వండని వంట… ఉల్లి – నిమ్మ పచ్చడి

రెండు ఉల్లిగడ్డలు, రెండు నిమ్మకాయలు, ఉప్పు, కారం, పసుపు ఉంటే చాలు. అయిదే నిమిషాల్లో తయారు చేసుకోగలిగే చతుర్రుచుల (పులుపు, కారం, ఉప్పు, ఉల్లిఘాటు) పచ్చడి రెడీ!

ఉల్లిగడ్డలను సన్నగా తరిగి గిన్నెలో పెట్టుకోవాలి. వీటిలో నిమ్మ రసం పిండుకోవాలి. కొద్దిగ పసుపు కలిపి అన్ని ముక్కలకు పట్టేలా స్పూన్‌తో కలపాలి. ఎవరి రుచిని బట్టి వారికి కావలసినంత కారం, ఉప్పు అదే గిన్నెలో వేసి, స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. ‘ముంతకిందిపప్పు’ అని, జాతరలలో కలుపుతారు కద, అలా బాగా కలుపుకోవాలి.

వేడి వేడి అన్నంలో, ఈ ‘ఉల్లి – నిమ్మ’ పచ్చడి వడ్డించుకుని తింటే, వండిన వంటలన్నీ బలాదూర్!

ఉల్లిపాయలలో పీచు, నిమ్మరసంలో ‘సి’ విటమిన్ పసుపులో ఆరోగ్యం అన్ని కలగలిపిన సహజ పచ్చడిది.

వేడి చెయ్యనక్కర లేదు, వేపడం కూడా అవసరం లేదు, వండవలసిన అవసరం అసలే లేదు. నిముషాల వ్యవధిలో తయారు చేసుకోవచ్చు.

వంటలు చేసుకునే స్టూడెంట్స్, సింగిల్‌గా ఉంటున్న ఉద్యోగులు, సమయం తక్కువ ఉన్నవారు, నేచురల్ పద్ధతిలో ఇలా ట్రై చెయ్యడం బెటర్. పోషకాలు, ఫ్లేవర్లు మాత్రమే కాకుండా, చాలా ముఖ్యమైన జీవశక్తి పూరితమైన పచ్చడి ఉల్లి – నిమ్మ పచ్చడి

  • రచన : కావూరి మారుతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

కాలీఫ్లవర్ పచ్చడి

1) గుప్పెడు కాలీఫ్లవర్ ముక్కలని (కట్ చేసుకున్నవి) శుభ్రం చేయడానికి, ఉప్పు నీళ్లలో 4,5 నిమిషాలు ఉంచి, తర్వాత బయటికి తీసి, మళ్ళీ మంచినీటిలో కడిగి, ఆ ముక్కలను తడి లేకుండా బట్టతో తుడవాలి లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి.

2) రెండు లావుపాటి నిమ్మకాయల రసం పిండుకోవాలి, అందులోని గింజలను తీసివేయాలి.

3) 4, 5 వెల్లుల్లి రిబ్బలు కచ్చాపచ్చాగాదంచుకోవాలి.

4) రెండు టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు.

కాలీఫ్లవర్ ముక్కలను, నిమ్మరసం, దంచిన వెల్లుల్లి, కారం, ఉప్పు… అన్నిటిని కలపాలి. ఓ పావుగంట నుంచి అరగంట వరకు అలా ఉంచాలి. (అన్నీ పచ్చివే.)

క్యాలీఫ్లవర్ ముక్కలకు పులుపు పట్టి, నములుతుంటే కరకర మంటాయి.

అన్నంలో కలుపుకున్నా, ఉప్మా లాంటి వాటిలోనూ, చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంతో తింటే, ఓ ముద్ద ఎక్కువే తింటారు.

ఫ్రిజ్‌లో అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఏ రోజుకారోజు తయారు చేసుకుని వాడుకోవడం మంచిది.

ఒక కాలీఫ్లవర్ పువ్వును, 3 లేదా 4 సార్లు ఇలా పచ్చడిగా పెట్టుకోవచ్చు.

  • రచన : తాయమ్మ కరుణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… దోసకాయ రోటి పచ్చడి

పచ్చడి కోసం కొంచెం గట్టిగా వుండే దోసకాయను తీసుకోవాలి!

