కూరగాయల సాగుపై 800 మంది రైతులకు శిక్షణ

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 మందికి రైతులకు ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా శిక్షణ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగును పెద్దఎత్తున పెంచుతామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలో.. కూరగాయల పంటలపై అఖిలభారత సమన్వయ పథకం 44వ వార్షిక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్‌లో భాగంగా తెలంగాణలో ఉద్యాన రంగాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో ఉన్న కూరగాయల సాగు.. లక్ష ఎకరాలకు పడిపోయిందని, వెంటనే ఈ విస్తీర్ణం పెరగాలన్నారు. విశ్వవిద్యాలయానికి మిరప, ఔషధ మొక్కల ఏఐసీఆర్పీ కేంద్రాలను మంజూరు చేయాలని ఆయన ఐకార్‌ను కోరారు. సమావేశంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సుధాకర్ పాండే, భారత కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ రాజేశ్‌కుమార్, దాదాపు 300 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Read More

4 కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. తన చిన్నాయన మల్లారెడ్డి ఇచ్చిన భూమి మరియు అందులో నిర్మించిన భవనాన్ని వ్యవసాయ శాఖకు రాసిచ్చారు. యాచారం మండల కేంద్రంలోని 2 వేల గజాల భూమిని వ్యవసాయ శాఖకు కేటాయిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావును కలిసి భూమికి సంబందించిన పత్రాలను అందించారు. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 4 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. నెలరోజుల క్రితమే రైతు కమిషన్‌ బృందం, వ్యవసాయ అధికారులు కలిసి యాచారం మండలంలో పర్యటించారు. ఆ సమయంలో కోదండరెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్న భూమిని అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపితోపాటు మార్కెటింగ్‌ అధికారులకు చూపించారు. ప్రస్తుతం ఆ స్థలంలో రైతు మిత్ర కమ్యూనిటీ భవనం ఉంది. అందులో రైతులు వ్యవసాయ సామాగ్రి, ధాన్యం కొనుగోలు కేంద్రం, సీజన్‌ పంటలు నిలువ కోసం వాడుకుంటున్నారు. ఐతే ఇక ఆ స్థలాన్ని, ఆ స్థలంలో ఉన్న భవనాన్ని పూర్తిగా వ్యవసాయ శాఖకు రాసిస్తే.. రైతులకు మరింత మేలు జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరెడ్డి తెలిపారు. ఇవాళ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపిలకు ఈ విషయం చెప్పి స్థలానికి సంబంధించి పేపర్స్‌ను అందజేశారు. అదేవిదంగా యాచారం మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటుచేయాలని రైతు కమిషన్‌ కోరింది. దానికి సంబంధించి ప్రైవేట్‌ స్థలం యాచారం బస్టాండ్‌కు అనుకొనే ఉన్నట్లు కమిషన్‌ బృందం.. మంత్రికి వివరించారు. ఆ స్థలాన్ని సేకరించి మార్కెట్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇక పలు అంశాలపై వ్యవసాయ మంత్రితో కమిషన్‌ చర్చించింది. ఈ సమావేశంలో కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, సభ్యులు గోపాల్‌ రెడ్డి, భవానీ రెడ్డి, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపి, అడిషనల్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌, కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌, ఏవో హరి వెంకట ప్రసాద్‌లు ఉన్నారు.

Read More