కూరగాయల సాగుపై 800 మంది రైతులకు శిక్షణ
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 మందికి రైతులకు ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా శిక్షణ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగును పెద్దఎత్తున పెంచుతామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలో.. కూరగాయల పంటలపై అఖిలభారత సమన్వయ పథకం 44వ వార్షిక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్లో భాగంగా తెలంగాణలో ఉద్యాన రంగాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో ఉన్న కూరగాయల సాగు.. లక్ష ఎకరాలకు పడిపోయిందని, వెంటనే ఈ విస్తీర్ణం పెరగాలన్నారు. విశ్వవిద్యాలయానికి మిరప, ఔషధ మొక్కల ఏఐసీఆర్పీ కేంద్రాలను మంజూరు చేయాలని ఆయన ఐకార్ను కోరారు. సమావేశంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సుధాకర్ పాండే, భారత కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ రాజేశ్కుమార్, దాదాపు 300 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


