంట… ఫ్రూట్ సలాడ్

మామూలుగా బయట దొరికే ఫ్రూట్ సలాడ్‌లో కస్టర్డ్ పౌడర్, చక్కెర, పాలలో వేసి మరిగించి చల్లారాక ఫ్రూట్స్ వేసి కలుపుతారు.

చక్కెర, కస్టర్డ్ పౌడర్ లేకుండా, పాలను మరిగించకుండా ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.ఉడికించని ఆహారం కనుక, జీవశక్తిపూరితంగా ఉంటుంది.

తయారీ విధానం: రెండు అరటిపళ్ళు, నాలుగు సపోటాలు బాగా మాగినవి, కొన్ని అంగూర (ద్రాక్ష) పండ్లు, రెండు దోర జామపండ్లు, అన్నిటినీ సన్న ముక్కలుగా తరిగి గిన్నెలో వేసుకొని, పచ్చి పాలు పోసి కలుపుకొని, కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి.

కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.

జీడీపప్పు, బాదం పప్పు ఉంటే వేసుకోవచ్చు.

మాములుగా తినొచ్చు, లేదా ఎండలు బాగా వున్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే, కడుపుకు చల్లగా హాయ్‌గా ఉంటుంది.

చక్కెర అవసరం లేదు. పళ్ళలో వుండే తీపి సరిపోతుంది. ఇంకా తీపి కావాలనిపిస్తే, తేనే కలుపుకోవచ్చు !

రచన: శివారెడ్డి కర్నాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… కడుపులో చల్లటి భోజనం

మామూలుగా ఎండాకాలంలో ఏమి తినాలనిపియదు. నీళ్లు బాగా తాగిన తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది, కాసేపటికి నీరసం వస్తుంది, అటువంటి పరిస్థితుల్లో దీన్ని బాగా తినొచ్చు.

కావాల్సిన వస్తువులు: ఒక సగం కీర, చిన్న దోసకాయ ముక్క, మూడు నాలుగు క్యారెట్ ముక్కలు అంటే చిన్న క్యారెట్ ఒకటి, చిన్న బీట్రూట్ ముక్క రెడ్ కలర్ ఉండొద్దు అనుకుంటే బీట్రూట్ వేయకుండా ఉండొచ్చు. ఒక టమాటా, ఒక చిన్న కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు కొన్ని….

చేసుకునే విధానం: అన్ని ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు తక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది గట్టిగా లేకుండా కొంచెం లూస్‌గా ఉంటేనే బాగుంటుంది. ఉదయము, మధ్యాహ్నము ఎప్పుడైనా మనం దీన్ని తినొచ్చు. అమృత ఆహారం అనలేము, ఎందుకంటే సాల్ట్ కలుస్తుంది కాబట్టి. ఉప్పు లేకుండా కూడా బాగానే ఉంటుంది.
అన్నం తింటేనే కడుపు నిండుతుంది అనుకునేవాళ్ళు కరెక్ట్‌గా ఒక ముద్ద అన్నాన్ని పిసికి, దీంట్లో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది

కీర లేకున్నా టమాటా, ఉల్లిగడ్డ, పెరుగు…. వీటితో కూడా ట్రై చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… పప్పు పచ్చడి

పచ్చి పెసరపప్పు కానీ, పెసర్లు కానీ, మొలకెత్తిన పెసర్లు కానీ, పొట్టు పెసరపప్పు కానీ, వీటిలో ఏదైనా వాడుకోవచ్చు. పెసర్లు అయితే, నానడానికి టైం పడుతుంది. మొలకెత్తడానికి ఇంకా టైం పడుతుంది. వీటితో చేసుకోవాలంటే ముందుగా ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. అదే పొట్టు పెసరపప్పు కానీ, పెసరపప్పుతో కానీ అయితే అరగంటలో అయిపోతుంది.

దీనికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు (ఏ రకమైన పప్పు అయినా, మీ ఇష్టం) ఒక చిన్న కప్పు. ఎండుమిర్చి (ఎవరి రుచి ప్రకారం వారు వేసుకోవాలి) ఐదారు.ఉప్పు – రాళ్ళ ఉప్పు (సముద్రపు ఉప్పు కానీ పింక్ రాక్ సాల్ట్ కానీ) తగినంత. నిమ్మరసం కానీ, పుల్లటి మామిడి కాయ కానీ రుచికి తగినంత.

