యుద్ధం వలన గుడ్ల ఎగుమతులకు దెబ్బ
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పది రోజులుగా రోజుకి రూ. 4 కోట్ల విలువైన గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో తెలంగాణా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గుడ్లు కార్గో ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. బయటి నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం విపణిలో హోల్సేల్గా ఒక గుడ్డు ధర రూ.4.20 ఉండగా, రిటైల్ రూ. 5కు అమ్ముతున్నారు. మరోవైపు రిటైల్ అమ్మకందారులు తమ షాపుల్లోనే ఎక్కువగా ఉన్నాయని, కొత్తగా ఆర్డర్లు తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో పౌల్ట్రీఫాం యజమానులు, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. ఇది పౌల్ట్రీ రంగానికి ఊహించని ఉత్పాతమని తెలంగాణ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