కావలసిన పదార్థాలు: రెండు దోసకాయలు, మూడు నాలుగు పచ్చి మిరప కాయలు, నాలికకు కొంచెం చురుక్కు మనిపించాలనుకునే వారు ఇంకా ఒక మిరప కాయను వేసుకోవచ్చు. నాలుగు ఎల్లిపాయ రెబ్బలు (వెల్లుల్లి), కొంచెం జిలుకర (జీల కర్ర) రుచికి సరిపడ గల్లుప్పు (రాతి ఉప్పు లేదా దొడ్డుప్పు) ఇంతే సింపుల్.

చేసే విధానం: దోస కాయను చెక్కు తీసివేయాలి. తీయకపోయినా పర్వాలేదు. వారి వారి ఇష్టానుసారం చేసుకోవచ్చు. తీయకుంటేనే మంచిది. దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, అందులో పచ్చి మిరపకాయ ముక్కలు, జిలుకర, ఎల్లి పాయ, ఉప్పు కలిపి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదా మిక్సిలో వేసుకుని ఒక్కసారి తిప్పితే చాలు, తొక్కు రెడీ అయిపోతుంది. ఉడుకుడుకు (వేడి వేడి) అన్నంలో కలుపుకొని తినడమే ఆలస్యం. చెయ్యడం చాలా సులభం. ఈ దోసకాయ పచ్చడిని నిముషాలలో చేసుకోవచ్చు. ఏ రోజు చేసుకున్నది, ఆ రోజే వాడుకోవడం మంచిది. – సామల రాజవర్థన్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడికాయ కొబ్బరి పచ్చడి

పచ్చడి తయారీకి రెండు మామిడికాయలు, ఒక కొబ్బరి చిప్ప, ఐదారు వెల్లుల్లి రెబ్బలు, కొంచం జీలకర్ర, తగినంత కారం, ఉప్పు అవసరం.

మామిడి కాయల్ని కడిగి తుడిచి, ముక్కలుగా కోసుకోవాలి. అందులో జీడి ఉన్నా పిక్క ఉన్నా తీసెయ్యాలి. కొబ్బరిని కూడా ముక్కలుగా కోసుకొని, వెల్లుల్లి రెబ్బలు, కొంచం జీలకర్ర రోటిలో వేసి దంచుకోవాలి. మిక్సీలో వేసుకున్నా ఫరవాలేదు. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి మెత్తగా అయ్యేవరకు దంచుకోవాలి. అంతే పచ్చడి రెడీ. రుచికరంగా ఉంటుంది. అవసరం అనుకున్నవారు, ఎండుమిర్చి, అవాలు, కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవచ్చు. పోపు లేకపోతే ఎలా అనుకునేవారు, పోపుకు బదులుగా, గానుగ నూనెను కానీ, నెయ్యిని కానీ, ‘మామిడి-కొబ్బరి’ పచ్చడి మీద వేసుకుని తినవచ్చు. ఈ సీజన్లో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది.

  • పొనగంటి వేంకట రాజ్యలక్ష్మి, జమ్మికుంట

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… క్యారెట్ పచ్చడి

క్యారెట్ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు

  • ఒక పెద్ద క్యారెట్ దుంప
  • రెండు ఉల్లిగడ్డలు
  • ఒక వెల్లుల్లి గడ్డ
  • ఆరు పచ్చి మిరపకాయలు
  • తగినంత ఉప్పు
  • జీలకర్ర, చింతపండు లేదా నిమ్మరసం
  • సమయానికి ఉంటే, కొత్తిమీర ఆకులను వేసుకోవచ్చు.

అన్నిటినీ శుభ్రంగా నీళ్లతో కడిగి, తేమ లేకుండా నీడన ఆరబెట్టాలి.

మొదట చింతపండు, జీలకర్రలను రోట్లో వేసి మెత్తగా నూరి, అందులో క్యారెట్ ముక్కలు వేసి దంచి, అందులో పొట్టు తీసిన ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను వేసుకొని కాస్తా బరుకుగా దంచుకోవాలి.

