మార్కెట్ అధికారుల నిర్లక్ష్యంపై కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి సీరియస్
సికింద్రాబాద్ బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ నిర్వహాణపై రైతు కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్కెట్ అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంపై కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకే రైతు కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులు రాములు నాయక్, భవానీ రెడ్డి..మార్కెట్ను అకస్మిక తనిఖీ చేశారు. దాదాపు గంటన్నర పాటు అక్కడే ఉండి.. మార్కెట్ యార్డులో సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించారు. చాలా సేపు మార్కెట్ యార్డులో తిరిగి అక్కడికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చే రైతులు, వ్యాపారస్తులు, హామాలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మార్కెట్ కార్యాలయంలోని రికార్డులను, అటెండెన్స్ రిజిస్టర్లను కమిషన్ బృందం పరిశీలించింది. గత మూడు, నాలుగు రోజులు మార్కెట్ సెక్రెటరీ అందుబాటులో లేకపోవడం, కింది స్థాయి సిబ్బంది కూడా సమయానికి రాకపోవడంపై కమిషన్ చైర్మన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒకే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ విధుల్లో ఉండడం చూసి.. కమిషన్ ఆశ్చర్యానికి లోనైంది. ఇంత పెద్ద మార్కెట్లో ఒకే ఒక అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండడం ఏంటనీ ప్రశ్నించింది. ప్రతిరోజు బోయిన్పల్లి మార్కెట్ కు ఏఏ రాష్ట్రాల నుండి కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు వస్తాయో అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో కూరగాయల వ్యర్ధాలతో గ్యాస్ ఉత్పత్తి చేయడానికి గతంలో బయో గ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అయితే గత మూడు నెలల నుండి ప్లాంట్ నడవకపోవడంతో.. కూరగాయల వ్యర్ధాలను తరలించడానికి ప్రతినెల మార్కెట్ కమిటి నాలుగున్నర లక్షల రూపాయలను ఖర్చుచేస్తున్న విషయం కమిషన్ దృష్టికి వచ్చింది. మార్కెట్ యార్డులో కూరగాయల అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలపై కమిషన్ ఆరా తీసింది. బోయినపల్లి మార్కెట్ కమిటీలో ఉద్యోగుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, షాపుల వివరాలు అన్ని కమిషన్కు నివేదిక రూపంలో అందించాలని సూచించింది. మార్కెట్ను సందర్శించిన వారిలో కమిషన్ అధికారులు హారివెంకట ప్రసాద్, మహేష్ నాయక్ తదితరులు వున్నారు.