అగ్రికల్చర్‌ బీఎస్సీ చేసిన హరియాణా యువరైతు రవి పూనియా (27) వ్యవసాయాన్నే తన వృత్తిగా ఎంచుకొన్నారు. అధిక పెట్టుబడితో, తక్కువ లాభాలను ఇచ్చే వరి, గోధుమ, ఆవాల వంటి సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి.. సేంద్రియ పద్ధతిలో సొరకాయలు, కశ్మీరీ వెల్లుల్లి (గోల్డెన్‌ గార్లిక్‌) సాగు చేసి రూ. లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. ఫతేహాబాద్‌ జిల్లాలోని భూథన్‌ ఖుర్ద్‌ గ్రామానికి చెందిన రవి తాను సాగుచేస్తున్న ఆరడుగుల సొరకాయలతో ఎకరానికి ఏడాదికి రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. ఔషధాల తయారీలో వినియోగించే కశ్మీరీ వెల్లుల్లి ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చి ఖర్చులు పోగా, రూ. 15 లక్షల ఆదాయం సాధించి పెడుతోంది. మరో వైపు.. అఫ్గాన్‌కు చెందిన జీవన్‌ రకం వెల్లుల్లిని కూడా సాగు చేస్తున్నారు.