ఉప్పు, కారం ఎవరి అబిరుచి ప్రకారం వారు కలుపుకోవాలి.

క్యారెట్ పచ్చడిలో ఉప్పు తక్కువ పడుతుంది. కనుక ఉప్పును తక్కువ వేసుకోవాలి.

పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు.
ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని వాడుకోవచ్చు. తాజాగా, సహజ సువాసనలతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం రొట్టెలు దోశెల్లో కలిపి తినడానికి రుచికరంగా ఉంటుంది.

అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు.

చిన్న రోలు, నూరే రాయి ఉంటే సరిపోతుంది.

పొయ్యి మీద వండే పనే లేదు.

  • శ్రీమతి జిట్టా జ్యోతి
Read More

వండని వంట… పప్పు పచ్చడి

పచ్చి పెసరపప్పు కానీ, పెసర్లు కానీ, మొలకెత్తిన పెసర్లు కానీ, పొట్టు పెసరపప్పు కానీ, వీటిలో ఏదైనా వాడుకోవచ్చు. పెసర్లు అయితే, నానడానికి టైం పడుతుంది. మొలకెత్తడానికి ఇంకా టైం పడుతుంది. వీటితో చేసుకోవాలంటే ముందుగా ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. అదే పొట్టు పెసరపప్పు కానీ, పెసరపప్పుతో కానీ అయితే అరగంటలో అయిపోతుంది.

దీనికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు (ఏ రకమైన పప్పు అయినా, మీ ఇష్టం) ఒక చిన్న కప్పు. ఎండుమిర్చి (ఎవరి రుచి ప్రకారం వారు వేసుకోవాలి) ఐదారు.ఉప్పు – రాళ్ళ ఉప్పు (సముద్రపు ఉప్పు కానీ పింక్ రాక్ సాల్ట్ కానీ) తగినంత. నిమ్మరసం కానీ, పుల్లటి మామిడి కాయ కానీ రుచికి తగినంత.

ఒక టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ అన్ని కలిపి నీళ్ళు లేకుండా రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాపచ్చాగా నూరుకోవాలి. మరీ మెత్తగా సుద్దలాగా నూరుకోకూడదు. మామిడికాయ అయితే, పప్పుతో పాటు వేసుకుని రుబ్బుకోవాలి. నిమ్మరసం అయితే ఆఖరున పిండుకోవాలి.

  • శ్రీమతి లతా కృష్ణమూర్తి
Read More

వండని వంట… కరివేపాకు పచ్చడి

కరివేపాకు గుండెకు మంచిది. జుట్టుని నల్లగా పెరిగేట్టు చేస్తుంది. కడుపులో ఉండే నులిపురుగుల్ని చంపివేస్తుంది. కంటి చూపుకి మంచిది. ఇన్ని రకాలుగా ఆరోగ్యాన్నిచ్చే కరివేపాకు పచ్చడి చేసే విధానం…
కరివేపాకు పచ్చడి చాలా సులువుగా చేసుకోవచ్చు. కావల్సిందల్లా పది పదిహేను ఎండు మిర్చి, రాళ్ళ ఉప్పు, గోలీకాయంత చింతపండు, అర స్పూను జీలకర్ర, కొంచెం బెల్లం ఇంక శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న గుప్పెడు కరివేపాకు. కడిగిన నీటి తాలూకా తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి.

ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు రోట్లో వేసి నూరుకున్నాక చింతపండు, పసుపు, బెల్లం వేసి ఇంకొంచెం మెదిపి చివరగా కరివేపాకు వేసి బాగా నలిగేట్టు నూరుకోవాలి. అంతే.

