ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె

జన్యు సవరణ ద్వారా సృష్టి

ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ (జీన్‌ ఎడిటింగ్‌) ద్వారా సృష్టించడంలో జమ్మూ కశ్మీర్‌లోని షేర్‌-ఎ-కశ్మీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీకి (ఎస్‌కేయూఏఎస్‌టీ) చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్‌లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చరిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్‌ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. నాలుగేళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్‌ రియాజ్‌ అహ్మద్‌ షా నాయకత్వం వహించారు. ‘జన్యు సవరణ ద్వారా 30 శాతం ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని సృష్టించగలిగాం. భారతీయ రకాల్లో సహజంగా మాంసం వాటా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ఐరోపా గొర్రె జాతుల్లో మాంసం అధికంగా ఉండేలా జన్యు నిర్మాణం ఉంటుంది’ అని అహ్మద్‌ షా తెలిపారు. ‘సంకరం ద్వారా కాకుండా జన్యు సవరణ ద్వారా జన్యు మార్పిడి సాధించడం ఒక నవ్య సాంకేతిక ఘన విజయం. ఇది 21వ శతాబ్దంలో ఆవిర్భవించిన కృత్రిమ మేధ లాంటిదే’ అని పేర్కొ న్నారు. ‘ఇది కేవలం ఒక గొర్రె పిల్లను పుట్టించడం కాదు. జన్యు ఆధారిత పశుగణాభివృద్ధిలో ఒక కొత్త ఆవిష్కారం. కొత్త జన్యు పదార్థాన్ని ప్రవేశపెట్టకుండా ప్రయోజనకరమైన జన్యు సవరణ చేసే సత్తా మనకుందని చాటుకున్నాం’ అని ఆయన వివరించారు. అహ్మద్‌ షా నేతృత్వంలోని పరిశోధక బృందం 2012లో అత్యంత ఖరీదైన ఉన్నిని అందించే కశ్మీరీ పష్మీనా గొర్రె ‘నూరీ’ అనే జన్యు సమరూప జీవిని (క్లోన్‌) ఆవిష్కరించింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

Read More

అమరావతిలో పురుగుమందులు లేని ఆహారం అందేలా చూస్తాం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు

ఒకసారి దావోస్‌లో మాట్లాడే సమయంలో గ్లోబల్‌ వార్మింగ్‌లో ప్రకృతి వ్యవసాయం కూడా ముఖ్యం అని చర్చ వచ్చింది. ఆ చర్చ సమయంలో ఏం చేయాలని ముందుచూపుతో ఆలోచించి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ గారిని పిలిపించి మాట్లాడి శిక్షణా తరగతులు నిర్వహించి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ విజయకుమార్‌ గారిని సిఈఓగా నియమించి, ప్రకృతి వ్యవసాయాన్ని సపోర్టు చేయడం వలన ఇప్పుడు ప్రపంచం మొత్తం మనం అవలంభించే ప్రకృతి వ్యవసాయం చూడటానికి వస్తున్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసి ప్రపంచానికే ఆదర్శంగా మనం తయారు కాబోతున్నాం. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఆహారాన్ని అందించాలని చెప్పడం జరిగిందని, అమరావతిలో పురుగు మందులు లేని ఆహారాన్ని అందించేలా చూడటానికి ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో ఉపన్యసించారు.