ఒక టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ అన్ని కలిపి నీళ్ళు లేకుండా రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాపచ్చాగా నూరుకోవాలి. మరీ మెత్తగా సుద్దలాగా నూరుకోకూడదు. మామిడికాయ అయితే, పప్పుతో పాటు వేసుకుని రుబ్బుకోవాలి. నిమ్మరసం అయితే ఆఖరున పిండుకోవాలి.

  • శ్రీమతి లతా కృష్ణమూర్తి
Read More

వండని వంట… తీపి రాగి పిండి

పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు, పచ్చళ్ళు… ఆహారంగా తయారు చేసుకోవడం వండని వంటలు. వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని ‘అమృతాహారం’ తినడం మంచిది. రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తి పూరితమైన ‘వండని వంట’ తీపి రాగిపిండి తయారీ ఇలా….

అరకిలో రాగులు, అరకిలో పెసలు లేదా మినుముల పిండి ప్రధానంగా అవసరం ఉంటుంది. రాగులను పెసలను పచ్చి వాటినే పిండి పట్టించాలి. వేపకూడదు (మర పట్టించడం కంటే, విసుర్రాయితో విసురుకోవడం మంచిది.పిండిని మర పట్టిస్తే, అధిక ఉష్ణోగ్రతకు గురౌతుంది)

పచ్చి వాసనే, జీవశక్తికి నిదర్శనం!

మొత్తం కిలో రాగులు, పెసలు (మినుములు) పొడిలో, సుమారు వంద గ్రాముల నెయ్యిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఆ పిండి మిశ్రమంలో ఎండుకొబ్బరి పొడి, వేరుశనగ పొడి, నువ్వుల పొడి (ఒక్కొక్కటి వంద గ్రాములు-పచ్చిపొడులు)

జీడిపప్పు, బాదాంపప్పు కూడా కాస్తా చేర్చుకోవచ్చు. వాటిని కూడా పొడి చేసుకుని కలపాలి. చివరికి ఎండుద్రాక్ష పండ్లను కూడా తగినన్ని కలుపుకోవాలి.

ఈ మొత్తం పొడుల మిశ్రమానికి సమానంగా, ముడిచక్కెర పొడిని లేదా ముడిబెల్లపు తురుమును కలిపి, యాలకుల పొడిని కూడా కలపాలి. ఖర్ౙూర పండ్లను చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చు. అన్ని రకాల ఎండుపండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

అంతే! రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తిపూరితమైన ‘వండని వంట’ సిద్దం అవుతుంది.
నెయ్యి కలుపుతాం కనుక, బయట కూడా నిల్వ ఉంటుంది.

ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి తగినంత తయారు చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసే సమయంలో ప్రధాన ఆహారంగా కూడా తినవచ్చు.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More

అధిక పోషక విలువలు గల తృణధాన్యాలు

ఆహారంలో మరింత ఎక్కువగా కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలు వంటి తృణధాన్యాలను వినియోగించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని మిల్లెట్ రీసెర్చ్ ల్యాబ్ విస్తృతంగా పరిశోధనలను చేస్తోంది. వాతావరణ మార్పులకు తట్టుకునే, అధిక పోషక విలువలు కలిగిన, రైతులకు గిట్టుబాటు కలిగించే కొత్త వంగడాలను ఇక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు సృష్టిస్తున్నారు. ఆచార్యులు డా. ముతమిళవరసన్ నేతృత్వంలోని విద్యార్థులు కొర్రల్లో పోషక పదార్థాల శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు జన్యు ఆధారిత అధ్యయనాలు సత్ఫలితాలిస్తున్నాయి. దేశవిదేశాలలో సేకరించిన 156 కొర్ర రకాలపై విశ్లేషణలు చేసి తక్కువ ఫైటిక్ యాసిడ్ కలిగిన వాటిని అభివృద్ధి చేశారు. ల్యాబ్‌కు సమీపంలోని ఎకరం భూమిలో కొత్తగా సృష్టించిన కొర్ర వంగ డాలను పండించి ఫలితాలను సాధించారు. వీరి పరిశోధనలకు కేంద్ర సంస్థలు రూ. 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాయి.

