ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు

సాధారణంగా ఒక మామిడి చెట్టుకు ఒకటి లేదా రెండు రకాల పండ్లే కాస్తుంటాయి. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా దిట్ల గ్రామంలో ఓ చెట్టుకు 12 రకాల పండ్లు కాస్తున్నాయి. రంగు, రుచి, సువాసన, పరిమాణం, బరువుల్లో అవన్నీ వేర్వేరు. 50 గ్రాముల నుంచి 2 కేజీల దాకా బరువున్న మామిడి పండ్లు ఆ చెట్టుకు కాస్తున్నాయి. ఉకాభాయ్‌ అనే రైతుకు చెందిన మామిడితోటలో ఈ చెట్టు ఉంది. అన్ని సీజన్లలోనూ డజను రకాల మామిడి పండ్లు కాస్తుండటం ఈ మామిడి చెట్టు ప్రత్యేకత. మొదటి నుంచీ ఉకాభాయ్‌ మామిడి సాగులోనే ఉన్నారు. అంటుకట్టే పద్ధతి ద్వారా మేలురకం మామిడి వంగడాల తయారీకి ఆయన నిత్యం ప్రయోగాలు చేస్తుంటారు. వీటి ఫలితంగానే 12 రకాల పండ్లను అందించే మామిడిచెట్టు ఏర్పడింది.

ఎలా అంటుకట్టారంటే..
మేలు రకం మామిడి వంగడాల తయారీకి ఉత్తమ లక్షణాలు కలిగిన ఒక మామిడి మొక్కను సేకరించాలి. దాని వేర్ల భాగాన్ని తొలగించాలి. మరో మేలు రకం మామిడి మొక్కను సేకరించాలి. దాని కాండం ఎగువ భాగాన్ని సగానికి పైగా కత్తిరించి తొలగించాలి. ఈ మామిడి మొక్కకు వేర్లు ఉంటాయి. అందువల్ల దీన్నే నేలలో నాటాలి. అనంతరం దీనిలోని సగం కాండంపై, అంతకుముందు మనం సిద్ధం చేసుకున్న మొక్క కాండాన్ని అతికించి కట్టు కట్టాలి. ఇలా ఒకేచెట్టుకు తీరొక్క పండ్లను చూసి ఉకాభాయ్‌ ఉప్పొంగిపోతున్నారు. మామిడి వంగడాల తయారీకి ఇకపైనా తన ప్రయోగాలను కొనసాగిస్తానని ఆయన ‘ఈటీవీ భారత్‌’కు చెప్పారు. ఇలాంటి మామిడి చెట్లు పెద్దసంఖ్యలో అందుబాటులోకి వస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు.

Read More

మూడోవారంలో ప్రారంభంకానున్న మామిడి ఎగుమతులు

నున్న మార్కెట్లో షాపులు తెరిచేందుకు సిద్ధం
పలు రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు

మామిడి సీజన్‌ వచ్చేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద మామిడి మార్కెట్‌లో ఒకటైన నున్న మ్యాంగో మార్కెట్‌లో ఈనెల మూడో వారంలో షాపులు తెరిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మార్కెట్లో మొత్తం 40 దుకాణాలు ఉన్నాయి. ఇప్పటికే మామిడి కాపునకు రావడంతో వ్యాపారులు దుకాణాలను సిద్ధం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

కరోనా నుంచి తగ్గిన వ్యాపారం
నున్న మ్యాంగో మార్కెట్లో గతంలో మూడు పూలు ఆరు కాయలుగా ఉన్న మామిడి ఎగుమతులు కరోనా నుంచి తగ్గుముఖం పట్టాయి. ఓపక్క వాతావరణం అనుకూలించక మామిడి దిగుబడులు తగ్గడం వలన సతమతమైన వ్యాపారులు కరోనా కాలంలో మరింతగా దెబ్బతిన్నారు. ఈ ఏడాదైనా దిగుబడి పెరిగి వ్యాపారం అభివృద్ధి చెందుతుందనే ఆశాభావంతో ఉన్నారు. ఇక్కడి నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు మామిడి కాయలు ఎగుమతి చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని చూస్తున్నారు. బంగినపల్లి, చెరుకు రసాలు, నీలాలు, కోలాపూరీ, చిన్న రసాలు, పెద్ద రసాలు, సుందరి తదితర రకాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి.

లోకల్‌ మండీలతో కష్టాలు
నున్న మ్యాంగో మార్కెట్‌కు ప్రధానంగా నూజివీడు, విస్సన్నపేట, ఆగిరిపల్లి, తాడేపల్లిగూడెం, ఏలూరు, ద్వారకా తిరుమలతో పాటు తుని, అన్నవరం ప్రాంతాల నుంచి రైతులు మామిడి పంటను దిగుమతి చేస్తుంటారు. అయితే, ఆయా ప్రాంతాల్లో కొంతకాలంగా లోకల్‌ మండీ వ్యాపారులతో దిగుమతులు కొంతమేర తగ్గాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కొనుగోలుదారులతో లోకల్‌ మండీలు, పెద్ద రైతులు సత్సంబంధాలు కలిగి ఉండటంతో పలువురు ఇతర రాష్ట్ర కొనుగోలుదారులు నేరుగా తోటల వద్దకు వెళ్లి ఎగుమతులు చేసుకుంటున్నారు.

Read More