Read More

సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు

కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) దేశంలోనే పేరెన్నికగల వ్యవసాయ శిక్షణా సంస్థ. సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులు, ఎఫ్‌పిఓలు/ సహకార సంఘాల నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు లోతైన శాస్త్రీయ అవగాహన, ఆచరణాత్మక శిక్షణ కల్పించడానికి ఎన్‌ఐపిహెచ్‌ఎం 3 నెలల సర్టిఫికెట్‌ కోర్సు తెలుగు/హిందీ భాషల్లో నిర్వహించనుంది.
నూటికి నూరు శాతం రసాయనాలు లేకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయదలచిన వారికి ఇది సదవకాశం. నవంబర్‌ 27 నుంచి వచ్చే మార్చి 5 వరకు ఈ కోర్సు ఉంటుంది. వివిధ కేంద్ర వ్యవసాయ సంస్థలతో కలసి ఎన్‌ఐపిహెచ్‌ఎం నిర్వహించే ఈ కోర్సులో 3 థలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపిహెచ్‌ఎం ఆవరణలో శాస్త్రీయ అంశాల బోధన. తర్వాత అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 2 నెలలు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు. ఆ తర్వాత ఎన్‌ఐపిహెచ్‌ఎంలో 10 రోజుల తుది థ శిక్షణ ఉంటాయి.
ఇంటర్‌ లేదా టెన్త్‌ తర్వాత వ్యవసాయ డిప్లొమా చేసిన 18 ఏళ్లు నిండిన అన్ని సామాజిక వర్గాల స్త్రీ, పురుషులు అర్హులు. గ్రామీణ యువతకు ప్రాధాన్యం. కోర్సు ఫీజు: రూ. 7,500./-లు శిక్షణా కాలంలో ఉచిత వసతి కల్పిస్తారు. భోజనానికి రోజుకు రూ. 305/-లు అభ్యర్థి చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్‌ ఇస్తారు. దరఖాస్తులను నవంబర్‌ 22 లోగా పోస్టు/మెయిల్‌ ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్‌ డా.కె. దామోదరాచారి (9542638020)ని సంప్రదించవచ్చు.
అడ్రస్‌:
To
The Director, Plant Health Management,
National Institute of Plant Health Management (NIPHM),
Rajendranagar, Hyderabad – 500 030
mail: dirphmniphm-ap@nic.in or asomicroniphm2019@gmail.com

Read More

వక్క సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతం

నిపుణులతో చర్చించి సాగుపై నిర్ణయం : మంత్రి తుమ్మల
ఏలూరు జిల్లా కామవరపుకోటలో మంత్రి తుమ్మల పర్యటన
వక్క పంట సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతమని, నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పంట రైతన్నలకు సిరులు కురిపిస్తుందని, తెలంగాణలో సైతం సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా కామవరపు కోటలో ఆదివారం వాణిజ్య పంట అయిన వక్క సాగును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ పంట సాగు చేస్తున్న రైతులతో సాగు పద్ధతులు,ఆ దాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో దీని విస్తరణ అవకాశాలపై నిపుణులతో చర్చించారు. వక్క సాగుకు అనుకూల నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి వినియోగం తదితర అంశాలపై నిపుణులతో చర్చించి సాగును ప్రోత్సహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Read More

వ్యవసాయంలోనే తృప్తి

మనది వ్యవసాయక దేశం. ఒకప్పుడు 90 శాతానికి పైగా ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో వ్యవసాయం చేయడము చాలా కష్టంగా ఉండడముతో పాటు వ్యవసాయంలో ఆర్థికంగా ఫలితాలు సక్రమంగా లేకపోవడము, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారు శారీరక శ్రమ తక్కువ చేస్తూ ఆర్థికంగా ఎదగడం లాంటి పరిణామాలు ప్రత్యక్షంగా చూసిన చాలామంది వ్యవసాయరంగాన్ని వదలి ఉద్యోగ, వ్యాపార రంగాలకి వలసలు పోవడం జరిగింది. కానీ కాలం గడిచేకొలది, ఆరోగ్యంపై అవగాహన పెరిగే కొలది ఆరోగ్యంగా ఉండాలంటే ఉద్యోగ, వ్యాపార రంగాల కంటే వ్యవసాయ రంగమే సరైనదారి అని నమ్మి ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చే కొంతమంది ఉద్యోగ, వ్యాపార రంగాల నుంచి వ్యవసాయ రంగంవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా సేంద్రియ సాగు గురించి అవగాహన పెరిగిన తరువాత మనం ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రియ ఉత్పత్తులు తప్పనిసరిగా తినాలనే అవగాహన ప్రజలలో పెరగడము మొదలైన దగ్గరి నుంచి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టేవారి సంఖ్య ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఒక రంగం అనేకాకుండ ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, సేవా రంగం ఇలాంటి రంగాల నుంచే కాకుండా ఉన్నత చదువులు చదివే విద్యార్థుల కూడా తమ విద్య పూర్తి అయిన తరువాత వ్యవసాయ రంగంలో అడుగు బెడుతున్నారు. ఇలాంటి వారితో పాటు ఆర్థిక అవసరాల నిమిత్తం సొంత పొలం ఉన్నా కాని వ్యవసాయ రంగాన్ని వదలి వేరే రంగాలకు వెళ్ళిన వారు ఆర్థికంగా ఇబ్బందులు లేని స్థాయికి ఎదిగిన తరువాత తమ మూలాలను వెతుక్కుంటూ తిరిగి వ్యవసాయ రంగంలో ప్రవేశించారు. ఇంకా ప్రవేశిస్తూనే ఉంటారు. ఈ కోవకు చెందుతాడు బాపట్ల జిల్లా వేమూరు మండలం, జంపని గ్రామానికి చెందిన శ్రీనివాసరావు.

