భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతుల్లో భయం
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మాట్లాడుతూ…”రైతులు పంటల ఎంపిక, పెట్టుబడుల ప్రణాళిక, మార్కెట్ పరిస్థితుల అంచనాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిస్థితి ప్రతికూలంగా మారింది. వాణిజ్య ఒప్పందం కారణంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల ఏ పంట వేయాలి… ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాల్లో రైతులకు కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందడం లేదు. దీంతో రాష్ట్రాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఎరువుల సరఫరా విషయంలో కూడా స్పష్టత లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఏప్రిల్కు కేటాయించిన ఎరువులు ఇంకా అందలేదు. రైతులకు నష్టం కలిగించే ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించాలి. ఎరువుల సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలి” అని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.


