సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో ఆయిల్‌పామ్‌లో మంచి ఫలితాలు

తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగులో ఆధునిక సాంకేతికతను, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇక్రిశాట్‌లో 100 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్‌లో నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి రకాల వృద్ధి, హైబ్రిడ్ సృష్టికి ఇందులో పరిశోధనలు జరగనున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉద్యాన శాఖ, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలను ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కోసం భారత్ ఆయిల్‌పామ్ పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్) ని సైతం భాగస్వామిగా చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రంలో 2.91 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఏటా రెండు లక్షల ఎకరాల పెంపుదలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రభుత్వ రంగంలో ఆయిల్‌ఫెడ్, ప్రైవేటు రంగంలో 14 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయిల్‌పామ్ సాగుకు సబ్సిడీలను ఇస్తోంది. ఇంత చేస్తున్నా ఆశించిన స్థాయిలో సాగు పెరగడంలేదు. ఈ నేపథ్యంలో ఆయిల్షామ్ సాగుకు ఏర్పడుతున్న అడ్డంకులను ప్రభుత్వం అధ్యయనం చేయించి, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

Read More

నేల ఆరోగ్యంతోనే పౌష్టికాహారం

నేల ఆరోగ్యంగా ఉంటేనే పౌష్టికాహారం అందుతుంది కాబట్టి రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)ల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో భూసార ఆరోగ్య వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ‘పిల్లి పెసర, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్ల ద్వారా నేల సారాన్ని పెంచాలి. పంట అవశేషాలు తగల బెట్టకుండా వాటిని ఎరువులుగా ఉపయోగించాలి. నేల ఆరోగ్య పరిరక్షణను ఉద్యమంలా నిర్వహించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నాం. వారు రైతులకు నేల యాజమాన్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే నైపుణ్యాలను వృద్ధి చేస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలి” అని మంత్రి సూచించారు. అంతకుముందు మంత్రి ఇక్రిశాట్‌లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) హిమాన్ష్ పాఠక్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ బాషా, అగ్రివర్సిటీ వీసీ రాజిరెడ్డి, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ కమిషన్ బృందం ఇక్రిశాట్‌ను సందర్శించింది

అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ బుధవారం సందర్శించింది. కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గడుగు గంగాధర్, భవానిరెడ్డి, కేవీఎన్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి కమిషన్ బృందంలో ఉన్నారు. పంట క్షేత్రాలను ప్రయోగశాలలను పరిశీలించింది. జొన్న, వేరుసెనగ, శనగ, కంది, ఇతర తృణధాన్య పంటల గురించి అక్కడి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్‌పాఠక్, అధికారులు, శాస్త్రవేత్తలతో బృందం సమావేశమై.. పంటల మార్పిడి, ఆరుతడి పంటలు, నీటి సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, రైతుల ఆదాయం పెంపు, చీడ, పీడల బెడద లేకుండా సాగు తదితర అంశాలపై చర్చించింది.

Read More

జన్యువుల వృద్ధితో వేరుశనగ పంట దిగుబడి పెరిగింది

పంటలో జన్యువులు వృద్ధి కారణంగా వేరుశనగ దిగుబడిలో ప్రతి యేటా పెరుగుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మెట్టప్రాంతాల పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్‌) అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌తోపాటు వివిధ ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని స్పానింగ్‌బంచ్‌, వర్జీనియాబంచ్‌ అనే రెండు ప్రధాన రకాలలో కాయ దిగుబడి, గింజ శాతం, గింజ బరువు ప్రాతిపదికన రెండేళ్లలో నాలుగు పంట సీజన్లలో విస్తృత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయం తేల్చింది. మూడు నుంచి నాలుగు నెలల కాలంలో పండే పంటకు యేటా హెక్టారుకు సుమారు 27 కిలోలు.. ఆరు నెలల్లో కాతకొచ్చే రకాల్లో హెక్టారుకు 25 కిలోల దిగుబడి పెరుగుదలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్రిశాట్‌ గత 20 ఏళ్లలో 240 వేరుశనగ రకాలను అభివృద్ధి చేసింది. కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ, జన్యు ఎంపికల వంటి అధునాతన సాధనలతో పరిశోధనలు జరిపి, మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌ పాఠక్‌ తెలిపారు.