శ్రీనివాసరావుది వ్యవసాయ నేపథ్యం. అయినా కాని చదువు పూర్తి కాగానే అందరిలాగానే వ్యవసాయాన్ని వదిలి వేరే రంగాలకు వెళ్లడం జరిగింది. అందులో భాగంగా కొన్ని సంవత్సరాలు మలేషియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం, కొంతకాలం బంధువులకు సంబంధించిన రైల్వే కాంట్రాక్టు పనులు చూసుకోవడం జరిగింది. ఎన్ని చేసినా కాని తృప్తి లేకుండాపోయింది. తాను ఏదో కోల్పోయిన భావం కలుగుతుంది. తనకు తృప్తి కావాలంటే తిరిగి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టాల్సిందేనని గ్రహించి వ్యవసాయరంగంలో అడుగు పెట్టడం జరిగింది. తరువాత కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాల వలన తన సమయాన్ని మొత్తం పూర్తిగా వ్యవసాయంలో కేటాయించవలసి వచ్చి, సేంద్రియ పద్ధతులు పాటించాలని భావించి గత 6 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం 9 ఎకరాలలో వరితో పాటు ఒక ఎకరంలో నిమ్మ, ఒక ఎకరంలో ఐదు అంచెల విధానంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ సమీకృత వ్యవసాయంలో భాగంగా నాటుకోళ్ళను కూడా పెంచుతూ, నీటికుంటలో వర్షాకాలంలో చేపలు కూడా పెంపకం చేస్తున్నాడు.

నిమ్మ: ఒక ఎకరంలో నిమ్మతోట సాగులో ఉంది. దాని వయస్సు 15 సంవత్సరాలు. కాని గత 6 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ నిమ్మ మొక్కలను సాగు చేస్తున్నాడు. నిమ్మ తోట సాగు అనుభవంలో కొత్తగా నిమ్మ తోట పెట్టేవారు 18þ18 లేదా 18þ15 అడుగుల దూరం పాటించి నిమ్మ మొక్కలు నాటుకుంటే అనుకూలంగా ఉంటుందని అంటున్నాడు. గుంతలలో బాగా మాగిన పశువుల ఎరువు, వేపపిండి, ఆముదం పిండి, జీవామృతం కలిపిన మిశ్రమాన్ని వేసి మొక్కలు నాటుకోవాలి. తమ పొలంలో నాటు నిమ్మ మరియు బాలాజి రకం నిమ్మ రెండు రకాలు ఉన్నాయి కాని ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు నాటు నిమ్మ రకం అనకూలంగా ఉంటుందని అంటున్నాడు. అవసరాన్నిబట్టి పైపాటుగా అప్పుడప్పుడు మాగిన పశువుల ఎరువు, వేపపిండి, ఆముదపు పిండి, వేరుశనగ పిండిల మిశ్రమాన్ని మరియు ద్రవజీవామృతాన్ని భూమికి అందిస్తుంటాడు. చీడపీడల నివారణకు మరియు మంచి దిగుబడికి గాను వేపనూనె, పుల్లటి మజ్జిగ, నీమాస్త్రం, పంచగవ్య, సప్తధాన్యాంకుర కషాయం, చౌహాన్‌ క్యూ పద్ధతిలో ఉన్న ం.క. ద్రావణం లాంటి వాటిని అవసరాన్ని బట్టి పిచికారి చేస్తుంటాడు. అన్ని అనుకూలంగా ఉంటే నిమ్మ మొక్కలు నాటిన తరువాత 3వ సంవత్సరం దిగుబడి మొదలయ్యి క్రమంగా దిగుబడి పెరుగుతూ చెట్టు బాగా ఎదిగిన తరువాత ఎకరం నుంచి 100 నుంచి 150 బస్తాల నిమ్మకాయల దిగుబడి పొందవచ్చు. మార్కెట్‌లో ఉన్న ధరలను బట్టి ఆదాయం వస్తుందని వివరించాడు. 