జావ.. దోసెలు.. ఉప్మా.. బియ్యం.. మినపగుళ్లతోనే కాదు. కొర్రలతోనూ దోసెలు చేసుకుని తినొచ్చంటూ తృణధాన్యాల పరిశోధన ప్రయోగశాల ప్రతినిధులు చెబుతున్నారు. దోసెలతోపాటు ఉప్మా, జావ కూడా తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన రుచిని పరిచయం చేసేందుకు కొన్ని రెస్టారెంట్లలో సొంతంగా తయారు చేసి ఇస్తున్నారు. మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తృణధాన్యాల్లో అధిక ఫైబర్, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు ఉండడంతో సమతుల్య ఆహారంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొర్రలు, రాగులు, సజ్ౙలు, అరికెల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

రైతులకు ఉచితంగా వంగడాలు
కొర్రలు ఎక్కువగా తింటే జీర్ణం కాదని అపోహలున్నాయి. జన్యుపరమైన అంశాలను పరిశీలిస్తే కొర్రల్లో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాసిడ్ జీర్ణక్రియను స్వల్పంగా మందగిస్తుంది. అందుకే చాలామంది ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త రకం కొర్రల వంగడాలను రైతులతో సాగు చేయించాలని పరిశోధకులు నిర్ణయించారు. రెండు, మూడు సీజన్ల వరకూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా కొత్త వంగడాలను పంపిణీ చేయించనున్నారు.

బియ్యంలో అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. సులభంగా ఎవరైనా తింటారు. పైగా తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాల్లో పేదలకు ఉచితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు అందిస్తున్నాయి. వారు కొర్రలు కొని వండుకుని ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఆయా రాష్ట్రాల్లో అల్పాహారంగా తృణధాన్యాలను ఎంపిక చేసుకోవాలని అభ్యర్థించనున్నారు.
Read More

9 రకాల చిరుధాన్యాలతో 190 రకాల ఉత్పత్తులు

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ మిల్లెట్స్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం (సీఓఈఎం) చిరుధాన్యాలను ‘రెడీ టూ ఈట్‌’లా సిద్ధం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసిన ఈ సంస్థ.. ఔత్సాహికులకు ఆయా సాంకేతికతలను అందిస్తోంది. మైసూరులోని సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఎఐ) లో గతేడాది డిసెంబరులో సీఓఈఎం ఏర్పాటైంది. ఏడాది పూర్తి చేసుకోబోతున్న ఈ కేంద్రం.. చిరుధాన్యాలలో సాధించిన ఘన ఆవిష్కరణలు…

గంటకు 500 కిలోల సామర్థ్యం
చిరుధాన్యాల ఉత్పత్తిలో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. రైతులు మాత్రం అవగాహన లేక నష్టపోతున్నారు. సీఓఈఎం ముందుగా రైతు నుంచి కార్యాచరణ మొదలుపెట్టింది. రూ.20 కోట్లతో 3 రకాల ఇంక్యుబేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని నేరుగా ఈ కేంద్రాలకు తరలించేలా అవగాహన కల్పించింది. ధాన్యం నాణ్యత, శుద్ధి, అనుబంధ ఉత్పత్తుల తయారీ రైతుల కళ్లముందే చేపడుతోంది. ప్రత్యేక ప్రాసెసింగ్‌ యంత్రాలతో గంటకు 500 కిలోల ధాన్యం శుద్ధి చేసి, ఉత్పత్తులనూ తయారు చేయడంతో రైతులకు కేంద్రంపై గురి కుదిరింది.

మెక్‌ డొనాల్డ్‌ మెచ్చింది
సీఓఈఎంలో జొన్న, రాగి, సజ్జ తదితర ధాన్యాలతో చేసిన బన్‌.. మెక్‌డొనాల్డ్‌ సంస్థకు ఎంతో నచ్చింది. దాన్ని ‘మిల్లెట్‌ బన్‌ బర్గర్‌’గా మార్చి ప్రపంచ విపణికి పరిచయం చేసింది.

