పల్నాడు జిల్లాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక నేతాజీ సుభాష్ – ఐసీఏఆర్ అంతర్జాతీయ ఫెలోషిప్

పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం, గుత్తికొండ గ్రామానికి చెందిన ఇంజనీర్ నలబోలు కిషోర్ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) అందించే ప్రతిష్టాత్మక “నేతాజీ సుభాష్ – ఐసిఎఆర్ అంతర్జాతీయ ఫెలోషిప్ – 2025”కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డా. ఎన్.టి.ఆర్. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల యందు వ్యవసాయ యాంత్రీకరణ భాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి నాగేశ్వరరావు, సాధారణ మధ్యతరగతి రైతు మరియు తల్లి గృహిణి.

ఈ ఫెలోషిప్ క్రింద అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా - లింకన్‌లో “పక్వ దశలో ఉన్న పత్తి బోళ్లను గుర్తించే మల్టీమోడల్ సెన్సార్ ఫ్యూజన్, మల్టీ పాస్ పీకింగ్ మరియు ప్రెసిషన్ నావిగేషన్ సాంకేతికతలతో సెలెక్టివ్ రోబోటిక్ కాటన్ హార్వెస్టర్ రూపకల్పన మరియు ఆప్టిమైజేషన” అనే అత్యాధునిక పరిశోధన అంశంపై పీహెచ్.డి పరిశోధనలు నిర్వహించనున్నారు. ఇంజనీర్ నలబోలు కిషోర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల యందు 2012వ సంవత్సరంలో వ్యవసాయ ఇంజనీరింగ్ పూర్తిచేశారు ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి 2016వ సంవత్సరంలో ఫామ్ మెషినరీ మరియు పవర్ ఇంజినీరింగ్‌లో ఎం.టెక్ పూర్తి చేశారు. 2017 ఆగష్టు నుండి వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ పరిశోధనా  స్థానం, అనంతపురములో తన వృత్తిపరంగా ప్రస్థానం మొదలుపెట్టారు. వ్యవసాయ యంత్రీకరణ, ప్రెసిషన్ వ్యవసాయం, నీటి సంరక్షణ, వ్యవసాయ పరికరాల అభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేశారు.

రైతులకు ఉపయోగపడే అనేక వినూత్న వ్యవసాయ యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో  కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అంతర్జాతీయ  ఫెలోషిప్ ద్వారా విదేశీ విశ్వవిద్యాలయంలో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై పరిశోధనలు చేసే అవకాశం లభించింది. దేశవ్యాప్తంగా వున్న 74 ఐసిఎఆర్ పరిధిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో మొట్టమొదటిసారిగా నలబోలు కిషోర్ మాత్రమే ఈ ఫెలోషిప్ రావడం పట్ల కుటుంబ సభ్యులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. పాలడుగు వెంకట సత్యనారాయణ మరియు అదికారులు, సహచర శాస్త్రవేత్తలు, కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఫెలోషిప్‌లో భాగంగా కిషోర్‌కి మూడు సంవత్సరాల పీహెడీ పూర్తి చేయడానికి 75,000 అమెరికన్ డాలర్లు ఐసిఏఆర్ అందచేయడం జరుగుతుంది.
Read More

రెండు మూడు నెలలు ముందుకు ఖరీఫ్ సాగు

అన్ని రిజర్వాయర్లలో నీరు అందుబాటులో ఉందని, ముందస్తు సాగు చేస్తే తుపాన్ల నుంచి తప్పించుకోవచ్చని, ఖరీఫ్ సీజన్‌ను రెండు, మూడు నెలలు ముందుకు తెస్తున్నామని, దీనిపై రైతులకు శాసనసభ్యులు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలివీ.. “క్లస్టర్ బేస్డ్ విధానంలో ఉద్యానపంటల సాగుకు ముందుకెళ్తున్నాం. వివిధ పంటల సాగుకు అనుగుణంగా జిల్లాలను క్లస్టర్లుగా విభజించి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. వ్యవసాయం నుంచి ఉద్యానసాగు వైపు రైతులు మళ్లితే లాభాలొస్తాయి. ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు గతంలో ఇచ్చినట్లే డ్రిప్‌లు, స్ప్రింక్లర్లను రాయితీపై అందిస్తాం. గతేడాది వ్యవసాయ యాంత్రీకరణకు రూ.61 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది రూ.137 కోట్లు కేటాయించాం అని అన్నారు.

Read More