ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి టి.జి. భరత్‌ కేంద్ర మంత్రి చిరాగ్‌ పాస్వాన్‌ను ఆయన దిల్లీలో కలిసి సమీకృత టమాటో వాల్యూ చైన్‌ ప్రాజెక్టును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి యూనిట్ల అభివృద్ధికి సంబంధించిన అంశాల పైనా ఆయనతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ.. ”రాష్ట్రంలోని ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పివో)లను ప్రోత్సహించేందుకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలి. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్ర్‌ప్రైజెన్‌ పథకం కింద స్టార్టప్‌లు, సూక్ష్మ పరిశ్రమలను బలోపేతం చేసేందుకు వీలుగా తిరుపతి, బాపట్ల, లాం, పులివెందుల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలపాలి. రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కల్పించేందుకు పంట కోత తర్వాత నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు ఆహారశుద్ధి యూనిట్లను బలోపేతం చేయడంలో కేంద్రం సహకరించాలి. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు” అని వెల్లడించారు.