వివిధ రకాల ఉత్పత్తులు
చిరుధాన్యాలు శుద్ధి చేసేటప్పుడు వచ్చే వ్యర్థాలనూ ఈ ఇంక్యుబేషన్‌ కేంద్రంలో వృథాగా పోనివ్వడం లేదు. రాగి పొట్టు నుంచి అయిల్‌, విరిగిన రాగులతో సేలాలు, పగుళ్లిచ్చిన గింజలతో ‘రాగి రైస్‌’, నూకతో రవ్వ, మురుకులు ఇలా.. ఒక్క రాగులతోనే 45 రకాల ఉత్పత్తులు చేస్తోంది. వాటికి అదనపు పోషకాలూ జోడిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో 9 రకాల ధాన్యాలను 190 రకాల ఉత్పత్తులుగా మలిచే వ్యవస్థలున్నాయి. బయో డిగ్రేడబుల్‌, తినదగిన ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలు తయారు చేస్తోంది. వినియోగదారుడు కోరుకున్న రంగులు, రుచులను చేర్చేందుకు ఎలక్ట్రానిక్స్‌ నోస్‌, మౌత్‌ అప్లికేషన్లు, ప్యాకేజింగ్‌ వ్యవస్థలూ తీసుకొచ్చింది.

నిల్వకు పెద్దపీట..

  • చిరు ధాన్యాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉన్నా.. వాటి పిండి, రవ్వ ఇతర ఉత్పత్తుల నిల్వ కాలం తక్కువ.
  • సీఓఈఎం ప్రత్యేక పద్ధతుల్లో 4-5 నెలలపాటు నిల్వ చేసుకునేలా చేసింది.
  • ఇందుకు తొలుత వైబ్రో క్లీనర్ల ద్వారా ధాన్యం శుభ్రం చేసి, స్టీమింగ్‌ ట్యాంకర్లు, డ్రైయర్‌ బెడ్ల ద్వారా ఆరబెట్టి ఎప్పుడంటే అప్పుడు వాడుకు నేలా పాలిష్‌ చేస్తోంది.
  • ఆ తర్వాత వినియోగదారుడికి అవసరమైన ఉత్పత్తులుగా మార్చుతోంది.
  • ధాన్యం నిల్వకూ ఈ కేంద్రంలోనే గోదాములు ఏర్పాటు చేసింది.
Read More

దేశ ఆహార భద్రతను స్వామినాథన్‌ తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు

మన వ్యవసాయ రంగం పోషకాహార భద్రత, పంటల్లో భిన్నత్వం, వాతావరణాన్ని తట్టు కునే పంటలు, టెక్నాలజీలు ఈ నాలుగు చతుర్విధ లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్‌. స్వామినాథన్‌ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామినాథన్‌కు నివాళిగా ప్రత్యేక నాణేన్ని, పోస్టల్‌ స్టాంపును విడుదల చేశారు. ‘వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధను, మెషీన్‌ లెర్నింగ్‌ను ఉపయోగించుకుని కరవును, వేడిని, వరదలను తట్టుకునే పంటలను అభివృద్ధి చేయాలి. రియల్‌ టైమ్‌లో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని ప్రతి జిల్లాలో అందుబాటులోకి తేవాలి. తద్వారా పంటల దిగుబడిని, తెగుళ్ల నివారణను, సాగు విధానాలను పర్యవేక్షించాలి. భూములకు సరిపడే పంటలను నిర్ణయించాలి. పంటల మార్పిడిపై పరిశోధనలు జరగాలి. సౌర విద్యుత్తు ఆధారిత మైక్రో ఇరిగేషన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ రంగానికి దివంగత స్వామినాథన్‌ చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. ఆయన మన దేశానికి ఓ రత్నం లాంటి వారని పేర్కొన్నారు. దేశ ఆహార భద్రతను తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఆలోచనలు నేటి వ్యవసాయ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తు న్నాయి’ అని పేర్కొన్నారు.

ఎం.ఎస్‌.స్వామినాథన్‌ శత జయంతి అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీతో ఎంఎస్‌ఎస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఛైర్పర్సన్‌ సౌమ్యా స్వామినాథన్‌, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తదితరులు

Read More