ఐదు అంచెల పద్ధతి: ఒక ఎకరం పొలాన్ని ఐదు అంచెల పద్ధతికి కేటాయించి 50 అడుగుల పొడవు మరియు వెడల్పును ఎంపిక చేసుకున్నాడు. ప్రస్తుతం మామిడి, కొబ్బరి, అరటి, మునగ, జామ లాంటి మొక్కలు నాటించాడు. మిగతా మొక్కలు మరియు వివిధ రకాల కూరగాయలు త్వరలో మొదలు పెట్టబోతున్నాడు. ఐదు అంచెల పద్ధతికి గాను అడుగు ఎత్తులో బెడ్‌లు చేసుకొని బెడ్‌లపై మొక్కలు నాటించాడు. నీటి వసతి కొరకు కాలువలు ఉన్నా కాని వివిధ రకాల మొక్కలకు నీటి అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి నీటిని కాలువ ద్వారా కాకుండా డ్రిప్పుద్వారా అందిస్తే అనుకూలంగా ఉంటుందని శ్రీనివాసరావు అంటున్నాడు.

నాటుకోళ్ళు: సేంద్రియ సాగులో ఆర్థికంగా ఫలితాలు రావాలంటే సమీకృత వ్యవసాయం సరైన దారి అని తెలుసుకున్న శ్రీనివాసరావు నాటుకోళ్ళ పెంపాకన్ని కూడా చేపట్టాడు. మొదట 50 కోళ్ళతో మొదలయితే సంవత్సరంలో 500 కోళ్ళు అయినాయి.  అందులో 100 కోళ్ళు అమ్మగా ప్రస్తుతం 400 కోళ్ళు ఉన్నాయి. ఈ కోళ్ళన్నీ కూడా ఐదు అంచెల పద్ధతి వేసిన పొలంలో తిరుగుతూ ఉంటాయి. అదనంగా ఆవుల పేడ మరియు కొంత దాణాని కూడా అందిస్తున్నాడు. సక్రమంగా చేసుకుంటే నాటుకోళ్ళు మంచి ఆదాయ వనరే… కానీ కోళ్ళకు వచ్చే వ్యాధులపై సరిగ్గా అవగాహన లేకపోవడం, పొలం మొత్తాన్ని ఒంటరిగా చూసుకోవలసి రావడము, బయట నుంచి వచ్చే వారి వలన కోళ్ళకు జబ్బులు వచ్చే అవకాశాలు ఉండడము లాంటి కారణాల వలన తాను సక్రమంగా కోళ్ళ పెంపకాన్ని చేయలేకపోతున్నానని అంటూ, ఒక వ్యక్తిని కోళ్ళ పెంపకానికి కేటాయించగలిగితే స్వయం ఉపాధిగా కోళ్ళ పెంపకం మంచి అవకాశం అని శ్రీనివాసరావు అంటున్నాడు.

వీటన్నింటితోపాటు ఎకరం పొలం అంటే 200 అడుగుల పొడవు మరియు వెడల్పుతో చెరువు తవ్వించాడు. ఆ చెరువు తవ్విన మట్టిన ఐదు అంచెల విధానంలో బెడ్‌లకు ఉపయోగించాడు. చెరువు కట్ట మీద కొబ్బరి మొక్కలు మధ్యలో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలతో పాటు పైనాపిల్‌ మొక్కలు, వివిధ రకాల కూరగాయ మొక్కలు సాగు చేస్తున్నాడు.  వేసవి కాలంలో చెరువులో నీటిని పంటల సాగుకు వినియోగిస్తూ వర్షాకాలంలో చెరువులో బాగా నీరు ఉన్నప్పుడు కొన్ని చేపలను కూడా పెంపకం చేస్తుంటాడు. వీటన్నింటితో పాటు గట్ల మీద అవకాశం ఉన్న చోట కంది మొక్కలు నాటి వచ్చిన దిగుబడిని సొంతంగా ఉపయోగించుకోవడముతో పాటు మిగిలిన వాటిని బంధువులకు, తెలిసిన వారికి అమ్మి అదనపు ఆదాయం గడిస్తున్నాడు.

సేంద్రియ సాగుకు ముఖ్య వనరు అయినటువంటి దేశీయ జాతి ఆవులను నాలుగింటిని పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తున్నాడు. పాలను అమ్మకం చేయకుండా సొంతానికి ఉపయోగించుకోగా మిగిలిన పాలను పుల్లటి మజ్జిగ తయారు చేపించి పంటలకు పిచికారి చేస్తుంటాడు. మరిన్ని వివరాలు 73374 53266 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

Read More