మొక్కల ఎదుగుదలకు, ఫలదీకరణ శక్తి పెరగడానికి చేప అమినో ఆమ్లం

రైతు వారీగా అతి తక్కువ శ్రమ, స్వల్ప ఖర్చుతో తయారు చేసుకోగలిగేది చేప అమినో ఆమ్లం. చేపలతో అమినో ఆమ్లాలను తయారు చేసుకునే పద్ధతిని కొరియా వ్యవసాయ శాస్త్రజ్ఞుడు డాక్టర్ చోహాన్ క్యూ రూపొందించారు. ఈ విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రాకృతిక రైతులు ఆచరిస్తున్నారు.

తయారు చేసే విధానం : ముందుగా చేప పొలుసులు, ఈకలు, తోకలు తొలగించాలి. తరువాత చేపను చిన్న, చిన్న ముక్కలుగా కోయాలి. చేప ముక్కలను తూకం వేసి దానికి సరిసమానంగా బెల్లం కలపాలి. వాటిని ఒక ప్లాస్టిక్ జాడి లేదా బకెట్‌లో మూడవ వంతు వరకు నింపుకుని పైన గుడ్డ కట్టి నీడలో పెట్టుకోవాలి. కనీసం రోజుకు ఒకసారి కలియబెట్టాలి. వాతావరణ పరిస్థితులను బట్టి 10 నుండి 15 రోజుల్లో చిక్కటి ద్రావణం తయారవుతుంది. తయారైన ద్రావణం నుండి మధురమైన వాసన వస్తుంది. ఒకవేళ చేపల వాసన వస్తుంటే దానికి మరింత బెల్లం కలిపి మరో 4,5 రోజులుంచాలి.

తయారైన ద్రావణాన్ని లీటరు నీటికి 1 నుంచి 4 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి. దీనిని అన్ని పంటలపై పిచికారి చేసుకోవచ్చు.
Read More

చేప వ్యర్థాలతో పోషక మిశ్రమం

వికె-నార్డెప్ స్థానికంగా లభించే వనరుల ద్వారా సేంద్రియ పద్ధతిలో పంటల పెరుగుదలకవసరమైన ముఖ్య పోషకాలన్నీ కలిగి ఉన్న పోషక మిశ్రమాన్ని చేప వ్యర్థాలనుపయోగించి చేసే కొత్త టెక్నాలజీని రూపొందించింది.

 తయారీ విధానం : దీని తయారీకి సుమారు 20 కి. చేపల వ్యర్థాలను సేకరించి 40 లీ. సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ క్యాన్‌లో నిల్వ ఉంచాలి. దీనికి 10 లీ. నీటిని, 20-30 మి.లీ. బొప్పాయి పాలను (పపైన్) కలపాలి. (ముదిరిన ఆకుపచ్ౘ్రంగు బొప్పాయి కాయపై బ్లేడుతో చిన్నగాట్లు చేసి పాలను సేకరించాలి).

చేప వ్యర్థాలను పపైన్‌తో బాగా కలిపి 5-8 గంటలుంచాలి. పాత్రను మూసి ఉంచి ప్రతి గంటలకు ఒకసారి కలియత్రిప్పాలి.

పులియ బెట్టడం
5-8 గంటల తర్వాత బెల్లం ద్రావణాన్ని (4 కి. బెల్లాన్ని 5 లీ. నీటిలో కలిపి) చేప వ్యర్థాలకు కలిపి బాగా కలియత్రిప్పాలి. ఈ మిశ్రమాన్ని 15-20 రోజులు బాగా పులియనివ్వాలి. ఈ సమయంలో చేప పొలుసులు, ఎముకలు బాగా క్షీణించి పోతాయి.
15-20 రోజులు పులిసిన తర్వాత పులిసిన పదార్థానికి 2 నుండి 5 రెట్లు నీరు కలిపి ద్రావణం తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. పూర్తిగా కరగని పదార్థమేదైనా ఉంటే దానిని భూమికి ఎరువుగా వేయాలి.
పంటపై పిచికారి చేయడానికి 250 నుండి 500 మి.లీ. ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ ఫార్మ్యులేషన్‌ని అన్ని కూరగాయలు, పూల పంటల్లో ఉపయోగించవచ్చు. బెండ, తోటకూర, పాలకూర, వంగ, టమాట పంటలపై విస్తృత పరిశోధనలు జరిపి మంచి ఫలితాలను పొందారు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ఇంటిపంటల సంరక్షణకు మాలి