Read More

వండని వంట… వెజ్ మిక్స్

  1. పండిన టొమాటోలు రెండు, మూడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా తరిగి, కొంచెం కొత్తిమీర తరుగుతో సహా అన్నీ ఒక గిన్నెలో వేసుకుని, ఉప్పు వేసి చేత్తో గట్టిగా పిసుకుతున్నట్లు కలిపితే, అన్నీ చక్కగా కలిసిపోతాయి… వేడి వేడి అన్నంలో అయితే భలే ఉంటుంది!
  2. పైన చెప్పిన అన్నీ పెరుగులో కలిపి కూడా తినవచ్చు. రైతాలా ఉంటుంది.
  3. కూర దోసకాయ ముక్కలు సన్నగా తరిగి, పైన చెప్పిన పదార్థాలు అన్నీ కలిపినా, అది కూడా ఒక కూర లాగానే ఉంటుంది.
  4. పైన చెప్పిన అన్ని పదార్థాలు మరియు కీర దోస ముక్కలు కలిపినా, అది కూడా కూర లాగా తినవచ్చు.
  5. ఎండుమిరప కాయలు, ఉప్పు ..చింత పండు గుజ్జులో కలిపి తింటే బావుంటుంది. మనకు అనుకూలంగా ఉల్లిగడ్డ తరిగి వేసుకోవచ్చు. కొంచెం నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కలుపుకోవచ్చు. లేక పోయినా చాలా బావుంటుంది.
  6. పచ్చి మిరప కాయలు, ఉప్పు, కొంచెం చింత పండు మంచిగా నూరుకుని, కూర దోసకాయలు ముక్కలుగా తరిగి దానిలో వేసి కచ్చా పచ్చాగా దంచి, ఒక పచ్చడి లాగ తినొచ్చు.
  7. మనం పచ్చిగా తినగలిగే అన్ని కూరగాయ ముక్కలు (క్యారెట్, దోసకాయ, టొమాటో, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తి మీర) అన్ని ఉప్పుతో కలిపి చేత్తో గట్టిగా కలిపి పెరుగుతో అయినా, లేకుండా అయినా తినొచ్చు.
    పల్లీల పొడి, పచ్చి కొబ్బరి తురుము ఆప్షనల్.
    ఇవన్నీ… సైడ్ డిష్ లాగ తినొచ్చు….లేదా ఎమర్జెన్సీ కూరలుగా కూడా పనికొస్తాయి.
  • ప్రశాంతి

Read More

వండని వంట… తీపి రాగి పిండి

పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు, పచ్చళ్ళు… ఆహారంగా తయారు చేసుకోవడం వండని వంటలు. వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని ‘అమృతాహారం’ తినడం మంచిది. రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తి పూరితమైన ‘వండని వంట’ తీపి రాగిపిండి తయారీ ఇలా….

అరకిలో రాగులు, అరకిలో పెసలు లేదా మినుముల పిండి ప్రధానంగా అవసరం ఉంటుంది. రాగులను పెసలను పచ్చి వాటినే పిండి పట్టించాలి. వేపకూడదు (మర పట్టించడం కంటే, విసుర్రాయితో విసురుకోవడం మంచిది.పిండిని మర పట్టిస్తే, అధిక ఉష్ణోగ్రతకు గురౌతుంది)

పచ్చి వాసనే, జీవశక్తికి నిదర్శనం!

మొత్తం కిలో రాగులు, పెసలు (మినుములు) పొడిలో, సుమారు వంద గ్రాముల నెయ్యిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఆ పిండి మిశ్రమంలో ఎండుకొబ్బరి పొడి, వేరుశనగ పొడి, నువ్వుల పొడి (ఒక్కొక్కటి వంద గ్రాములు-పచ్చిపొడులు)

జీడిపప్పు, బాదాంపప్పు కూడా కాస్తా చేర్చుకోవచ్చు. వాటిని కూడా పొడి చేసుకుని కలపాలి. చివరికి ఎండుద్రాక్ష పండ్లను కూడా తగినన్ని కలుపుకోవాలి.

ఈ మొత్తం పొడుల మిశ్రమానికి సమానంగా, ముడిచక్కెర పొడిని లేదా ముడిబెల్లపు తురుమును కలిపి, యాలకుల పొడిని కూడా కలపాలి. ఖర్ౙూర పండ్లను చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చు. అన్ని రకాల ఎండుపండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

అంతే! రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తిపూరితమైన ‘వండని వంట’ సిద్దం అవుతుంది.
నెయ్యి కలుపుతాం కనుక, బయట కూడా నిల్వ ఉంటుంది.

ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి తగినంత తయారు చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసే సమయంలో ప్రధాన ఆహారంగా కూడా తినవచ్చు.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More
  • 1
  • 2