జలధారతో కరవు తీరింది

కరవుతో ఇబ్బందులు ఎదుర్కొనే అన్నమయ్య జిల్లాలోని గాలివీడు మండలంలోని రైతులు ప్రస్తుతం కూరగాయలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. జలధారలో భాగంగా హంద్రీనీవా నీటిని వెలిగల్లు జలాశయానికి మళ్లించడంతో పాటు చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో సుమారు 900 ఎకరాల్లో మల్చింగ్ విధానంలో టమాటా, ఇతర కూరగాయలు పండిస్తు న్నారు. డ్రోన్‌తో ఫొటో తీసిన క్రమంలో మల్చింగ్ పేపర్లతో ఆ ప్రాంతమంతా ఈ విధంగా కనిపించింది.

Read More

ఉత్తరాంధ్రలో రెండేళ్లలో 11 ప్రాజెక్టులు పూర్తి

ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు రాబోయే రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీంతో 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రాగా, మరో 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ లపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘2021లో వంశధార ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పును గెజిట్ ప్రచురణ చేయించడంలో సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. కేంద్ర మంత్రి, కేంద్ర జలశక్తి అధికారులతో తరచూ సంప్రదింపులు జరిపి ఇది సాధించారు. ఫలితంగా నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి’ అని పేర్కొన్నారు. సమావేశంలో జలవనరులశాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, ఓఎస్డీ కె.వి.ఎల్.ఎన్. చౌదరి, ఉత్తరాంధ్ర జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More

యాసంగిలో 43 లక్షల ఎకరాలకు సాగునీరు

బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివమ్‌) సమావేశం ఈఎన్సీ అంజద్‌ హుస్సేన్‌ అధ్యక్షతన జరిపి యాసంగి పంట కాలంలో 43 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబరు మూడో వారం నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయాలని ఇందులో నిర్ణయించారు. సమావేశంలో చర్చించిన అంశాలిలా ఉన్నాయి.

  • రాష్ట్రవ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్నతరహా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం సాగునీటి వినియోగానికి 370 టీఎంసీల లభ్యత ఉంది. దీన్ని దాదాపు 43 లక్షల ఎకరాలకు అందించాలని నిర్ణయించారు.
  • ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, నిజాంసాగర్‌, నాగార్జునసాగర్‌, శ్రీశైలం తదితర భారీ ప్రాజెక్టుల్లో జూన్‌ నెలాఖరు నాటికి తాగునీటి అవసరాలు పోను 288.64 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 30.97 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాలని ప్రతిపాదన చేశారు.
  • చిన్నతరహా ప్రాజెక్టుల పరిధిలో 42.11 టీఎంసీలతో 7.5 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్టుల కింద 10 టీఎంసీలతో 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు.
  • మధ్యతరహా ప్రాజెక్టుల్లో 28.95 టీఎంసీలు ఉన్నాయి. వీటి ద్వారా 2.78 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
  • 24.61 లక్షల ఎకరాల తరి, 18.45 లక్షల ఎకరాల ఆరుతడి పంటకు నీరు ఇవ్వనున్నారు.
Read More