సెర్ప్ నుంచి గ్రామీణ మహిళలకు కొత్త పథకం

రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ మహిళలకు జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు జూన్ 2 నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. దీనికింద మహిళలతో పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె, మేక పిల్లల పెంపకం కేంద్రాలు, నాటు కోళ్లు, ఈము పక్షుల కొనుగోళ్ల యూనిట్లు ఏర్పాటు చేయిస్తారు. వారికి బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థికసాయం అందిస్తారు. పథకానికి ఎంపికైన మహిళా సంఘాల లబ్దిదారులకు పశువైద్య వర్సిటీ శిక్షణ ఇస్తుంది. దీనిపై పీవీ నరసింహారావు తెలం గాణ పశువైద్య విశ్వవిద్యాలయంతో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పశు వైద్య వర్సిటీ రిజిస్ట్రార్ శరత్‌చంద్ర ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ స్వయంసహాయక సంఘాల అభ్యున్నతి, పశుసంపద వృద్ధి కోసం ఒప్పందం చేసుకున్నట్లు దివ్యా దేవరాజన్ తెలిపారు.

Read More

త్వరలో పశు ఔషధి కేంద్రాలు

జాతీయ పశు వ్యాధుల నియంత్రణ పథకం కింద పశు ఔషధి కేంద్రాలను కేంద్ర పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు బుధవారం ప్రకటించారు. వీటితో నాణ్యమైన జనరిక్ పశు ఔషధాలు చౌక ధరలకే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కేంద్రాలను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు(పీఎం-కేఎస్‌కేలు), సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తారని, జిల్లా, మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు https://pashuaushadhi.dahd.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చు లేదా, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఈ కేంద్రాలకు ఆపరేటింగ్ మార్ౙిన్‌గా 20శాతం ఇస్తారని తెలిపారు.

Read More

రూ.150కే పెయ్య దూడ

  • నేటి నుంచి రైతులకు అందుబాటులో వీర్యం
  • రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల డోసులు

గేదెలకు పెయ్యదూడలు మాత్రమే పుట్టేందుకు వీలుగా రూపొందించిన లింగ నిర్ధారిత వీర్యం రూ.150కే అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో మాట్లాడారు. ‘లింగ నిర్ధారిత వీర్యం విలువ బహిరంగ మార్కెట్‌లో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులోకి తెస్తున్న వీర్యం ఒక్కో డోసు రూ.300 వరకు ఉండగా, రైతులకు రూ.150 సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వల్ల అతి తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం దక్కింది. గతంలో ఇదే లింగ నిర్ధారిత వీర్యం కోసం రైతులు రూ.550 చెల్లించాల్సి వచ్చేది. పశు యజమానులపై భారం తగ్గించేందుకు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుతో సంప్రదింపులు జరిపి తక్కువ ధరకు రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల డోసులు (ఒక్కో గేదెకు రెండు డోసులు) లింగ నిర్ధారిత వీర్యం గేదెలకు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ వీర్యం వేయటం వల్ల గర్భం దాల్చే ఐదు లక్షల గేదెల్లో కనీసం 90 శాతం పెయ్యదూడలు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం చేపట్టటం వలన నేరుగా 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. 2030 నాటికి పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 30 లక్షల డోసులు లింగ నిర్ధారిత వీర్యం వేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ముర్రా గేదెలు, సంకర జాతి ఆవుల హబ్‌గా తీర్చి దిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. దానివల్ల రానున్న ఐదు సంవత్సరాల్లో పశువుల్లో స్త్రీ సంపద పెరిగి పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. లింగ నిర్ధారిత వీర్యం అతి తక్కువ ధరకే అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నాం. పునరుత్పత్తి అవకాశం ఎక్కువగా ఉన్న గేదెలను ఎంపిక చేసి వీర్యం డోసులు ఇస్తాం. ఈ అవకాశం వినియోగించుకోవాలి’ అని కోరారు.

Read More