చెన్నై నగరంలో ఇంటిపంటను పెంచుకునేవారు ఏదైనా సమస్య ఎదురైతే ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తారు. కాసేపటికే ఓ మహిళ వచ్చి తోటను బాగుచేసి వెళ్తారు. అంతేకాదు, ఆ తోటకు కావాల్సినప్పుడల్లా కేర్‌ టేకర్‌గానూ ఉంటారు. నగర ఇళ్లలో తోటల పెంపకం కోసం ఈ తరహా మహిళలు ప్రత్యేక నిపుణులుగా ఎదిగారు. వాళ్లనే ‘మద్రాస్‌ మాలి’గా పిలుస్తున్నారు.

ఇంట్లో కాస్త ఖాళీ స్థలమున్నా ఏదో ఒక మొక్క వేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ప్రత్యేకంగా నగరాల్లో ఇలాంటి ఆవరణ, మిద్దెతోటలు చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే చెన్నై రెసిలెన్స్‌ సెంటర్‌ (సీఆర్‌సి) స్వచ్చంద సంస్థ ఏళ్లుగా ఇంటి ఆవరణల్లో తోటలు పెంచేలా ప్రోత్సహిస్తోంది. వేలాది మంది ఈ ఒరవడికి అలవాటుపడ్డారుగానీ.. వారికి తోటపనిలో తరచుగా వచ్చే సమస్యల్ని తీర్చేందుకు నిపుణులు లేక నిరుత్సాహపడేవారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆలోచించిన సంస్థ సభ్యులు.. మహిళా తోట సంరక్షణ నిపుణుల్ని తీసుకొచ్చారు. స్వయం సహాయక బృంద సభ్యులు (ఎస్‌హెచ్‌జీ)గా ఉంటూ చురుకైన పాత్ర పోషించే 250మందిని చెన్నైలో ఎంపికచేశారు. రెండేళ్లు శిక్షణ ఇవ్వడంతో పాటు ‘మద్రాస్‌ ‘మాలి’ పేరుతో వారికి ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ఇంటి తోటల్ని పెంచుతున్నవారికోసం వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

నెలనెలా ఆదాయం
మద్రాస్‌ మాలి.. ఇప్పుడు ఎస్‌హెచ్‌జీలోని పేద, మధ్యతరగతి మహిళలకు ఆదాయవనరుగా మారుతోంది. ‘ఆసక్తి చూపినవారి తోటలకు కేర్‌టేకర్లుగా ఉంటారు. ప్రతీవారం వారి ఇళ్లను సందర్శిస్తారు. ఏ సమయంలో ఏ మొక్కలు నాటాలి. మంచి దిగుబడి ఎలా రాబట్టాలి. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు నిర్వహణ… వంటివి వారికి వివరిస్తుంటారు. ఇలా నెలకు రూ.20వేల దాకా సంపాదిస్తున్నారు.

ఇంటి పంటపై అవగాహన
ఇళ్లలోనే కాదు.. చెన్నైలోని 114 అంగన్వాడీ కేంద్రాలు, 16 ప్రభుత్వ పాఠశాలల్ని ‘మద్రాస్‌ మాలి’ సభ్యులు తోటలతో పర్యావరణహితంగా మార్చారు. అక్కడ పనిచేసే ఆడవారికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆయా కేంద్రాల్లోని పిల్లలకు ఈ తోటల్లోని ఆరోగ్యకర కూరగాయలే వండి తినిపించేలా చేస్తున్నారు. మరోవైపు చెన్నైలోని వివిధ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లతో కలిసి ఆయా కాలనీల్లో పట్టణ తోటలమీద అవగాహన పెంచుతున్నారు. కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతోన్న చెన్నైలాంటి నగరాలు దేశంలో చాలా ఉన్నాయి. వాటన్నింటికీ పరిష్కారంగా మేం ‘మద్రాస్‌ మాలి’ వ్యవస్థను రూపొందించాం అని సంస్థ సభ్యులు అంటున్నారు.

Read More