‘జీవామృతం’ తో జవజీవాలు

జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)

  • 200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
  • 10 కిలోల పేడ (నాటు ఆవు)
  • 5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం
  • 2 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్టమైనది)
  • 2 కిలోల పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి, ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
  • పొలం గట్టు మట్టి…పిడికెడు

రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి… బీజామృతం, అచ్ఛాదన, నీటి యాజమాన్యం.

జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.

జీవామృతం తయారీ విధానం:
ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపైన పిచికారీ చేయొచ్చు.

పంటలపై జీవామృతం పిచికారీ ఇలా…
3 నెలల్లో (60Ð90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. జీవామృతంను కలిపి చల్లాలి.
నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు).
6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి చల్లాలి.
రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి.
నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
ఐదోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి.
ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి.
జీవామృతం, పంచగవ్య తదితరాల తయారీలో వాడే ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. వారం రోజుల వరకు పర్వాలేదు. మూత్రం మాత్రం ఎంత పాతదైతే అంత మేలు జరుగుతుంది.

Read More

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా గుర్రపుడెక్కతో ఎరువు తయారీ

వినూత్న రీతిలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. పంట కాలువల్లో విపరీతంగా పెరిగే ఈ గుర్రపు డెక్కతో సాగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఏళ్లుగా అన్నదాతలను పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఇదొకటి. మరోవైపు, గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం ఏటా భారీగా ఖర్చు చేస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు పశ్చిమగోదావరి కలెక్టర్‌ చదలవాడ నాగరాణి వినూత్నంగా ఆలోచించారు. ‘గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీకి శ్రీకారం చుట్టారు. డీఆర్‌డిఏ పీడీ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం సిద్ధాపురంలోని సంపద తయారీ కేంద్రంలో కుండీల్లో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీని ప్రయోగాత్మంగా చేపట్టారు. ఫలితంగా అన్నదాతల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు.. మహిళల ఉపాధికి అవకాశం ఏర్పడినట్లైంది. గుర్రపు డెక్క ముక్కలు, ఆవుపేడ, మైక్రోబియల్‌ కల్చర్‌తో ఇలా చేశారు. 3-9 అడుగుల కుండీల్లో కింద గడ్డిని పొరగా వేసి, ఆపైన ముక్కలుగా చేసిన గుర్రపుడెక్క, దానిపైన రెండు అంగుళాల మందంలో ఆవుపేడను ఏడు నుంచి ఎనిమిది పొరలుగా వేశారు. 21 రోజుల పాటు అలా వదిలేశారు. అనంతరం మైక్రోబయల్‌ కల్చర్‌ను వాడి త్వరగా కంపోస్టింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు. ఆ మిశ్రమాన్ని ఏడు వారాల తర్వాత గుళికలుగా తయారుచేశారు. ఎరువు తయారీ ప్రాంతాన్ని క్రిమికీటకాలు ఆకర్షించే ప్రమాదం ఉండడంతో ఇళ్లకు, గోదాములకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.*నాణ్యమైన సేంద్రియ ఎరువు… తక్కువ సమయంలో…* గుర్రపుడెక్క ఎరువు సాధారణ సేంద్రియ ఎరువు కంటే రెండు నుంచి మూడు రెట్లు నాణ్యంగా ఉన్నట్లు ప్రయోగ పరీక్షల్లో తేలింది. ఈ తీగ కుళ్లడానికి తక్కువ సమయం పడుతోంది. పశువుల వ్యర్థాల కన్నా ఇందులో నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ కర్బనం, కాపర్‌, మాంగనీస్‌, జింక్‌, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఈ సేంద్రియ ఎరువు 6 నెలలపాటు నిల్వ ఉంటుంది. మిద్దె పంటలు, కొబ్బరి, మామిడి, సపోటా, కూరగాయలు, ఆయిల్‌పామ్‌, పూలమొక్కలు, కూరగాయలు, వరి, ఉద్యాన పంటలన్నింటికీ గుర్రపుడెక్కతో తయారుచేసిన ఎరువును ఉపయోగించుకోవచ్చు.*స్వయం ఉపాధి మార్గం* ఎరువు తయారీని మహిళా సమాఖ్యలకు అప్పగించడంతో ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన సేంద్రియ ఎరువు దొరుకుతోంది. గుర్రపుడెక్కతో తయారుచేసిన సేంద్రియ ఎరువు ధర కిలో రూ.12 నుంచి రూ.15గా, టన్ను రూ.12 వేలుగా నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే 100 యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎరువు తయారు కావడానికి ఒక్కో యూనిట్లో 20 మందికి 50 రోజుల పాటు ఉపాధి లభిస్తుంది. దీనిని రైతులే స్వయంగా తయారు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

Read More