Read More

నానో బయోటెక్నాలజీతో సేంద్రియ సాగులో ఎన్నో ప్రయోజనాలు

ఉద్యానపంటలు, కూరగాయలు, ఆకుకూరల్లో సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో నానో బయోటెక్నాలజీతో పోషక విలువలు పెంచవచ్చని, అధిక దిగుబడి సాధించవచ్చని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, బయోఫాక్టర్‌ సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులకు నానో బయోటెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిచయం చేసి కూరగాయలు పండించారు. ఆయా కూరగాయల మొక్కలకు 40 శాతం పోషకాలు పెరగడంతోపాటు 15శాతం అధికంగా దిగుబడి వచ్చింది.
ఈ ప్రయోగ ఫలితాలను ధ్రువీకరించేందుకు ఇక్రిశాట్‌లోనిని వరల్డ్‌ వెజిటెబుల్‌ సెంటర్‌ ఆసియా శాఖకు తాజాగా హెచ్‌సీయూ, బయోఫాక్టర్‌ ప్రతినిధులు నమూనాలు పంపించారు. ధ్రువీకరణ లభించిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని రైతులను సేంద్రీయ సాగు వైపు ప్రోత్సహించనున్నారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని ఉద్యాన పంటల్లో 20-30 శాతం తగ్గించేందుకు హెచ్‌ సీయూ ఆచార్యులు డా. దివాకర్‌దాస్‌, బయోఫాక్టర్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సేంద్రీయ సాగులో ఫాలియర్‌ పిచికారీతో మొక్కలకు పోషకాలు అందుతాయి. పంటల ఉత్పత్తి పెరుగుతుంది. రసాయన ఎరువుల వినియోగం తగ్గడంతో కూరగాయలు రుచి పెరుగుతుంది.
నానో బయోటెక్నాలజీ పరిజ్ఞానంపై మూడేళ్లపాటు హెచ్‌సీయూ విద్యార్థులు, బయోఫాక్టర్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు. భవిష్యత్తులో కోళ్ల పరిశ్రమ, మత్స్యసంపద పరిరక్షణపై పరిశోధనలు చేసే అవకాశాలున్నాయి.
నానో బయోటెక్నాలజీ ఆకుకూరలు, కాయగూరలపై ప్రయోగించడం ద్వారా ఉద్యానపంటలకు ప్రయోజనం. యూరియా, రసాయన ఎరువులు వినియోగించినప్పుడు వర్షాలు కురిస్తే మొక్కలకు అవి ఎక్కువగా అందవు. భూమిలోకి వెళ్తాయి. నానోటెక్నాలజీతో నేరుగా మొక్కల్లోకే పోషకాలు వెళ్తాయి. రైతులకు ఈ సాంకేతికతో రైతులకు ప్రయోజనకరం కలుగుతుందని డా.శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ శాస్త్రవేత్త, ఇక్రిశాట్‌ అన్నారు.
ఉద్యాన పంటల్లో విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పిచికారీ మందులను వినియోగిస్తున్నందువలన రసాయన అవశేషాలు మన శరీరంలోకి వెళ్తున్నాయి. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించాలి. ఇందుకు నానో బయోటెక్నాలజీ అవసరం. తద్వారా భూసారం పెరుగుతుంది. ప్రస్తుతం పొలాల్లో ఎక్కడా కనిపించని వానపాములు ఉనికి పెరుగుతుందని డాక్టర్‌ లక్ష్మీనారాయణరెడ్డి, సీఈవో, బయోఫాక్టర్‌ అన్నారు.

Read More

రైతుకు లాభం… దేశానికి దన్ను!

కొత్త కంది వంగడంతో ఏటా మూడు పంటలు
ఎకరాకు టన్ను దిగుబడితో రూ.2.70 లక్షల రాబడి
నూతన వంగడం రూపకర్త, ఇక్రిశాట్‌ ప్రధాన శాస్త్రవేత్త గంగశెట్టి ప్రకాశ్‌

హైదరాబాద్‌లో కొత్తగా ఆవిష్కరించిన కంది వంగడం దేశ పప్పుదినుసుల రంగంలో విప్లవాత్మక మార్పులు తేనుంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చాక.. రైతుల రాబడి పెరగడంతోపాటు వినియోగదారులకు ప్రస్తుత ధరలకంటే తక్కువకే కంది పప్పు లభిస్తుందని ఐసీపీవీ 25444 వంగడం సృష్టికర్త హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ సీనియర్‌ శాస్త్రవేత్త గంగశెట్టి ప్రకాశ్‌ భరోసా ఇస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఆయన జెనెటిక్స్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇక్రిశాట్‌లో పదేళ్లుగా పనిచేస్తున్న ప్రకాశ్‌ పలు అంతర్జాతీయ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. తాజాగా ఆయన రూపొందించిన కంది రకం భారత్‌తో సహా పలు దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వంగడం విడుదల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు.

స్పీడ్‌ బ్రీడ్‌ విధానాన్ని పాటించాం
‘మనదేశంలో 1.13 కోట్ల ఎకరాల్లో, తెలంగాణలో ఏడు లక్షల ఎకరాల్లో, ఏపీలో నాలుగు లక్షల ఎకరాల్లో కంది సాగవుతోంది. అదేసమయంలో ఇతర ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ల లో దీని సాగు యేటేటా పెరుగుతోంది. ఈ దేశాలతో పోలిస్తే మన దిగుబడి తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌లో కందిపై 2021లో పరిశోధనలు ప్రారంభించాం. సంప్రదాయ విధానంలో కొత్త వంగడం రూపకల్పనకు 15 సంవత్సరాలు పడుతుంది. దీనికి భిన్నంగా స్పీడ్‌ బ్రీడ్‌ విధానాన్ని ప్రపంచంలో తొలిసారిగా వినియోగించి ఐసీపీవీ 25444 వంగడాన్ని తయారు చేశాం. తెలంగాణ, ఒడిశా, కర్ణాటకలలో ప్రయోగాత్మకంగా సాగు చేయించగా అద్భుత ఫలితాలు వచ్చాయి. దీనికి పెట్టుబడితోపాటు ఎరువులు, నీటి వినియోగం తక్కువ. దిగుబడి ఎక్కువ. ప్రతి 120 రోజులకు ఒకసారి చొప్పున ఏడాదికి మూడు పంటలు వేయవచ్చు. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు చాలు. తక్కువ ఎత్తు ఉండడంతో ఎకరం విస్తీర్ణంలో సాధారణ పంట కంటే 30% అధికంగా మొక్కలను వేయొచ్చు. దాంతో ఎకరానికి టన్ను దిగుబడి వస్తుంది. ప్రస్తుతం క్వింటాలుకు రూ. 9 వేల చొప్పున కందికి ధర ఉండగా… ఎకరాకి 90 వేల మేరకు ఆదాయం రైతుకు ఒక పంటకు వస్తుంది. మూడు పంటలతో రూ.2.70 లక్షల మేరకు రాబడి పొందొచ్చు. దేశంలో ఏటా 3.5 మిలియన్‌ టన్నుల కందుల ఉత్పత్తి జరుగుతుంది. దేశీయ అవసరాలకు యేటా 1.5 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకుంటున్నాం. కొత్త వంగడంతో దేశంలో ఉత్పత్తి సామర్థ్యం మరో పది లక్షల టన్నుల మేరకు పెరిగే అవకాశముంది. తద్వారా దిగుమతుల భారం భారీగా తగ్గి, విదేశీమారక ద్రవ్యం మిగులుతుంది. కొత్త విత్తనాలను తెలుగు రాష్ట్రాలకు సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం అని ప్రకాశ్‌ అన్నారు.

Read More